TRS Vs BJP :   తెలంగాణ రాజకీయాలు రాను రాను ఉద్రిక్తంగా మారుతున్నాయి. అవి రాజకీయ నేతల ప్రకటనలకే పరిమితం కావడం లేదు. రెండు అధికార పార్టీలే కావడంతో ఒకరిపై ఒకరు దర్యాప్తు సంస్థలను ప్రయోగించుకుంటున్నారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఓ వైపు సీబీఐ, ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచి తెలంగాణ నేతల్ని టార్గెట్ చేస్తూండగా..ఫామ్ హౌస్ కేసులో.. టీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ కూడా.. అదే స్థాయిలో టార్గెట్ ఖాయమన్న సంకేతాలు ఇస్తోంది. మరో వైపు ఐటీ దాడులకూ టీఆర్ఎస్ సర్కార్.. స్టేట్ జీఎస్టీ అధికారులతో సమాధానం ఇస్తోందన్న అభిప్రాయం కలిగేలా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 


లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ నేతలు ఇరుక్కున్నారంటున్న  బీజేపీ 


ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారం ఢిల్లీ వ్యవహారాల కన్నా.. తెలంగాణ రాజకీయాల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. లిక్కర్ స్కాం బయటపడినప్పుడు బీజేపీ నేతలు పూర్తిగా కల్వకుంట్ల కవితను టార్గెట్ చేశారు. ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ కేసులో .. సీబీఐ, ఈడీ దూకుడుగా పని చేస్తున్నాయి. కవిత పీఏగా చెబుతున్న బోయినపల్లి అభిషేక్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో దినేష్ అరోరాను అప్రూవర్‌గా మార్చగలిగారు. ఆయన .. ఈ స్కాంలో మొత్తం గుట్టు విప్పేశారని.. బీజేపీ వర్గాలు అంతర్గతంగా ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణకు చెందిన మరో వ్యాపారి శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో మరింత కీలకమన సమాచారం బయటకు వచ్చిందంటున్నారు. బీజేపీ వైపు నుంచి ఈ మైండ్ గేమ్ ఇలా సాగుతూండగా.. తెలంగాణ వైపు నుంచి బీజేపీ పెద్దల్ని బుక్ చేసేలా.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ సాగుతోందన్న సంకేతాలను టీఆర్ఎస్ నేతలు ఇస్తున్నారు. 


ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ పెద్దల్ని పట్టేసుకున్నామంటున్న టీఆర్ఎస్ !


ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని తెలంగాణ సర్కార్ చాలా తీవ్రంగా తీసుకుంది. ఇతర రాష్ట్రాల్లో కూల్చిన ప్రభుత్వాల లెక్క కూడా బ యట పెట్టాలని అనుకుంటోంది. అక్కడి డీలింగ్స్.. నగదు లావాదేవీలు అన్నీ .. కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ ద్వారా వెలుగులోకి తెచ్చి దేశవ్యాప్తంగా.. ఎమ్మెల్యేల కొనుగోళ్లు అంశాన్ని హైలెట్ చేయాలనుకుంటోంది. ఇప్పటికే 70వేలకుపైగా పేజీల సమాచారం ఉందని..  కేసీఆర్ ప్రకటించారు. ఆ ప్రకారం.. సిట్ ముందుకు వెళ్తుంది. లిక్కర్ స్కాంలో కేంద్రం అరెస్టులకు సిద్ధపడితే.. ఇక్కడ సిట్ కూడా ఢిల్లీలో బీజేపీ కీలక నేతల సంగతి చూసుకుంటుందని టీఆర్ఎస్ నేతలు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీకేనా దర్యాప్తు సంస్థలు.. మాకు లేవా అన్నట్లుగా ఈ సవాళ్లు నడుస్తున్నాయి. 


ఈడీ, ఐటీకి పోటీగా రంగంలోకి తెలంగాణ స్టేట్ జీఎస్టీ !


పన్నులు ఎగ్గొట్టారని.. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఐటీ, ఈడీలు టీఆర్ఎస్ నేతల ఇళ్లు, వ్యాపార సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. టీఆర్ఎస్‌తో అనుబంధం ఉందని భావిస్తున్న వ్యాపార సంస్థలనూ వదిలి పెట్టడం లేదు. వీటికి కౌంటర్ ఇవ్వడంపై టీఆర్ఎస్ ఇప్పటి వరకూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ నేతలను తాము టార్గెట్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ ఫ్రాపై స్టేట్ జీఎస్టీ అధికారులు సోదాలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లు తీసుకెళ్లారు. వ్యాపారవేత్తలైనా బీజేపీ నాయకులపై ఈ స్టేట్ జీఎస్టీ బాణాన్ని టీఆర్ఎస్ ఎక్కుపెట్టకుండా ఉంటుందని మనం అనుకోలేం. 


ఈ దర్యాప్తు సంస్థలతో రాజకీయం ఎక్కడి వరకూ వెళ్తుంది ?


అటు కేంద్రం.. ఇతర రాష్ట్రం.. రెండు .. మీకేనా అధికారం ఉందని.. మాకు లేదా అంటూ.. పోటీ పడుతున్న అంశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఎటు వైపు దారి తీస్తుందోనన్న ఆందోళన.. తెలంగాణ  రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది.