Sharmila Vs Jagan: ఈ ఎలక్షన్ వైఎస్సార్సీపీ(YSRCP)కి ఎంత ఇంపార్టెంటో ఏపీ రాజకీయాలను(AP Politics) గమనించే ప్రతీ ఒక్కరికీ తెలుసు. సంక్షేమమే ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లిన వైఎస్ జగన్(YS Jagan) తను ఇచ్చిన మేనిఫెస్టో(Manifesto)లో ప్రతీ వాగ్దానాన్ని నెరవేర్చానని పదే పదే చెబుతూనే వస్తున్నారు. ఆ కాన్ఫిడెన్స్‌తోనే వైనాట్ 175 అంటూ ఎలక్షన్‌కి వెళ్లటమే కాదు సిట్టింగ్‌లను మార్చేయటం, వారసులకు టికెట్లు ఇవ్వటం ఇలా చాలా అగ్రెసివ్ మోడ్‌లో ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో షర్మిల(Sharmila) తీసుకుంటున్న స్టెప్‌ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారనుంది. ఇది రెండోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్(Jagan) ఆశయానికి హర్డిల్‌ కానుందా. జగనన్న వదిలిన బాణంగా ఆ పార్టీ అధికారంలోకి రావటానికి సాయపడిన సొంత రక్తమే ఇప్పుడు బాకులా మారి విజయానికి అడ్డుపడనుందా.. ఇదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్.


ఒక్కసారిగా ఏపీవైపు దృష్టి


నిన్న మొన్నటి దాకా తెలంగాణ(Telangana) మాత్రమే తన పోరుగడ్డ అని బలంగా అరిచి చెప్పిన వైఎస్ షర్మిల ఇప్పుడు శరవేగంగా ఏపీ పాలిటిక్స్ వైపు కదులుతున్నారు. అది కూడా అధికారంలో ఉన్న తన అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వేరే పార్టీలోకి. ఏ పార్టీతో అవమానాల పాలుపడ్డానని.. తమపై కక్షసాధించారని వైఎస్సార్ సెంటిమెంట్‌తో కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చారో ఇప్పుడు అదే పార్టీలోకి షర్మిల వెళ్తున్నార. ఢిల్లీ వెళ్లి రాహుల్, సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతుండటం కచ్చితంగా జగన్‌కు మింగుడుపడని వ్యవహారమే. 


బైబై బాబుతో ఫేమస్


జగన్ జైలులో ఉన్నప్పుడు 2014కి ముందు వైసీపీ బాధ్యతలను భుజాన మోస్తూ సుదీర్ఘ పాదయాత్ర చేశారు షర్మిల. 2014 ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని విస్తృతంగా ప్రజల్లో తిరుగుతూ పోరాడారు. కానీ టీడీపీ అధికారం కైవసం చేసుకోవటం, ఈలోగా జగన్‌కు బెయిల్ రావటంతో షర్మిల మెల్లగా యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమయ్యారు. తిరిగి 2019 ఎన్నికల టైమ్‌లో యాక్టివేట్ అయ్యారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా బైబై బాబు అనే నినాదంతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లారు. వైసీపీ 151సీట్లతో అఖండమైన విజయాన్ని సాధించింది.


తెలంగాణ నుంచి ఏపీ దిశ మార్చుకున్న షర్మిల 


తన కష్టాన్ని అన్నగుర్తించి పార్టీలో కీలకపదవి అప్పగిస్తారని షర్మిల.. భావించగా అది జరగలేదు. ఈ లోగా జరిగిన వేర్వేరు పరిణామాలతో షర్మిల ఏపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణలో వైఎస్సాఆర్ పేరు మీద వైఎస్సార్ తెలంగాణపార్టీని స్థాపించారు. తెలంగాణలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజావ్యతిరేకతను ఏకం చేస్తూ అనేక ఆందోళనలు, దీక్షలు చేశారు. తీరా ఎన్నికల టైమ్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయలేక అలా అని పొత్తూ పొట్టుకోలేక బయట నుంచి సపోర్ట్ చేశారు. ఎన్నికల పోటీ నుంచి తప్పుకొని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే షర్మిల కాంగ్రెస్ చేరతారనే ప్రచారం జరిగినా అది కాస్త ఆలస్యమై ఆఖరకు ఏపీ వైపు తిరిగింది.


ఇప్పుడు షర్మిల కాంగ్రెస్‌లో తన అనుచరులతో కలిసి చేరుతున్నారు. షర్మిలకు ఏపీసీసీ చీఫ్ పదవి ఇస్తారని..ఎన్నికలకు వైఎస్సాఆర్ సెంటిమెంట్ తో షర్మిల కాంగ్రెస్ ను ఏపీలో లీడ్ చేస్తారని ఊహాగానాలు నడుస్తున్నాయి. వైఎస్ సెంటిమెంట్, క్రిస్టియన్ ఓట్ బ్యాంకు షర్మిల ప్రభావితం చేస్తారని అది ఆ వైసీపీకి డిస్ అడ్వాంటేజ్ అని అందరూ అనుకుంటున్నదే. మరికొంత మంది మాత్రం సెంట్రల్ లెవల్లో షర్మిల సేవలను వినియోగించుకోవాలని భావిస్తోందని అంటున్నారు. అందుకోసమే ఆమెకు పార్టీలో కీలకపదవితో పాటు రాజ్యసభ ఆఫర్ చేస్తారని మరో ప్రచారం జరుగుతోంది. 


ఈ క్లారిటీ వచ్చేలోపు తన అన్న సీఎం జగన్ ను షర్మిల కలవనున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని జరుగుతున్న ఈ మీటింగ్ ఎలాంటి పరిణామాలకు దారి తీయనుందనే ఆలోచనే ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్‌గా ఉంది. శుభకార్యం సందర్భంగా అన్నాచెళ్లెళ్లు కలిసిపోతే షర్మిల తన నిర్ణయం మార్చుకుంటారా లేదా కాంగ్రెస్‌లో చేరతాననే తన మాటకు కట్టుబడి తన అన్నకే వ్యతిరేకంగా వచ్చే ఎన్నికలకు వెళ్తారా అనేది ఇప్పుడు వైఎస్సాఆర్ సీపీ ని అంతర్మథనంలో పడేస్తున్న మిలియన్ డాలర్స్ క్వశ్చన్. ఒకవేళ వ్యతిరేకమైతే మాత్రం ఒకప్పుడు జగనన్న వదిలిన బాణమే ఇప్పుడు బాకులా మారి అన్న రాజకీయానికి అడ్డుపడుతుందా అనే అంశంపై అందరి ఆసక్తి నెలకొనింది.