Hyderabad Second Capital:      హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా చేయాలన్న అంశాన్ని మెల్లగా ప్రజల్లో పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.  రెండో రాజధాని చేయాలంటే..  హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాల్సి ఉంటుంది. హఠాత్తుగా.. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ అంశాన్ని లేవనెత్తారు. గవర్నర్ గా పదవి కాలం ముగిసిన తర్వాత సైలెంట్ ఉన్న ఆయన హఠాత్తుగా తెరపైకి వచ్చారు. హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాలన్నారు. అంబేద్కర్ కూడా అదే కోరుకున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై పార్టీలన్నీ ఆలోచించాలని పిలుపునిచ్చారు.  హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగినప్పుడు సీఎం కేసీఆర్ సమక్షంలోనే అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్.. హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయడం అంబేద్కర్ స్వప్నమన్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయలేదు. కానీ అలాంటి ఆలోచన బీజేపీకి ఉందని తర్వాత పరిణామాలతో వెల్లడవుతూ వస్తోంది. 


తరచూ చర్చల్లోకి వస్తున్న రెండో రాజధాని ! 


దక్షిణాదిన రెండో రాజధాని ఉండాలన్న ప్రస్తావన చాలా రోజులుగా వస్తున్నదే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ స్వాతంత్రోద్యమ కాలంలోనే  ఈ మాట చెప్పారన్న ప్రచారం ఉంది. హైదరాబాద్ ను సెకెండ్ కేపిటల్ చేయాలంటూ థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే పుస్తకం 11వ అధ్యాయంలో అంబేడ్కర్ రాశారు. ఈ పుస్తకం 1955లో ప్రచురితమైనప్పుడు జనం అంబేడ్కర్ వాదనతో ఏకీభవించారని.. అయినా  అది కార్యరూపానికి నోచుకోలేదని చెబుతారు.  తర్వాత ఆ అంశం మరుగున పడిపోయింది. ఇటీవలి కాలంలో మారిపోతున్న రాజకీయ ప్రాధాన్యలతో ఉత్తర దక్షిణ తారతమ్యాలను పోగొట్టేందుకు సెకెండ్ కేపిటల్ ఒకటి కావాలన్న అభిప్రాయం చాలా రోజులుగా ఉంది.  


రాజకీయ వ్యూహాల పరంగానూ బీజేపీకి  కలిసి వస్తుందా? 


నిజంగానే బీజేపీ.. రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేస్తామంటే.. స్వాగతించేవారు ఎక్కువగా ఉంటారు. కానీ కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తామంటే మాత్రం బీఆర్ఎస్ అంగీకరించే అవకాశం ఉండదు. ఎందుకంటే తెలంగాణకు ఆదాయ వనరు.. హైదరాబాదే. కేంద్ర పాలిత ప్రాంతం అయితే ఢిల్లీలోలా పాలన కేంద్రం చేతుల్లో ఉంటుంది. అందుకే.. బీఆర్ఎస్ వ్యతిరేకించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇతర పార్టీలు కూడా.. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి.. రెండో రాజధానిని చేస్తామంటే అంగీకరించే అవకాశం ఉండదు.  కానీ కేంద్రం అనుకుంటే మాత్రం.. దేశంలో కోసం చేయలేరా అన్న వాదనతో పని పూర్తి చేయడానికి అవకాశం ఉంది. 



ఢిల్లీలో పెరిగిపోయిన సమస్యలు 


ఢిల్లీ రాజధానిపై తరచూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సమస్యలు లెక్కలేనన్ని ఏర్పడుతున్నాయి.  బ్రిటిష్ కాలంలో రాజధానిని కోల్ కతాకు మార్చిన 1911లో మళ్లీ ఢిల్లీకి వచ్చేసింది. అప్పటి నుంచి ప్రతీ ఏటా ఢిల్లీపై వత్తిడి పెరుగుతూనే ఉంది. అందుకే సెకెండ్ కేపిటల్ కావాలన్న డిమాండ్ పెరుగుతోంది. దక్షిణాదిన  సౌతిండియాలో ఒక కేపిటల్ ఏర్పాటు చేయాలన ప్రస్తావన వచ్చినప్పుడు రెండు మూడు నగరాల పేర్లు తెరపైకి వచ్చాయి. హైదరాబాద్ తో పాటు బెంగళూరు చెన్నై మహానగరాల పేర్లు కూడా వినిపించాయి. అయితే వాతావరణ సమతౌల్యత విషయంలో అందరూ హైదరాబాద్ కే మొగ్గు కనిపించింది. ల్యాండ్ లాక్డ్ ప్రదేశమైన హైదరాబాద్ కు సెక్యూరిటీ రిస్క్ లేదు. ఏ నగరంతో పోల్చుకున్నా భద్రతలో హైదరాబాద్ కు సాటి లేదు.   ప్రకాశ్ అంబేడ్కర్ చెప్పినట్లుగా ఢిల్లీ మన దేశ సరిహద్దుకు కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాకిస్తాన్ దండయాత్రకు చాలా దగ్గరగా ఉంటుందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.  హస్తినాపురి నగరం రోజురోజుకు కాలుష్య కాసారంగా మారిపోతోంది. చలికాలం వచ్చిందంటే చాలు పొల్యుషన్ తో జనం రోగాల బారిన పడుతున్నారు. కాలుష్యం ప్రజలినప్పుడల్లా కేపిటల్ మార్పుపై చర్చ జరుగుతోంది. 


బీజేపీ అనుకుంటే జరిగిపోతుంది ! 
  
హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చి సెకెండ్ కేపిటల్ గా ప్రకటించాలన్న ప్రతిపాదన చాలా రోజులుగా ఉన్నదే. బీజేపీ ఆ దిశగా ఆలోచిస్తే బావుంటుందన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. మోదీ అమిత్ షా అనుకుంటే ఆ పని చేయగలరన్న విశ్వాసమూ అందరికీ ఉంది.  అయితే  హైదరాబాద్ నగరాన్ని దేశానికి రెండో రాజధాని చేసే ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిని  ..  హైదరాబాద్‌లో కేసీఆర్ సమక్షంలో ప్రకాష్ అంబేద్కర్ ప్రకటన చేసిన తర్వాత .. మీడియాకు చెప్పారు.  కేంద్రం వద్ద లేదు కానీ.. బీజేపీ వద్ద ఉందని.. పెట్టాలనుకుంటే.. ఒక్క రోజులో పెట్టేయగలరన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.