మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. అన్ని పార్టీల్లో కేసీఆర్‌ మనుషులు ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ కోవర్టులు ఎవరు అనే చర్చ మొదలైపోయింది. 


ఈటల రాజేందర్‌.. కేసీఆర్‌తో సుదీర్ఘంగా ప్రయాణం చేసిన నేత. మూడేళ్ల క్రితం వరకు ఉద్యమ పార్టీలో కీలక నిర్ణయాల్లో పాలుపంచుకున్న లీడర్. అలాంటి వ్యక్తి బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కేసీఆర్‌, ఆయన ఫ్యామిలీ టార్గెట్‌కా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అలాంటి కామెంట్స్ చేసి తెలంగాణ పాలిటికల్ సర్కిల్‌లో దుమారం రేపారు. ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ కలకలం సృష్టిస్తున్నాయి. 


కేసీఆర్ రాజకీయం పూర్తిగా తెలిసిన రాజేందర్‌... అన్ని పార్టీల్లోనూ కోవర్టులు ఉన్నారని బాంబ్‌ పేల్చారు. వాళ్లంతా కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారని అన్నారు. అందుకే చాలా మంది బీజేపీలో చేరేందుకు వెనుకడుగు వేస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌లో తాను ఉన్నప్పుడు తనతోపాటు మరికొందరు లీడర్లను ఓడించడానికి కేసీఆర్‌ ప్రత్యర్థులకు డబ్బులు ఇచ్చారని విమర్శించారు. 






ఇటీవల కాలంలో పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీలో చేరుతారని విస్తృతంగా ప్రచారం నడిచింది. ఏ పార్టీలో లేనట్టుగానే ఓ జాయినింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. దీన్ని రాజేందర్ తప్పుపట్టారు. ఆ కమిటీ కారణంగానే విషయాలు బయటకు లీక్ అవుతున్నాయని అన్నారు. దీని వల్ల చాలా మందికి ఫోన్లు వెళ్తున్నాయని వారంతా భయపడిపోతున్నారని కామెంట్ చేశారు. అందుకే బీజేపీలో జాయిన అయ్యేందుకు ముందుకు రావడం లేదన్నారు. 


ఈటల రాజేందర్ చేసిన ఈ కామెంట్స్ అన్ని పార్టీల్లోను కాక రేపుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు రాబోయే ఎన్నికలకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పుడు కోవర్టులు అంటూ పేల్చిన బాంబ్‌... పెను ప్రకంపనలే సృష్టించేలా ఉంది. ఒకరిపై ఒకరు అనుమానంతో చూసుకునే పరిస్థతి ఏర్పడుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 


బీజేపీలో ఆ కోవర్టులు ఎవరు అనే చర్చ ప్రధానంగా మొదలైంది. ఈటల రాజేందర్ లాంటి సీనియర్ నేత, కేసీఆర్‌ వ్యూహాలు తెలిసిన వ్యక్తి చేసిన కామెంట్స్ ఈజీగా తీసుకోలేమంటున్నారు ఆ పార్టీ నేతలు. అందుకే వారెవరు అనే సెర్చ్‌ ఆపరేషన్ షురూ అయిందని టాక్ వినిపిస్తోంది.


రిపబ్లిక్‌ డే వేడకు నిర్వహించకపోవడాన్ని కూడా ఈటల రాజేందర్ తప్పుపట్టారు. అంబేద్కర్ రాజ్యాంగం ఆమోదం పొందిన రోజున వేడుకలు నిర్వహించకపోవడం దారుణం అన్నారు. కరోనా కారణంగా గణతంత్ర దినోత్సవం వేడుకలను నిర్వహించలేకపోతున్నామని చెప్పడం మరింత హాస్యాస్పదం అన్నారు. మీ రాజ్ భవన్ లోనే నిర్వహించుకోండి అని కేసీఆర్ లేఖ రాయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని విమర్శించారు. 


గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం పద్ధతి కాదన్నారు ఈటల. ఇలా చేయడం రాజ్యాంగాన్ని, ప్రజలను అవమానించడమేనన్నారు. తమని కూడా అవమానించి హక్కులను కాలరాస్తూ అసెంబ్లీ నుంచి బయటికి గెంటివేస్తున్నారన్నారు. ఫిబ్రవరి 3 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించాలని చూస్తున్నారని ఆరోపించారు. రాచరికపు పోకడలకు పరాకాష్ట ఇదన్నారు. 


ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెట్టే ఆల్‌పార్టీ మీటింగ్‌ ఒకనాడు కూడా కేసీఆర్ పెట్టలేదని విమర్శించారు ఈటల. అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లను పిలిచి మాట్లాడింది లేదన్నారు. ఐదుగురు సభ్యులు లేరని బీజేపీ బీఏసీ సమావేశానికి కూడా పిలవలేదన్నారు. గత ప్రభుత్వాలు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా బీఏసీ సమావేశానికి పిలిచేవారని గుర్తు చేశారు. సీఎంను కలిసే పరిస్థితి ఎమ్మెల్యేలకు లేదని ఆరోపించారు. పార్టీల మధ్య ఇనుప గోడలు పెట్టి, రాచరికపు పోకడలను అణువణువునా అమలు చేస్తున్న నీచమైన, నికృష్టమైన సీఎం కేసీఆర్ అని ధ్వజమెత్తారు. 


మొత్తం ఎన్నికల ప్రక్రియను డబ్బుతో ముడిపెట్టి లీడర్లను కేసీఆర్‌ కొనేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ అధికార దుర్వినియోగంతో పోలీసులను వాడుకుంటూ ఎన్నికల్లో 100ల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ఒక్క హుజురాబాద్‌లోనే రూ.600 కోట్లు ఖర్చు చేశారని... మునుగోడులో 100 ల కోట్ల ఖర్చు పెట్టారన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని వాపోయారు. పోలీసులు కేసీఆర్ కు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. పోలీసుల వలయంలోనే డబ్బులు పంచుతున్నారన్నారు.