AP TS Modi Variations :  ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒకే రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో  పర్యటించారు. రెండు రాష్ట్రాల్లో అధికారిక సభల్లో పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ పరంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలోనూ ప్రసంగించారు. ఏపీలో రోడ్ షో నిర్వహించారు. అయితే ఏపీలో మోదీ మాట్లాడిన దానికి.. తెలంగాణలో మాట్లాడిన దానికి చాలా తేడా ఉంది. తెలంగాణలో ఓ ఫైర్ చూపించారు. కానీ ఏపీలో మాత్రం  చాలా సాదాసీదాగా ప్రసంగించారు. దీంతో  తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా ఎందుకన్న చర్చ రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది.  వైఎస్ఆర్సీపీని మిత్రపక్షంగా భావిస్తున్నారని.. టీఆర్ఎస్‌ను ప్రత్యర్థిగా ఖరారు చేసుకున్నారని అందుకే ఇలా మార్పులు చూపించారని అంటున్నారు. 


వైఎస్ఆర్‌సీపీ ఏపీ బీజేపీ నేతల ఘాటు విమర్శలు - కానీ మోదీ మాత్రం సైలెంట్ ! 


ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నేతలు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై తీవ్రమైన  విమర్శలు చేస్తూ ఉంటారు. అవినీతి పాలన అంటారు.  ఏపీని భ్రష్టు పట్టించారని మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపిస్తూ ఉంటారు. ఈ పేరుతో బీజేపీ క్యాడర్ అంతా పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు కూడా చేపట్టారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో మాత్రం అలాంటి  ఫైర్ కనిపించలేదు. విశాఖకు చేరుకున్న రోజున రోడ్ షో నిర్వహించిన మోదీ ఎలాంటి ప్రసంగాలు చేయలేదు. పార్టీ నేతలతో అంతర్గత సమావేశం మాత్రం నిర్వహించారు. తర్వాత జరిగిన బహిరంగసభలో కూడా వైఎస్ఆర్‌సీపీని.. ప్రభుత్వాన్ని.. జగన్‌ను కూడా విమర్శించలేదు.అలాగని పొగడలేదు.. అది వేరే విషయం . కానీ ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న పోరాటానికి కాస్తయిన ఊపు రావాలంటే మోదీ ఓ విమర్శ చేసి ఉంటే బాగుండేదనేది ఎక్కువ మంది అభిప్రాయం. కానీ మోదీ తన ప్రసంగంలో కానీ.. మరో చోట కానీ జగన్ సర్కార్‌పై విమర్శలు చేయలేదు. సాఫ్ట్‌గానే కార్యక్రమం ముగించుకున్నారు. 


తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడిన మోదీ !


విశాఖలో సభ ముగిసిన తర్వాత నేరుగా హైదరాబాద్ వెళ్లిన మోదీ..  బేగంపేట విమానాశ్రయం సమీపంలోనే ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. ఆ సభలో పూర్తి స్థాయిలో టీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారు. తెలంగాణ ప్రజలు ఇక్కడి అవినీతి, కుటుంబ పాలనపై పోరాడుతున్నారు. బీజేపీ కార్యకర్తలు ఎవరికీ తల వంచకుండా పోరాడుతున్నారు. తెలంగాణ ప్రజలు వెనుకబడ్డారు.. కానీ ఒక్క కుటుంబం మాత్రం బాగుపడింది. తెలంగాణ మొత్తం ఒక కుటుంబంలా మా వెంట రండి. బీజేపీకి కుటుంబం ముఖ్యం కాదు.. ప్రజలు ముఖ్యం. తెలంగాణ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి. కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ ప్రజలు, యువత, సబ్బండ వర్గాల ప్రజలు మొత్తం వ్యతిరేకంగా ఉన్నారు. పేదలను నమ్మించి మోసం చేసే వారిని ఊరికే వదిలిపెట్టబోం. అవినీతి, కుటుంబ పాలన వల్ల జరుగుతున్న నష్టాన్ని తెలంగాణ, దేశ ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కూలదోస్తామన్నారు. మోదీ స్పీచ్‌లో ఉన్న ఫైర్.. తెలంగాణలో బీజేపీ నేతలు చేస్తున్న పోరాటానికి సరిగ్గా మ్యాచ్ అయింది. 


రాష్ట్రాల వారీగా బీజేపీ వ్యూహం ఖరారైనట్లేనా ?


వైఎస్ఆర్‌సీపీ విషయంలో బీజేపీ కాస్త సానుకూలంగానే ఉంది. అందుకే తమిళనాడు, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో గవర్నర్లు చాలా యాక్టివ్‌గా ఉన్నారు. చీటికి మాటికి అక్కడి ప్రభుత్వాల్ని ఇబ్బంది పెడుతన్నారు. కానీ ఏపీలో మాత్రం అలాంటి ఇబ్బంది లేదు. కోర్టుల్లో నిలబడిన కొన్ని నిర్ణయాలను కూడా.. గవర్నర్ బిశ్వభూషణ్  ఆమోదిస్తున్నారు. వివాదం రావడం లేదు. అదే సమయంలో వైఎస్ఆర్‌సీపీ కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్‌లో ఎప్పుడు అవసరమైనా మద్దతు తెలుపుతోంది. అదే టీఆర్ఎస్ మాత్రం బీజేపీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకం అయింది. పైగా తెలంగాణలో బీజేపీ ప్రధాన పోటీదారుగా ఎదిగింది. ఏపీలో లేదు.అందుకే మోదీ.. ఏపీలో మద్దతుగా ఉంటున్న వైఎస్ఆర్‌సీపీ విషయంలో సాఫ్ట్‌గా ఉండి.. ప్రత్యర్థిగా మారిన టీఆర్ఎస్ విషయంలో కఠినంగా మాట్లాడారని అంచనా వేస్తున్నారు.