Pawan Kalyan :    జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్‌తో రెండు సార్లు భేటీ అయ్యారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో అరగంట పాటు చర్చలు జరిపారు. అయితే అసలు ఏజెండా ఏమిటి ? బీజేపీ అగ్రనేతలు పిలిస్తే వెళ్లారా లేకపోతే సొంతంగానే బీజేపీ హైకమాండ్ తో చర్చలు జరపడానికి వెళ్లారా అన్నదానిపై స్పష్టత  రాలేదు. రాబోయే రోజుల్లో అని చెబుతానన్నారు. కానీ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన అజెండా అని స్పష్టం చేశారు. ఓట్లు చీలకూడదనేది తన వ్యూహమన్నారు. అంతే తప్ప బీజేపీతో  పొత్తు కొనసాగుతుందా లేదా అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేకపోయారు. 


వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మాటనే మళ్లీ చెప్పిన పవన్ !


బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం తర్వాత పవన్ కల్యాణ్ .. అధికారం సాధించే దిశగానే చర్చలు జరిపామని ప్రకటించారు. బీజేపీ, జనసేన లక్ష్యం వైసీపీని ఓడించడమన్నారు.  రెండు రోజుల పాటు జరిగిన చర్చల వల్ల రాబోయే రోజుల్లో మంచి ఫలిాలు వస్తాయన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్  జనసేన ఎజెండా అని అని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అన్ని విషయాలు చెబుతానని పవన్ చెప్పారు. వైసీపీ వ్యతిరేక  ఓటు చీలకూడదనేదే మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అయితే పవన్ కల్యాణ్ మాటల్లో ఎప్పటి లాంటి అస్పష్టతే స్పష్టంగా కనిపించింది.  ఓట్లు చీలకూడదనుకుంటే  టీడీపీతో వెళ్లాల్సి ఉంటుంది. కానీ బీజేపీ, జనసేన లక్ష్యం వైసీపీని ఓడించడమేనని పవన్ చెబుతున్నారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఓట్లు చీలడం ఖాయమని రాజకీయవర్గాలు చెబుతున్నారు. మరి పవన్ ఏమనుకుంటున్నారన్నది స్పష్టత లేకుండా పోయింది. 


పొత్తు వదులుకుంటానని చెప్పలేక మొహమాటపడుతున్నారా ?


 ఏపీలో బీజేపీ-జనసేన మధ్య అధికారికంగా పొత్తున్నప్పటికీ ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించడంలేదు. తెలుగుదేశం పార్టీకి చేరువవుతున్న జనసేనాని బీజేపీ కూడా పొత్తుకు కలిసిరావాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే  ఈ విషయంలో ఆలోచన ఏమిటన్నదానిపై క్లారిటీ లేదు.  ఇప్పటికీ బీజేపీ, జనసేన పొత్తులోనే ఉన్నాయి.  కానీ ఏపీలో మాత్రం కలిసి పని చేయడం లేదు.  రాష్ట్ర నాయకులతో తనకు గ్యాప్ ఉందని పవన్ కల్యాణ్  చెబుతున్నారు. వారు వైసీపీపై పోరాటం చేయడం లేదని పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే బీజేపీ నేతలు కూడా అడిగినప్పుడు కూడా జనసేన మద్దతు ప్రకటించలేదని.. పొత్తు ఉన్నా లేనట్లేనని ప్రకటించేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత  ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ ఇలాంటి ప్రకటనలు చేశారు. దీంతో  జనసేన, బీజేపీ మధ్య పొత్తు లేనట్లేనని అనుకుంటున్నారు.  కానీ ఆ విషయాన్ని పవన్ కల్యాణ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వైసీపీని ఓడించడానికి ఖచ్చితంగా టీడీపీతో కలిసి వెళ్లాల్సిందేనని పవన్ గట్టిగా బీజేపీ హైకమాండ్‌కు చెప్పలేకపోతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. 


పవన్ పూర్తి స్థాయి రాజకీయనేతగా ఆలోచించలేకపోతున్నారా ?


రాజకీయాల్లో మొహమాటాలకు చాన్స్ ఉండదు. రాజకయంగా తమ పార్టీకి ఏది ప్రయోజనం అయితే అదే చేస్తారు ఏ రాజకీయ నేత అయినా. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరని చెబుతూంటారు. అలాగే రాజకీయ పార్టీల మధ్య పొత్తులు కూడా అంతే. అంత ఎందుకు మొదట  బీజేపీతో తర్వాత కమ్యూనిస్టులతో మళ్లీ ఇప్పుడు బీజేపీతో పొత్తులు పెట్టుకున్న రికార్డు పవన్ కు ఉంది. నెక్ట్స్ ఆయన టీడీపీతో కలిసి వెళ్లాలనుకుంటున్నారు.  రూట్ మ్యాప్ కోసం చూస్తున్నారు. కానీ ఇలా  ఓ జాతీయ పార్టీ రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తూ ఉంటే రాజకీయాల్లో సమయం గడిచిపోతుంది. ఆ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకున్నా ప్రయోజనం ఉండదు. అందుకే పవన్ ఇంకా రాజకీయంగా గట్టి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారన్న వాదన వినిపిస్తోంది.