Another Shock For BRS :  భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో శనివారం ఉదయం ఓ ప్రెస్ మీట్ జరిగింది.  ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డితో పాటు మరికొంత మంది నిజామాబాద్ నాయకులు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. పార్టీ మారారని చెప్పి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై జీవన్ రెడ్డి ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. పోచారం శ్రీనివాస రెడ్డి, లక్ష్మి పుత్రుడు కాదు లంక పుత్రుడని విర్శించారు.   పోచారం గురించి, అతని కుటుంబ సభ్యుల గురించి దండుపాళ్యం ముఠా అంటూ మాట్లాడిన రేవంత్ ఇప్పుడు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాడని మండిపడ్డారు.

  





 


ఈ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఆశన్నగారి జీవన్ రెడ్డి నేరుగా మంత్రి శ్రీధర్ బాబును కలవడానికి వెళ్లారు. బీఆర్ఎస్ నేతలపై పార్టీ మార్పు ప్రచారాలు విస్తృతంగా జరుగుతున్న సమయంలో ఇలా సీక్రెట్ గా శ్రీధర్ బాబును కలిసేదుకు వెళ్లడంతో ఆయనపైనా  రూమర్స్ ప్రారంభమయ్యాయి. శ్రీధర్ బాబుతో మాట్లాడుతున్న దృశ్యాలు వెలుగులోకి రావడంతో జీవన్ రెడ్డి కూడా పార్టీ మారేందుకు చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం ప్రారంభమయింది. 


తెలంగాణ సెంటిమెంట్ వేడిలో ఆర్మూరు నుంచి రెండు సార్లు గెలిచిన జీవన్ రెడ్డి గత ఎన్నికల్లో మూడో స్థానంలో ఉన్నారు. దీంతో ఆయన రాజకీయ  భవిష్యత్ ప్రశ్నార్థకమయింది. ఆయన వ్యాపారాలు, రాజకీయాలు కలిసిపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయి. ఆర్మూరులో ఆర్టీసీ స్థలంలో నిర్మించిన మాల్ కు లీజు కట్టకపోడంతో సీజ్ చేశారు. కోర్టుకెళ్లి ఎలాగోలా అనుమతులు తెచ్చుకున్నారు. ఇంకా పలు కబ్జా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రవెల్లి దగ్గర భూమి విషయంలో కేసు కూడా నమోదయింది.                                   


పరిస్థితులు రాను  రాను క్లిష్టంగా మారుతూండటంతో ఆయన కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ  భవిష్యత్ పై పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి సీట్ల సంఖ్య పెరుగుతుందని.. డీలిమిటేషన్‌లో సీట్లు 175 అవుతాయన్న అంచనాల్లో ఉన్నారు. అందుకే సీట్ల సమస్య రాదని ఇప్పుడే పార్టీలో చేరిపోవడం మంచిదని కొంత మంది అనుకుంటున్నారు. ఈ అంశంపై జీవన్ రెడ్డి ఇంకా స్పందించలేదు.