KTR and Midhun Reddy: ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ ముఖ్యమంత్రులు కీలక మంత్రులు దావోస్‌లో పర్యటిస్తున్నారు. రాష్ట్రాలు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు అంతర్జాతీయ పరిశ్రమలతో చర్చలు జరుపుతున్నారు. అదే టైంలో రాష్ట్రంలో రాజకీయ కాక పీక్స్‌కు చేరింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సెగలు పుట్టిస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ రాజకీయల్లో కిక్కు తెప్పిస్తోంది. ఈ కేసుల్లో కూడా కీలక నేతలైన కేటీఆర్, మిథున్ రెడ్డి విచారణ ఎదుర్కోనున్నారు. అధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోతున్నారు. ఒకే రోజు వేర్వేరు కేసుల్లో ఇద్దరు కీలక నేతలు విచారణకు హాజరుకావడంపై రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. 

Continues below advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్   

తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే రాజకీయ నాయకులను ప్రశ్నించిన సిట్‌ ఇప్పుడు కీలక నేతలపై ఫోకస్ పెట్టింది. రెండు రోజుల క్రితం బీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించే మాజీ మంత్రి హరీష్‌రావు పిలిచి విచారించారు. ఆయన్ని బాధితుడిగానే విచారించామని పోలీసులు చెబుతున్నారు. హరీష్‌రావును పిలిచి విచారించిన విషయాలపై చర్చ జరుగుతున్న సందర్భంగానే కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. 11 గంటలకు వచ్చి సిట్ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 

కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడంతో సిట్‌ దూకుడు పెంచిందనే ప్రచారం మొదలైంది. ఈ కేసు అంతా కేటీఆర్, కేసీఆర్ చుట్టే తిరిగింది. వీళ్లిద్దరే తమ ఫోన్‌లు ట్యాప్ చేశారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. చివరకు కేసీఆర్ కుమార్తె కవిత కూడా తన భర్త ఫోన్ ట్యాప్ అయ్యిందని అన్నారు. అయితే చేసింది ఎవరూ అనేది మాత్రం ఆమె చెప్పలేదు. అందుకే కేటీఆర్, కేసీఆర్ చుట్టూ తిరుగుతున్ కేసులో ఇప్పుడు కేటీఆర్‌ను విచారణకు పిలవడం ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు వివిధ వర్గాలను విచారించగా వచ్చిన సమాచారం, నేతలు ఇచ్చిన సమాచారం, సిట్ సేకరించిన సమాచారం ఆధారంగా ప్రశ్నించనున్నారు. 

Continues below advertisement

ఫోన్ ట్యాపింగ్ సాధారణ విషయమని, ఇది పోలీసులే చేస్తారని తమకు సంబంధం లేదని కేటీఆర్ చెబుతున్నారు. ఇందులో పిలవాల్సి వస్తే ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్‌రెడ్డిని విచారించాలని సవాల్ చేశారు. తమలాంటి వారిని కేవలం కక్ష సాధింపులో భాగంగా విచారిస్తున్నారే తప్ప విషయం లేదని ఎద్దేవా చేశారు. ఎక్కడికైనా ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తామని చెప్పుకొచ్చారు. కొంతమంది వ్యక్తులు డబ్బులు పట్టుకొని ప్రభుత్వాలను కూలుస్తామని చెప్పి తిరుగుతున్న టైంలో అధికారులు వారిపై నిఘా పెట్టి ఉండొచ్చని కూడా అన్నారు. హరీష్‌రావు మాదిరిగానే అడిగిందే అడిగి గంటలతరబడి కూర్చోబెట్టి పంపేస్తారని అంతకు మించి ఏం చేయలేరని చెప్పుకొచ్చారు. 

నిన్న సాయి రెడ్డి నేడు మిథున్ రెడ్డి 

వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి, లిక్కర్ స్కామ్‌లో పేర్లు ఉన్న వారిపై ఈడీ ఫోకస్ చేసింది. ఇందులో వచ్చిన డబ్బులను పన్నులు ఎగ్గొట్టేందుకు సూట్‌కేస్ కంపెనీలతో విదేశాలకు తరలించాలని నిర్దారించుకున్న ఈడీ ఇప్పుడు ఒక్కొక్కర్ని పిలిచి విచారిస్తోంది. గురువారం నాడు వైసీపీ మాజీ లీడర్ విజయసాయి రెడ్డిని ప్రశ్నించింది. ఇవాళ(జనవరి23, 2026) వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని గ్రిల్ చేయనున్నారు. ఈ కేసులో కూడా ఎలాంటి కుంభకోణం లేదని వైసీపీ గట్టిగానే వాదిస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దూకుడుగా ఉంటే, ఈడీ అదే స్పీడ్‌తో ఒక్కొక్కర్ని పిలిచి విచారిస్తోంది. ఇప్పటికే సిట్ కీలక నేతలను అరెస్టు చేసింది. వారిలో కొందరు జైల్లో ఉన్నారు. మరికొందరు బెయిల్‌పై బయటకు వచ్చారు. మిథున్ రెడ్డి కూడా జైలుకు వెళ్లి వచ్చారు. ఇప్పుడు ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. 

మిథున్ రెడ్డి కంటే ఒక రోజు ముందగానే విచారణకు హాజరైన వైసీపీ మాజీ లీడర్ సాయిరెడ్డి కీలక సమాచారం ఈడీ అధికారులకు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో కర్త కర్మ క్రియ అంతా రాజ్‌కసిరెడ్డిదేనని అన్నారు. చాలా డబ్బులు చేతులు మారాయని కూడా వాంగ్మూలం ఇచ్చినట్టు ప్రచారంలో ఉంది. సాయిరెడ్డితోపాటు మిగతా వారు ఇచ్చిన వాంగ్మూలాలు ఆధారంగానే మిథున్ రెడ్డిని సుదీర్ఘంగా విచారిస్తారని తెలుస్తోంది. 

ఇలా ఒకే రోజు పొలిటికల్ హీట్ పెంచేంలా ఇద్దరు నేతలు విచారణకు హాజరవ్వడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.