సీఎం జగన్ పర్యటన అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది శ్రీకాకుళం కోడై కూస్తోంది. ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయట. ఇప్పుడు ఇదే సిక్కోలు పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌. వివాదాన్ని లైట్ తీసుకోమని తమ్ముడు చెబుతున్నా తన అనుచరులు మాత్రం శాంతించడం లేదని టాక్ 


ఈ మధ్య భూసర్వే పాస్‌బుక్‌ల పంపిణీ కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి నరసన్నపేటలో పర్యటించారు. భారీ బహిరంగ సభలో ప్రసగించారు. సీఎం పర్యటన కోసం సుమారు వారం పదిరోజుల నుంచి జిల్లా నాయకులు తీవ్రంగా శ్రమించారు. భారీగా జనసమీకరణ చేశారు. ప్రోగ్రామ్ విజయవంతమైందంటూ ఆనంద పడ్డారు. కానీ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉంటూ పార్టీకి దిశానిర్దేశం చేసే ఆ కుటుంబంలో ఈ పర్యటన కాక రేపిందట. 


సీఎం పర్యటన సందర్భంగా శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వరకు భారీగా ఫ్లెక్సీలు పెట్టారు. ఇదే ఇప్పుడు ధర్మాన కుటుంబంలో అగ్నిగుండాన్ని రాజేసిందని తెలుస్తోంది. వైఎస్ జగన్మోహన్‌ నరసన్నపేట వస్తున్న సందర్భంగా నరసన్నపేట కేంద్రంలో వందలాది ప్లెక్సీలు కనిపించాయి. పలువురు అభిమానులకు ఆకట్టుకున్నాయి. ఆ ప్లెక్సీలను గమనించిన వాళ్లకు ఓ డౌటానుమానం వచ్చింది. ఇప్పుడు మంత్రి ధర్మాన కృష్ణదాసా లేకుంటే ధర్మాన ప్రసాదరావా అనే సందేహం వచ్చింది. ఎందుకంటే వందల ఫ్లెక్సీలు పెట్టినా అందులో ఎక్కడ కూడా ధర్మాన ప్రసాదరావు ఫొటో లేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 


ఎక్కడా ధర్మాన ప్రసాదరావు ఫొటో లేకపోవడంతో ఆయన అభిమానులే కాదు పార్టీ నేతలు కూడా విస్తుపోయారు. ఈ వివాదం ముఖ్యమంత్రి పర్యనట ముగించుకొన వెళ్లిన తర్వాత బయటకు వచ్చింది. దీంతో జిల్లాలో దీనిపైనే చర్చ నడుస్తోంది. పార్టీకి అండగా ఉన్న ధర్మాన ప్రసాద్ ఫోటో ఫ్లెక్సీలో లేకపోవడంపై నరసన్నపేట, శ్రీకాకుళంలో కార్యకర్తలు చాలా అసంతృప్తితో ఉన్నారు. 


పాలు నీళ్ల కలిసి ఉన్న అన్నదమ్ముల మధ్య ఈ వివాదం ఏ తీరానికి చేరుతుందో అని వైసీపీ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల మూడ్‌లోకి శ్రేణులను తీసుకెళ్తున్న టైంలో ఇలాంటి అంశాలై పెద్ద నష్టాన్ని తీసుకొస్తాయని గుసగుసలాడుకుంటున్నారు. మంత్రి ధర్మాన ప్రసాద్‌కు జరిగిన ఈ అవమానం అంత ఈజీగా మర్చిపోలేమంటున్నారు ఆయన సన్నిహితులు. మంత్రి మాత్రం లైట్‌ తీసుకోమని కేడర్‌కు సూచిస్తున్నారు. వాళ్లు మాత్రం ససేమిరా అంటున్నారట. 


జమ్మూ జంక్షన్ నుంచి పైడితల్లిఅమ్మవారి గుడి వరకు వందల పెక్సీలు కనిపిస్తున్నా అందులో ధర్మాన ఫొటోలు లేకపోవడంతో పేటలో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ధర్మాన ప్రసాదరావు కటౌట్లు కనిపించక పోవడంతో పలు విధాలుగా చర్చించకుంటున్నారు.


దీని వెనుకాల పెద్ద కుట్రే ఉందని అనుమాన పడుతున్నారు ధర్మాన  ప్రసాద్‌రావు వర్గీయులు. ఇదంతా ధర్మాన కృష్ణదాస్ కుమారుడు చేసిన పనిగా అభిప్రాయపడుతున్నారు. స్వయంగా ఆ వ్యక్తే ఈ ప్రచార బాధ్యతలు చూసుకున్నారని.. కావాలనే బాబాయ్‌ ధర్మాన ప్రసాద్‌రావు ఫొటో ల్లేకుండా ఫ్లెక్సీలు పెట్టించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.