GenZ Non Political Movement Success: భారత రాజకీయాల్లో ప్రజాపోరాటాలు, ధర్నాలు అంటే దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల అనుబంధ విభాగాలు  నడిపించే ఒక సాంప్రదాయ శైలి మాత్రమే మనకు తెలుసు. కానీ, దేశ చరిత్రలో తొలిసారిగా ఎలాంటి రాజకీయ జెండాలు, అనుబంధ గుర్తులు లేకుండా కేవలం తమ భవిష్యత్తు కోసం  కాక్రోచ్ జనతా పార్టీ పే్రుతో  జెన్  యువత సాధించిన విజయం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దశాబ్దాలుగా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, జాతీయ నేతలు కూడా సాధించలేని రీతిలో.. కేంద్రంలో అత్యంత బలమైన నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేసి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సాధించుకోవడం ఈ  జెన్జీ  తొలి పోరాటానికి లభించిన అతిపెద్ద హిట్ మార్క్!

Continues below advertisement

పార్టీల రంగులు పడకుండా చేసిన పోరాటం ఫలితం

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాలు, పేపర్ లీకేజీల రచ్చతో విసిగిపోయిన విద్యార్థులు ఈసారి సాంప్రదాయ రాజకీయ పార్టీల నేతల మాటలను నమ్మలేదు. ప్రతిపక్షాలు ఈ సమస్యను తమ రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూసిన ప్రతిసారి, జెన్జీలు వారిని దూరంగా ఉంచారు.  ఇది మా భవిష్యత్తు పోరాటం.. మీ రాజకీయ రచ్చ ఇక్కడ వద్దు  అని తెగేసి చెప్పారు. రాజకీయ అజెండాలకు అతీతంగా, కేవలం పారదర్శకత , జవాబుదారీతనం  డిమాండ్‌తో సాగించిన ఈ నాన్-పొలిటికల్ మూవ్‌మెంట్ ముందు కేంద్ర యంత్రాంగానికి ఏం చేయాలో పాలుపోలేదు. పార్టీల రంగులు పూసి ఆందోళనలను దిగజార్చే అవకాశం లేకపోవడమే ఈ ఉద్యమానికి అతిపెద్ద బలమైంది.

Continues below advertisement

డిజిటల్ ప్లస్ ఫీల్డ్  స్ట్రాటజీ 

సాంప్రదాయ పోరాట శైలికి భిన్నంగా జెన్జీలు అవలంబించిన  డిజిటల్ ప్లస్ ఫీల్డ్  స్ట్రాటజీ ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఒకవైపు సోషల్ మీడియా వేదికలైన ఎక్స్ , ఇన్‌స్టాగ్రామ్‌లలో లక్షలాది హాష్‌ట్యాగ్‌లతో అంతర్జాతీయ స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే.. మరోవైపు ఢిల్లీ వీధుల్లో ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత నిరసనలు చేపట్టారు. హుందాతనంతో కూడిన నిరసనలు, ఖచ్చితమైన సమాచారంతో కూడిన ప్రశ్నావళితో కేంద్ర మంత్రులను, అధికారులను నిలదీశారు.  లాఠీఛార్జ్‌లు చేసినా ఎదుర్కొన్నారు. కానీ అది విధ్వంసం వైపు వెళ్లనీయలేదు.  ప్రజాస్వామ్యయుత తీవ్ర నిరసనతోనే ఢిల్లీ పీఠాన్ని కదిలించారు.

ముప్పును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 

రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది జెన్జీలు ఎలా సాధించారంటే.. అందులో నైతిక బలం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ప్రతిపక్ష పార్టీ ధర్నా చేస్తే దానికి  ఎన్నికల స్టంట్ అనే ముద్ర వేసి కొట్టిపారేయడం ప్రభుత్వాలకు తేలిక. కానీ, స్వచ్ఛమైన మనస్సులతో తమ కష్టానికి ప్రతిఫలం కోరుతూ వీధిలోకి వచ్చిన లక్షలాది మంది అభ్యర్థుల ఆవేదనను ఏ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయలేదు. పైగా, రాబోయే రోజుల్లో దేశంలోనే అతిపెద్ద ఓటు బ్యాంకుగా మారబోతున్న ఈ జెన్జీ  ఓటర్ల ఆగ్రహానికి గురైతే కలిగే నష్టం తీవ్రంగా ఉంటుందని కేంద్ర బిజెపి అధిష్టానం ముందే గ్రహించింది.

ప్రధాన్ రాజీనామా వ్యవస్థలపై సాధించిన విజయం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం ఒక వ్యక్తి పదవిని కోల్పోవడం కాదు. అది వ్యవస్థల పారదర్శకతపై సాధించిన విజయం. ప్రభుత్వాలు ఎంతటి మేజారిటీతో ఉన్నా, యువత , పౌర సమాజం ఒకే లక్ష్యంతో నిలబడితే దిగిరాక తప్పదనే సందేశాన్ని కాక్రోచ్ జనతా పార్టీ  పోరాటం అందించింది. గతంలో రైతులు సాధించిన విజయం ఒక ఎత్తయితే, డిజిటల్ యుగంలో పెరిగిన జెన్జీలు సాంకేతికతను, ప్రజాస్వామ్య హక్కులను మేళవించి సాధించిన ఈ విజయం భారత రాజకీయ భవిష్యత్తుకు ఒక సరికొత్త దిక్సూచిగా నిలిచింది. తొలి ప్రయత్నంలోనే ప్రభంజనం సృష్టించిన  జెన్జీ మూవ్‌మెంట్, రాబోయే రోజుల్లో దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే.. విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత లేకపోతే యువత ఎలాంటి దెబ్బ తీయగలదో ప్రత్యక్షంగా చూపించింది. రాజకీయాల్లో జెండాల కంటే, నినాదాల కంటే..  న్యాయం, బాధ్యత అనే ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలే గెలుస్తాయని ఈ చారిత్రాత్మక ఘట్టం స్పష్టం చేసింది.