BRS Sitting Seats :  దమ్ముంటే సిట్టింగ్‌లకే సీట్లివ్వాలన్న  సవాల్ ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఇతర పార్టీల నుంచి ఎక్కువగా వస్తోంది.   దీనికి రెండు కారణాలు ఉన్నాయి.   తమ సవాల్ ను స్వీకరించి సిట్టింగ్‌లను కొనసాగిస్తే వారిపై ఉన్న ప్రజా వ్యతిరేకతతో  బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. అదే సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని మార్చేస్తే.. వారు రెబల్స్ గా మారి బీఆర్ఎస్‌కు నష్టం చేస్తారు.  విపక్ష పార్టీల వ్యూహం ఇదే.  మరి బీఆర్ఎస్ చీఫ్ ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నరు...?


ప్రభుత్వ వ్యతిరేకతను డీల్ చేసే కసరత్తులో కేసీఆర్ 
  
సాధారణంగా  అధికారంలో ఉన్న పార్టీకి ప్రధాన సవాల్ అసంతృప్తి. ఎంత ఎక్కువ కాలం అధికారంలో ఉంటే ప్రజల్లో  అంత ఎక్కువ అసంతృప్తి కనిపిస్తుంది.   ఇప్పుడున్న రాజకీయాల్లో  ఓ ప్రభుత్వం మూడో సారి గెలవడం అంటే.. చిన్న విషయం కాదు.  అసంతృప్తి బయటకు కనిపించాలనేం ఉండదు.     రాజకీయ వర్గాల విశ్లేషణల ప్రకారం.. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి అనేది కనిపిస్తే ఎన్నికల నాటికి అది తగ్గే అవకాశం లేదు.  ఎన్ని ఉచిత హామీలు ఇచ్చినా.. అమలు చేయడం ప్రారంభించినా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కష్టం. పైగా తమను మరోసారి ఇలాంటి  పథకాలపేరుతో మాయ చేయాలనుకుంటున్నారని మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అది ఓట్ల రూపంలో కనిపిస్తుంది.  అదే సమయంలో ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంటే మాత్రం.. ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి అవకాశం ఉంటుంది.   ప్రజలకు దూరమైన ఎమ్మెల్యేల్ని దూరం పెట్టి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా  వీలైనంత వరకూ అసంతృప్తిని తగ్గించి..  ఓట్ల కోతను అడ్డుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వంపై అసంతృప్తిని తగ్గించడం ఎంత కష్టమో...  ప్రజల్లో పలుకుబడి కోల్పోయిన ఎమ్మెల్యేల్ని మార్చడం అంతే కష్టం. ఎందుకంటే వారు రెబల్ గా మారే చాన్స్ ఉంది.  అప్పటికే ఆర్థికంగా బలోపేతం అయి ఉంటారు..  పార్టీ క్యాడర్ చాలా వరకూ వారి వెంటే ఉంటుంది.  అందుకే సిట్టింగ్ అభ్యర్థుల్ని మార్చడం కూడా రెండు వైపులా పదునున్న  వ్యూహం లాంటిదే. 


సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని మార్చాలనే ఉద్దేశంలోనే ఉన్నారా ? 


సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని మార్చాలా వద్దా అన్న డైలమాలో కేసీఆర్ ఉన్నారని ఇటీవలి కాలంలో  బీఆర్ఎస్ ముఖ్య నేతల ప్రకటలను బట్టి అర్థమవుతుంది. బీఆర్ఎస్ కు ప్రశాంత్ కిషోర్ టీమ్ పని చేసినప్పుడు సర్వేల ద్వారానే టిక్కెట్లు వస్తాయని కనీసం యాభై మందికి మొండి చేయి అని చెప్పారు. తర్వాత  కొంత మందికి తప్ప అందరికీ టిక్కెట్లు ఖాయమని చెబుతున్నారు. కానీ కేసీఆర్ భారీగా టిక్కెట్లు నిరాకరించబోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.  వీరందరికి టిక్కెట్లు నిరాకరించడం వల్ల వచ్చే తిరుగుబాటును తగ్గించడానికే కేసీఆర్ వ్యూహాత్మక ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. 2018లో ముందస్తుకు వెళ్లాలనుకున్నప్పుడు కేసీఆర్  కేవలం ముగ్గురంటే ముగ్గురికి మాత్రమే టిక్కెట్లు నిరాకరించారు. వారు బాబూమోహన్, బొడిగే శోభ, ఓదెలు.  వీరు ముగ్గురూ తిరుగుబాటు చేశారు. ఇద్దరు బీజేపీలో  చేరారు. ఒకరు సర్దుకున్నప్పటికీ.. తర్వాత రకరకాల పార్టీలు మారారు.  అంటే టిక్కెట్లు నిరాకరించిన ముగ్గురూ వ్యతిరేకమయ్యారు. నిజానికి వీరు నియోజకవర్గాల్లో బలమైన నేతలు కాదు  . పార్టీ బలమే వీరి బలం. అదే నియోజకవర్గాల్లో పలుకుబడి ఉన్న నేతలకు టిక్కెట్లు నిరాకరిస్తే..  తిరుగుబాటు చేయకుండా ఉంటారా ? అదే బీఆర్‌ఎస్ చీప్ కేసీఆర్ ఆందోళనగా భావిస్తున్నారు. 


బీఆర్ఎస్ అసంతృప్తులకు చాయిస్‌గా రెండు పార్టీలు 


సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వకపోతే బీఆర్ఎస్‌లో తిరుగుబాట్లు  ఎక్కువ ఉంటాయన్న అభిప్రాయం రావడానికి మరో కారణం.. ప్రత్యామ్నాయంగా రెండు పార్టీలు రెడీగా ఉండటం. గతంలో ఎప్పుడూ ఎదుర్కోనంత గట్టి ఫైట్ ను ఈ సారి  బీఆర్ఎస్ ఎదుర్కొటోంది. గతంలో బీఆర్ఎస్ ఓవర్ లోడ్ అయినప్పటికీ... అధికారం అందని పార్టీలోకి వెళ్లడం ఎందుకని చాలా మంది రాజీ పడిపోయారు. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి లేదు. ఎదురుగా కాంగ్రెస్ , బీజేపీ అనే రెండు పక్షాలు ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాడనికైనా ఆ పార్టీ టిక్కెట్లు నిరాకరించేవారిని పిలిచి మరీ టిక్కెట్లు ఇవ్వడానికి ఈరెండూ రెడీగా ఉంటాయి. అందుకే ద్విముఖ వ్యూహంతోనే రేవంత్ రెడ్డి.. .. సిట్టింగ్‌లకు సీట్లివ్వాలని సవాల్ చేస్తున్నారు.  కేసీఆర్ ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నారన్నది కీలకం.