Delimitation 50 Percent Formula South India: భారత రాజకీయ యవనికపై రాబోయే కాలంలో అత్యంత కీలకమైన మార్పులకు కారణం కాబోతున్న నియోజకవర్గాల పునర్విభజ అంశం సరికొత్త మలుపు తిరిగింది. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్ల విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాల సీట్లు విపరీతంగా పెరిగి, జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంట్లో దారుణంగా పడిపోతుందనే భయాలు ఇన్నాళ్లూ ఉండేవి. అయితే, కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్న యూనిఫాం 50 శాతం సీట్ల పెంపు ఫార్ములా ఈ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ఏ రాష్ట్రానికీ ఉన్న సీట్లు తగ్గకుండా, ఉన్న స్థానాలను యాభై శాతం పెంచే ఈ మధ్యేమార్గ ఫార్ములాకు దక్షిణాదిలోని ప్రధాన ప్రాంతీయ పార్టీలు లోపాయకారీగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ నడుస్తోంది.
ఈ వ్యూహాత్మక మార్పులో ద్రవిడ మున్నేట్ర కజగం వైఖరి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే తీవ్రంగా నష్టపోయే మొదటి రాష్ట్రం తమిళనాడే. అయితే కేంద్రం ప్రతిపాదించిన నయా మోడల్ ప్రకారం చూస్తే ఏ రాష్ట్రంలోనూ సీట్లు తగ్గవు, పైగా ఉన్న స్థానాలు సగానికి పైగా పెరుగుతాయి. ఈ లెక్కన తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 39 లోక్సభ స్థానాలు కాస్తా ఏకంగా 59 స్థానాలకు పెరుగుతాయి. కేవలం జనాభా ప్రాతిపదికన వెళ్తే ఉత్తరాదితో పోలిస్తే వచ్చే నష్టం కంటే, ఈ 50% పెంపు ఫార్ములా ద్వారా తమ సొంత రాష్ట్రంలో పొలిటికల్ స్పేస్ పెరగడమే కాకుండా పార్లమెంట్లో గొంతుక మరింత బలపడుతుందని డీఎంకే అగ్రనాయకత్వం భావిస్తోంది. ప్రాంతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ సరికొత్త ప్రతిపాదనను తిరస్కరించాల్సిన అవసరం లేదని స్టాలిన్ ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ సానుకూలత
మరోవైపు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ఫార్ములాపై సానుకూల సంకేతాలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలో భారత రాష్ట్ర సమితి కూడా ఈ ప్రతిపాదన పట్ల సానుకూల ధోరణిలోనే ఉన్నట్లు సంకేతాలిచ్చింది. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి నిష్పత్తి దారుణంగా పడిపోనంత కాలం, ఈ యాభై శాతం పెంపుదల మోడల్ వల్ల తమకు వచ్చే నష్టమేమీ లేదని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్సభ స్థానాలు ఈ ఫార్ములా ప్రకారం 25-26 స్థానాలకు పెరుగుతాయి. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్న 25 సీట్లు కాస్తా 37-38 స్థానాలకు చేరే అవకాశం ఉంది. దీనివల్ల ఇరు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు క్షేత్రస్థాయిలో రాజకీయ పునరేకీకరణకు, ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం కల్పించడానికి ఇదొక సువర్ణావకాశంగా మారనుంది.
నిజానికి ఈ 50% యూనిఫాం ఫార్ములాను వ్యతిరేకించే రాజకీయ పక్షాలు దక్షిణాదిలో దాదాపుగా ఉండకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఏ పార్టీ అయినా ఈ ఫార్ములాను పట్టుబట్టి వ్యతిరేకిస్తే.. మరి జనాభా ప్రాతిపదికన కాకుండా దక్షిణాదికి న్యాయం జరిగే ప్రత్యామ్నాయ మార్గం ఏముందో వారు దేశానికి చెప్పాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ ప్రక్రియను ఎల్లకాలం ఆపడం రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాదు కాబట్టి, లభించే అత్యుత్తమమైన ప్యాకేజీని అందుకోవడమే తెలివైన రాజకీయ వ్యూహమనే అభిప్రాయానికి ప్రాంతీయ శ్రేణులు వస్తున్నాయి. వ్యతిరేకత కోసమే వ్యతిరేకిస్తే రాష్ట్రానికి వచ్చే అదనపు సీట్లను, కేంద్ర నిధుల వాటాలను కోల్పోవాల్సి వస్తుందనే ఆర్థిక కోణం కూడా ఇందులో దాగి ఉంది. ఈ ఫార్ములా వెనుక కేంద్రంలోని బిజెపి పెద్దల మాస్టర్ ప్లాన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల జనాభా పెరుగుదలకు అనుగుణంగా అక్కడ కూడా 50% కంటే ఎక్కువ సీట్లు పెరిగే వెసులుబాటును ఉంచుతూనే, దక్షిణాది అలకను తీర్చడానికి ఇదొక బఫర్ జోన్ లాగా పనిచేస్తుంది. పార్లమెంట్ కొత్త భవనంలో 888 లోక్సభ సీట్ల వరకు కూర్చునేలా ముందే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం కూడా ఈ ముందస్తు వ్యూహంలో భాగమేనని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.
రియాలిటీని గుర్తించాల్సిందే!
దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ఇన్నాళ్లూ వ్యక్తం చేసిన జనాభా నియంత్రణ శిక్ష అనే వాదనకు ఈ ఫార్ములా పరోక్షంగా ఒక చక్కని పరిష్కారాన్ని చూపుతోంది. భారత రాజకీయ చరిత్రలో నియోజకవర్గాల పునర్విభజన అనేది ఒక సవాలుతో కూడిన ఘట్టం. కానీ ఈ యూనిఫాం 50 శాతం మోడల్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్కు దాదాపుగా మానసికంగా సిద్ధమైనట్లే కనిపిస్తోంది. అటు ప్రాంతీయ అస్తిత్వం దెబ్బతినకుండా, ఇటు పార్లమెంట్లో సీట్ల సంఖ్య పెరిగి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం లభిస్తుండటంతో.. డీఎంకే, బీఆర్ఎస్, తెలుగుదేశం, వైఎస్సార్సీపీ సహా దాదాపు అన్ని పార్టీలు ఈ కొత్త పొలిటికల్ రియాలిటీని స్వీకరించే దిశగానే అడుగులు వేస్తున్నాయి.
