AP Case Politics :   తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ వరుసగా కేసులు నమోదు చేస్తోంది. నిజానికి ఈ కేసులు ఇప్పటివి కావు. పాతవి. ఏళ్లు గడుస్తున్నా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారు బెయిల్ మీద కూడా విడుదలయ్యారు. కానీ కొత్తగా చంద్రబాబు ప్రధాన పాత్ర ధారి అంటూ పీటీ వారెంట్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేస్తున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుతో పాటు తాజాగా ఫైబర్ నెట్ స్కాం కేసులోనూ పీటీ వారెంట్  కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ సీఐడీ చాలా ప్రణాళికతో చంద్రబాబును వీలైనంత ఎక్కువ కాలం జైల్లో ఉంచాలనుకుంటోందని తాజా పరిణామాలను బట్టి టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగా న్యాయపోరాటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కానీ అదే నిజమైతే వైసీపీ రాజకీయ వ్యూహం ప్రత్యర్థిని జైల్లో పెట్టి తాను ఎన్నికలకు వెళ్లాలనుకోవడం లాంటిదేనని.. అంటున్నారు. 


చంద్రబాబుపై వరుస కేసులు - ఆధారాల్లేవని టీడీపీ ఆరోపణ


చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రిమాండ్ లో ఉన్నారు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ పూర్తయింది. రెండు రోజుల్లో తీర్పు రానుంది. మరో వైపు కస్టడీ పిటిషన్ సీఐడీ వేసింది. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసు.. అలాగే.. ఫైబర్ నెట్ కేసును కూడా లైన్లో పెట్టారు. క్వాష్ పిటిషన్‌లో రిలీఫ్ వస్తే వెంటనే.. ఏసీబీ కోర్టు ద్వారా ఆ రెండు కేసుల్లో అదుపులోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఒక వేళ రిలీఫ్ రాకపోయినా ఇంకా మంచిదే. మరికొంత కాలం జైల్లో ఉంచుతారు. అయితే ఈ కేసుల్లో అవినీతి జరిగిందని ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా లేదని  టీడీపీ నేతలంటున్నారు. అన్నీ కోర్టుల్లో తేలిపోయాయనని సాక్ష్యాలు చూపించలేక.. చార్జిషీట్లు కూడా దాఖలు చేయలేకపోయారని అంటున్నారు. 


ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పాత్ర ఏమిటి ?


ఫైబర్‌ నెట్‌  ప్రాజెక్టులో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ పీటీ వారెంట్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టులో  రూ.121 కోట్ల నిధులు గల్లంతయ్యాయని సిట్ చెబుతోంది. ఈ కేసు కూడా ఇప్పటిది కాదు.  2019లో పెట్టారు. 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేశారు.  ఏ1గా వేమూరి హరి ప్రసాద్‌, ఏ2 మాజీ ఎండీ సాంబశివరావుగా పేర్కొన్నారు. వారిని అరెస్ట్ చేశారు. ఆ కేసులో అందరూ బెయిల్ పై విడుదలయ్యారు. ఇంత వరకూ చార్జిషీటు కూడా వేయలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు పాత్ర గుర్తించామని  పీటీ వారెంట్ కోసం కోర్టుకెళ్లారు. ఈ ప్రాజెక్టుకు  టెర్రా సాఫ్ట్‌కు అక్రమ మార్గంలో టెంబర్లు ఇచ్చారని ప్రభుత్వం ఆరోపణ. ఈ కేసులో గౌరీశంకర్ అనే వ్యక్తి పాత్ర వివాదాస్పదం అయింది. ఆయనకు ప్రభుత్వం పదవి ఇచ్చి.. దొంగ సర్టిఫికెట్లు పెట్టారని  తేలడంతో తప్పించింది. ఆయన వాంగ్మూలమే ఈ కేసులో కీలకమని  చెబుతున్నారు. అప్పట్లోనే టీడీపీ స్కిల్ ప్రాజెక్టు తరహాలో అన్ని వివరాలను వెల్లడించింది. మరోసారి ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని సీఐడీ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. 


అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసు


చంద్రబాబుపై దాఖలైన మరో కేసు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్. అలైన్ మెంట్ ఇష్టారాజ్యంగా మార్చి కొంత మంది లబ్ది చేకూర్చారని వాదన. నిజానికి ఈ కేసులో అసలు ఇన్నర్ రింగ్ రోడ్ లేదు. నిర్మాణం కాలేదు. భూసేకరణ జరగలేదు. రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. కానీ మంగళగిరి ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు. చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయలేదు. మాజీ మంత్రి నారాయణ చేసుకున్నారు.


చంద్రబాబు తనపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ ముందస్తు బెయిల్ కోసం.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకున్నాయి. వాటిపై విచారణలు జరుగుతున్నాయి. అయితే వైసీపీ వ్యూహం మాత్రం  చంద్రబాబును జైల్లోనే ఉంచి ఎన్నికలకు వెళ్లాలనుకుంటోందని అందుకే ఈ కేసులను బనాయిస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు.