Rahul Gandhi: చైనా మరోసారి కపటబుద్ధి చూపించింది. అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్‌‌ను తమ భూభాగంలో కలుపుకుంటూ చైనా మ్యాప్‌ను విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. చైనా ఆగడాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. 1962 యుద్ధంలో ఆక్రమించిన అక్సాయ్ చిన్, దక్షిణ టిబెట్‌గా పేర్కొంటున్న అరుణాచల్ ప్రదేశ్‌ను తమ భూభాగంలో భాగంగా చూపుతూ చైనా ప్రామాణిక మ్యాప్‌ను సోమవారం విడుదల చేసింది. మొత్తం దక్షిణ చైనా సముద్రాన్ని చైనాలో భాగంగా చూపించింది. 


దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘లడఖ్‌లో ఒక్క అంగుళం భూమి కూడా పోలేదని ప్రధాని మోదీ చెప్పింది అబద్ధమని నేను చాలా సంవత్సరాలుగా చెబుతున్నాను. చైనా అతిక్రమించిందని లడఖ్ మొత్తానికి తెలుసు. ఈ మ్యాప్ అంశం చాలా తీవ్రమైనది. వారు భూమిని లాక్కున్నారు. దీనిపై ప్రధాని స్పందించాలి’ అని డిమాండ్ చేశారు. 


దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ స్పందిస్తూ. మ్యాప్ అంటే ఏమీ లేదన్నారు. చైనాకు అలాంటి మ్యాప్‌లను విడుదల చేసే అలవాటు ఉందని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘చైనా చాలా సార్లు తమది కాని భూభాగాలతో మ్యాప్‌లు వేసింది. అది ఆ దేశానికి ఉన్న పాత అలవాటు. కేవలం భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో మ్యాప్‌లను ఉంచడం ద్వారా, వాస్తవంగా ఉన్న దాంట్లో ఏమీ మారదు. మా ప్రభుత్వం దీని గురించి చాలా స్పష్టంగా ఉంది. మా భూభాగంపై అసంబద్ధమైన వాదనలు చేయడం ద్వారా ఇతరుల భూభాగాలు వారికి చెందవు" అని  చెప్పారు.


భారతదేశం ప్రామాణిక మ్యాప్‌పై దౌత్య మార్గాల ద్వారా నిరసనలను ప్రారంభించింది. తాము చైనా క్లెయిమ్‌లను తిరస్కరిస్తున్నామని, వాటికి ఎటువంటి ఆధారం లేదని, చైనా వైపు ఇటువంటి చర్యలు సరిహద్దు ప్రశ్న పరిష్కారాన్ని క్లిష్టతరం చేస్తాయని అని MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరగనున్న G20 సమ్మిట్‌కు భారతదేశం సన్నద్ధమవుతున్న తరుణంలో మ్యాప్ బయటపడింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మొత్తం వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసీ) సమస్య పరిష్కారానికి పని చేయాలని అంగీకరించారు.


ఏప్రిల్ ప్రారంభంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రదేశాలకు చైనా కొత్త చైనా పేర్లను ప్రకటించింది. దీనిని భారతదేశం తిరస్కరించింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, పేర్లను కేటాయించడం ద్వారా ఈశాన్య రాష్ట్రం భారత పరిపాలనలో ఉన్న వాస్తవాన్ని మార్చదని పేర్కొంది. మే 2020లో ప్రారంభమైన తూర్పు లడఖ్ సరిహద్దు ప్రతిష్టంభన కారణంగా భారతదేశం, చైనాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీని తరువాత రెండు దేశాల దళాలు మధ్య మూడు సంవత్సరాల పాటు అనేక ఘర్షణలు, చర్చలు జరిగాయి.


చేతనైతే చైనాపై సర్జికల్ దాడులు చేయండి
శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. లడఖ్‌‌లోకి చైనా ప్రవేశించిందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు నిజమేనన్నారు.  ప్రధాని మోదీ బ్రిక్స్‌ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ముచ్చటించిన కొన్ని రోజులకే చైనా ఈ మ్యాప్‌ను విడుదల చేసిందని విమర్శించారు. లడఖ్‌లోని పాంగాంగ్‌ లోయ వద్ద చైనా భారత భూభాగాన్ని లాక్కుందని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు నిజమేనని అర్థమవుతోందన్నారు. చైనా అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోందని, మోదీకి  ధైర్యం ఉంటే చైనాపై సర్జికల్‌ దాడులు చేయాలని రౌత్‌ ధ్వజమెత్తారు.