Resign Politics :   తెలంగాణలో ప్రతి ఆరు నెలలకు ఓ ఉపఎన్నిక వస్తుంది. ఉపఎన్నిక వచ్చిన నియోజకవర్గం దశ తిరిగిపోతోంది. అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే రాజీనామా చేసిన దగ్గర్నుంచి నియోజకవర్గం మొత్తం ఎక్కడ చూసినా విచ్చలవిడిగా డబ్బుల ఖర్చు కనిపిస్తోంది. ప్రజలకు ఓటర్లకు రాచమర్యాదలు అందుతున్నాయి. దీంతో తమ నయోజకవర్గానికీ ఉపఎన్నిక రావాలని కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. నేరుగా ఎమ్మెల్యేలకే కాల్ చేసి అడుగుతున్నారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అలా ఫోన్ చేసి అడగడమే కాదు.. ఆ కాల్స్‌ను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఆడియోలు ఒక దాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. 


ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్న ఓటర్లు !


 మెదక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి,   నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జహీరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావు, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, అందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్,  జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. తమ నియోజకవర్గాలకు చెందిన ఓటర్ల నుంచి ఇలాంటి ఫోన్ కాల్స్ అందుకున్నారు.  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే..మునుగోడు నియోజకవర్గం తరహాలో తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు త్వరగా జరుగుతాయని వారు ఎమ్మెల్యేకు సూచిస్తున్నారు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని కోరాడు. రాజీనామా చేస్తే మునుగోడు నియోజకవర్గం తరహాలో తమకు లబ్ధి చేకూరుతుందని విజ్ఞప్తి చేశాడు. సీఎం కేసీఆర్ ను అడిగి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే  సర్ది చెప్పాల్సి వచ్చింది.  అందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు అల్లాదుర్గం మండలం మాందాపూర్ గ్రామం నుంచి కృష్ణ అనే వ్యక్తి ఫోన్ చేసి రాజీనామా కోరాడు. ఇప్పటికే తన నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేపట్టానని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.. సదరు వ్యక్తికి నచ్చజెప్పాడు.


ధర్నాలు చేసి.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు ! 


కొన్ని చోట్ల జనం రాస్తారోకోలు చేస్తున్నారు.  బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు రాజీనామా చేస్తేనే రోడ్డు వేస్తారని  ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్ మండలానికి చెందిన ఆరు గ్రామాల ప్రజలు ఆదివారం నిపాని గ్రామం వద్ద రాస్తారోకో చేపట్టారు.  ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే రోడ్డు బాగు పడుతుందన్నారు. నర్సాపూర్​ఎమ్మెల్యే మదన్ రెడ్డికి శనివారం ఫోన్​ చేసి పదవికి రాజీనామా చేయాలని కోరిన బీజేపీ శివ్వపేట మండలం ఉసిరికపల్లి ప్రధాన కార్యదర్శి అశోక్​పై టీఆర్ఎస్​ నాయకులు ఆదివారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలాంటివి పెరిగిపోతూండటంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లోనూ అసహనం పెరిగిపోతోంది. కొత్త నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను లిఫ్ట్ చేయడం లేదు. 


ఇదేదో బాగుందని అందుకున్న బీజేపీ నేతలు !


ఎమ్మెల్యేల రాజీనామాలను డిమాండ్ చేయడం.. అలా చేస్తే మునుగోడు ..  హుజురాబాద్ తరహాలో అభివృద్ధి చెందుతుందని ప్రచారం చేస్తూ..  బీజేపీ నేతలు ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో .. తమ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయాలని కొన్ని చోట్ల నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. దళిత బంధు పేరుతో ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షలు పంచడంతో.. అలాంటి స్కీమ్ లు ఎమ్మెల్యే రాజీనామా చేస్తే తమకూ వస్తుందనుకున్నారు. అయితే హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. మునుగోడు ఉపఎన్నికతో మల్లీ ఆ పరిస్థితి పెరిగింది.