బెజ‌వాడ కేంద్రంగా హ‌త్యా రాజ‌కీయాలు మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చాయి. ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల మ‌ధ్య ఆధిప‌త్య పోరులో భాగంగా హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌లు వెలుగులోకి రావ‌టం క‌ల‌కలం రేపుతోంది. టీడీపీ మాజీ కార్పోరేట‌ర్ చెన్నుపాటి గాంధీపై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది. ఈ ఘ‌ట‌న‌లో వైసీపీ నేత‌ల ప్రమేయం ఉంద‌ని పోలీసులు ప్ర‌క‌టించారు. అయితే ఉద్దేశ‌పూర్వకంగా జ‌రిగిన ఘ‌ట‌న కాద‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ స్వ‌యంగా వెల్ల‌డించారు.


టీడీపీ మాజీ కార్పోరేట‌ర్ చెన్నుపాటి గాంధీపై హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న త‌రువాత ప‌రిస్థితులు కాస్త ఉద్రిక్తంగా మారాయి. చెన్నుపాటి గాంధీ స్థానికంగా మంచి ప‌ట్టు ఉన్న నాయ‌కుడు. మొద‌టి నుండి టీడీపీకి క‌రుడుక‌ట్టిన కార్య‌క‌ర్త‌. టీడీపీలో అనేక మంది నాయ‌కులు పార్టీని వీడిన‌ప్ప‌టికి గాంధీ మాత్రం వారితో పాటుగా పార్టీని విడిచిపెట్ట‌లేదు. దీంతో పార్టీ కూడా గాంధీకి గుర్తింపు ఉంది. గ‌తంలో జ‌రిగిన విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో టీడీపీ నుండి చెన్నుపాటి గాంధీ పోటీ చేయాల్సిన డివిజ‌న్.. మ‌హిళ రిజ‌ర్వేష‌న్ కావ‌టంతో అక్క‌డ ఆయ‌న భార్య‌ను నిల‌బెట్టి గెలిపించారు.


దీంతో అప్పుడే వైసీపీ నేత‌ల‌కు, టీడీపీ వ‌ర్గాల‌కు మ‌ద్య విభేదాలు మెద‌ల‌య్యాయి. అలా మెద‌ల‌యిన విభేదాలు ఇప్పుడు దాడుల‌కు వర‌కు వెళ్ళాయ‌ని చెబుతున్నారు. దీంతో పాటుగా విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ కు ప‌ట్టు ఉంది. ఇప్పుడు అదే నియోజ‌క‌వ‌ర్గానికి దేవినేని అవినాష్ ను వైసీపీ ఇంచార్జ్ గా నియ‌మించారు. దీంతో దేవినేని, గ‌ద్దె కుటుంబాల‌కు మ‌ధ్య వార్ మొద‌లైంద‌ని ప్ర‌చారం ఉంది. గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో దేవినేని రాజ‌శేఖ‌ర్ నెహ్రూ ఉండ‌గా, అప్పుడు కూడా గ‌ద్దె రామ్మోహ‌న్ కు మ‌ధ్య రాజ‌కీయ ప‌ర‌మైన విభేదాలు వ‌చ్చాయి.


ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతున్నాయ‌ని చెబుతున్నారు. ప్ర‌ధానంగా వైసీపీ, టీడీపీ వ‌ర్గాలు తూర్పులో ప‌ట్టు కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. తూర్పులో గ‌ద్దెకు మెద‌టి నుండి ప‌ట్టు ఉంది. దేవినేని కుటుంబం కూడా తూర్పులో ప‌ట్టు సాదించేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే దేవినేని అవినాష్, టీడీపీలో ఉండ‌గా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేసి ఓట‌మిపాల‌యిన త‌రువాత‌, ఆయ‌న కూడా వైసీపీలో చేరారు. ఆ త‌రువాత అవినాష్ ను విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ గా నియ‌మించారు. ఈ ప‌రిణామాలు నేప‌థ్యంలో తాజాగా టీడీపీకి అత్యంత కీల‌క‌మ‌యిన నాయ‌కుడిగా ఉన్న చెన్నుపాటి గాంధీని కావాల‌నే టార్గెట్ చేసి, రాజ‌కీయంగా పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని టీడీపీ మండిప‌డుతుంది.


ఘ‌ట‌న జ‌రిగిన త‌రువాత పోలీసులు విచార‌ణ చేయ‌కుండానే, చిన్న గొడ‌వ అంటూ స‌ర్దిచెప్పేందుకు ప్ర‌య‌త్నించ‌టం, ఆ త‌రువాత పోలీసు క‌మిష‌న‌ర్ కూడా హ‌త్యా య‌త్నం జ‌రిగితే, కేవ‌లం చిన్న‌పాటి ఘ‌ర్ష‌ణ అంటూ మాట్లాడ‌టంపై టీడీపీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. పోలీసులపై న‌మ్మ‌కం లేద‌ని అంటున్నారు. నిస్ప‌క్ష‌పాతంగా విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అటు పోలీసులు కూడా ఈ ఘ‌ట‌న త‌రువాత ప‌రిణామాల‌ను తీవ్రంగానే ప‌రిగ‌ణిస్తున్నారు. గాంధీపై జ‌రిగిన దాడి కేసు విచార‌ణలో ఉంద‌ని, ఇప్ప‌టికే ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నామ‌ని చెబ‌తున్నారు.


తేలికగా తీసుకుంటున్న పోలీసులు


అయితే, ఈ ఘ‌ట‌న రాజ‌కీయంగా అంత పెద్ద‌ది కాద‌ని, విజ‌య‌వాడ న‌గ‌రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపులో ఉన్నాయ‌ని చెబుతున్నారు. మీడియాలో అన‌వ‌స‌రంగా లేనిపోని వాటిని ప్ర‌చారం చేస్తున్నార‌ని, పొలిటిక‌ల్ కోణంలో ఈ సంఘ‌ట‌న చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. స్థానికంగా ఉన్నవి చిన్న చిన్న విభేదాలు మాత్ర‌మేన‌ని పోలీస్ క‌మిష‌నర్ వెల్ల‌డించారు. వైద్యుడి ప్రాథమిక‌ నివేదికలో చేతితో బ‌లంగా కొట్ట‌టంతోనే కంటికి గాయం అయ్యింద‌ని వివ‌రించారు. విజ‌య‌వాడ నుండి ప్ర‌భుత్వ వైద్యుల బృందాన్నికూడా హైద‌రాబాద్ లో చెన్నుపాటి గాంధీ చికిత్స పొందుతున్న‌ ఆసుప‌త్రికి పంపి నివేదిక‌ను తీసుకుంటామ‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ క్రాంతి రాణా టాటా తెలిపారు. 
అటు వైసీపీ కూడా ఈ ఘ‌టనపై ఆరా తీస్తోంది. టీడీపీ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు వాస్త‌వాలు లేవ‌ని అంటున్నారు. పోలీసుల విచార‌ణ‌లో వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు. దీనిపై వైసీపీ నేతలు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు బ‌హిరంగంగా మాట్లాడ‌లేదు.