Azhar ministerial post in Suspense: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి  లోక్‌భవన్ వైపే ఉంది. మంత్రి మహ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాంల ఎమ్మెల్సీ నామినేషన్ల ఫైల్ క్లియరెన్స్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.   గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సీఎం ఆదివారం  సమావేశం అయ్యారు. కానీ క్లారిటీ రాలేదు. దాంతో మరోసారి కేబినెట్ ద్వారా సిఫారసు చేయాలని అనుకుంటున్నారు. 

Continues below advertisement

 అజహర్ మంత్రి పదవి గండం గట్టెక్కుతుందా?

తెలంగాణ కేబినెట్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న మహ్మద్ అజారుద్దీన్‌కు ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోపు శాసనసభ లేదా శాసనమండలిలో సభ్యత్వం పొందాల్సి ఉంటుంది. అజహర్ విషయంలో ఆ గడువు ఏప్రిల్ 30, 2026తో ముగియనుంది. అంటే  పది రోజులు కూడా గడువు లేదు. ఎమ్మెల్సీగా ఖరారు కాకపోతే, మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం అజహర్ వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి ప్రతిష్టకు కూడా ఒక సవాల్‌గా మారింది.

Continues below advertisement

గవర్నర్‌తో భేటీ - రేవంత్ రెడ్డి వ్యూహం

ఈ అంశంపై  కొంతకాలంగా  లోక్‌భవన్‌కు, ప్రభుత్వానికి మధ్య ఉన్న ప్రతిష్ఠంభనను తొలగించేందుకు రేవంత్ రెడ్డి  సయోధ్య మార్గాన్ని ఎంచుకున్నారు. గవర్నర్‌తో జరిగిన భేటీలో ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని, అజారుద్దీన్ విషయంలో ఉన్న రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని  సీఎం వివరించినట్లు తెలుస్తోంది. గతంలో గవర్నర్ కోటా నామినేషన్లపై కోర్టు కేసులు, సాంకేతిక అడ్డంకులు ఉన్నాయని.. ఇప్పుడు సుప్రీంకోర్టు నుండి కూడా సానుకూల సంకేతాలు ఉన్నాయని గవర్నర్‌కు తెలియజేశారు. రాజ్‌భవన్‌తో ఘర్షణ కంటే చర్చల ద్వారానే పనులు పూర్తి చేసుకోవాలనేది రేవంత్ మార్క్ వ్యూహంగా కనిపిస్తోంది.

మళ్లీ కేబినెట్ ద్వారా సిఫారసు చేసేందుకు రెడీ 

గతంలో సిఫారసు చేసినప్పుడు ప్రస్తుత గవర్నర్ లేరు.  పాత గవర్నర్ ఉన్నప్పుడు కేబినెట్ చేసిన సిఫారసులు కొత్త గవర్నర్ ఆమోదిస్తారో లేదో క్లారిటీ లేదు. అందుకే సీఎం రేవంత్ మళ్లీ కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి.. మరోసారి సిఫారసు చేయాలని అనుకుంటున్నారు. అప్పుడు గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల సమయంలో మైనారిటీ నేతగా అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి ఒక పెద్ద రాజకీయ సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆయన పదవిని కాపాడలేకపోతే, అది ప్రభుత్వంపై ,  ముఖ్యంగా సీఎం నాయకత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 

రేవంత్ వద్ద ప్లాన్ బీ ఉందా?

గవర్నర్ క్లియరెన్స్ రాకపోతే  ప్లాన్-బి గా అజహర్‌ను మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం లేదా హైకోర్టును ఆశ్రయించడం వంటి ఇతర ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అయితే, గవర్నర్ ఈ వారంలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటారని రేవంత్ ధీమాగా ఉన్నారు. ఈ వారం ముగిసేలోపు ఎమ్మెల్సీ hobgnhw  స్పష్టత వస్తే రేవంత్ రెడ్డి రాజకీయంగా మరో విజయం సాధించినట్లవుతుంది. ఒకవేళ జాప్యం జరిగితే, ఏప్రిల్ 30 లోపు అజహర్ రాజీనామా చేయాల్సి రావడం ప్రతిపక్షాలకు  ఒక బలమైన అస్త్రంగా మారుతుంది. అజహర్ మంత్రి పదవిని కాపాడటం ద్వారా తన పట్టును నిరూపించుకోవాలని చూస్తున్న రేవంత్ రెడ్డి, గవర్నర్ కోటా ఫైల్ పై సంతకం చేయించడంలో ఎంతవరకు సఫలమవుతారో చూడాలి.