YSRCP chief Jagan Coterie  dilemma:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో  కోటరీ రగడ ఇప్పుడు బహిరంగ చర్చకు వచ్చేసింది.  పార్టీ ఆవిర్భావం నుండి జగన్ వెన్నంటే ఉండి, 2019 విజయపథంలో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి ,  జగన్‌కు దూరమయ్యారు. కానీ తాను జగన్ కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన సంకేతాలు పంపుతున్నారు. కాకపోతే ప్రస్తుతం ఉన్న సజ్జల కోటరీని బయటకు పంపాలంటున్నారు. దీంతో జగన్ కు ఇప్పుడు కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది.  

Continues below advertisement

ప్రస్తుత కోటరీ ఉంటే గెలిచే చాన్సే లేదంటున్న విజయసాయిరెడ్డి 

ఒకప్పుడు జగన్ 'ఏ-2'గా, పార్టీకి వెన్నెముకగా భావించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు దూరమయ్యారు. అయితే తాను జగన్‌కు దూరం కాలేదని, తనను జగన్ నుండి ప్రస్తుతం ఉన్న కోటరీ సభ్యులే దూరం చేశారని ఆయన బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి సహా ప్రస్తుతం జగన్ చుట్టూ ఉన్న వారికి కనీస రాజకీయ పరిజ్ఞానం లేదని, వారు జగన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించడం పార్టీలో ఉన్న తీవ్ర విభేదాలను సూచిస్తోంది. తనను తిరిగి పార్టీ బాధ్యతల్లోకి తీసుకుంటే కూటమిని విడగొట్టి, జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతానని ఆయన చేస్తున్న ప్రకటన వైసీపీ శ్రేణుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

Continues below advertisement

2019 విజయం vs 2024 ఓటమి  

వైసీపీ క్షేత్రస్థాయి క్యాడర్‌లో విజయసాయిరెడ్డి పట్ల సానుకూలత కనిపిస్తోంది. 2019 ఎన్నికల సమయంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి, బూత్ స్థాయి వరకు యంత్రాంగాన్ని నడిపించిన ఘనత విజయసాయిరెడ్డిదేనని మెజారిటీ కార్యకర్తలు నమ్ముతున్నారు. అదే సమయంలో 2024 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోని కోటరీ అనుసరించిన అతి విశ్వాసం, కార్యకర్తలకు నేతలను దూరం చేసిన తీరే కారణమని క్యాడర్ బలంగా విశ్వసిస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను జగన్ దృష్టికి వెళ్లకుండా అడ్డుకున్నారనే అపవాదు సజ్జల కోటరీపై బలంగా పడింది.

 జగన్ ముందున్న సంకట స్థితి - రెండే దారులు 

ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ఒక కీలకమైన కూడలిలో ఉన్నారు. ఆయన ముందు ప్రధానంగా రెండు మార్గాలు కనిపిస్తున్నాయి: ఒకటి, గడిచిన ఐదేళ్లుగా తన వెన్నంటే ఉండి, పార్టీ విధానాలను నడిపించిన సజ్జల. ప్రస్తుత కోటరీనే నమ్ముకుని ముందుకు సాగడం. రెండు, పాత మిత్రుడిని, వ్యూహకర్తను విశ్వసించి విజయసాయిరెడ్డికి మళ్లీ పగ్గాలు అప్పగించడం. అయితే, జగన్ సాధారణంగా తాను నమ్మిన వారిని వదులుకోవడానికి ఇష్టపడరని, కానీ ఇప్పుడు పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడిన తరుణంలో ఆయన తన పంథాను మార్చుకుంటారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

 పార్టీ సంస్థాగత నిర్మాణం - విశ్వసనీయత ప్రశ్న 

విజయసాయిరెడ్డి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులతో వ్యక్తిగత సంబంధాలను కలిగి ఉన్నారు. ఆయనను పక్కన పెట్టడం వల్ల ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో పార్టీ పట్టు కోల్పోయిందనే వాదన ఉంది. మరోవైపు, సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని విభాగాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, అది కేవలం పాలనాపరమైన సలహాలకే పరిమితమైందని, రాజకీయ వ్యూహాల్లో ఆయన విఫలమయ్యారని పార్టీలోని ఒక వర్గం భావిస్తోంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి నేరుగా సవాల్ విసురుతున్నందున జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.

కూటమిని ఎదుర్కోవాలంటే వ్యూహం మారాల్సిందేనా 

ప్రస్తుతం ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అత్యంత పటిష్టంగా ఉంది. ఇటువంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే కేవలం సామాజిక సమీకరణాలు మాత్రమే సరిపోవని, రాజకీయంగా చీలికలు తెచ్చే పక్కా వ్యూహాలు అవసరమని విజయసాయిరెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఆయనకు ఉన్న పాత నెట్‌వర్క్, రాజకీయ చాణక్యం ఇప్పుడు పార్టీకి అవసరమని క్యాడర్ కోరుకుంటోంది. జగన్ తన కోటరీని ప్రక్షాళన చేయకుండా కేవలం ప్రజల్లోకి వెళ్తే ఫలితం ఉండదని, లోపల వ్యవస్థను మార్చాలని  కోరుకుంటున్నారు. 

మార్పు తప్పదా? 

రాబోయే రోజుల్లో జగన్ కోటరీలో మార్పులు జరిగే అవకాశాలను కొట్టిపారేయలేం. ఒకవేళ విజయసాయిరెడ్డిని జగన్ ఆహ్వానిస్తే  సజ్జల కోటరీ బయటకు పోవాల్సి ఉంటుంది. జగన్ ఇప్పటికీ మౌనంగానే ఉంటూ పరిణామాలు గమనిస్తున్నారు.  విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రతిపాదన జగన్ హృదయాన్ని గెలుచుకుంటుందా లేక కోటరీ గోడలకు తగిలి వెనక్కి వస్తుందా అనేది వేచి చూడాలి.