Sharmila will also go on a padayatra to compete with Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం త్వరలో ఒక అరుదైన మరియు అత్యంత ఆసక్తికరమైన ఘట్టానికి వేదిక కాబోతోంది.  వైఎస్సార్ వారసత్వ పోటీలో ఉన్న  అన్నాచెల్లెళ్లు జగన్ మోహన్ రెడ్డి  , వైఎస్ షర్మిల పోటాపోటీగా పాదయాత్రలకు సిద్దమవుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  పాదయాత్ర అనేది కేవలం ఒక ప్రచారం మాత్రమే కాదు, అది అధికార పీఠాన్ని అధిరోహించడానికి ఒక సెంటిమెంట్ , బలమైన అస్త్రం. గతంలో వైఎస్సార్, ఆ తర్వాత జగన్, షర్మిల , లోకేష్ అందరూ దీని ద్వారానే ప్రజలకు దగ్గరయ్యారు.

Continues below advertisement

మళ్లీ పాదయాత్ర ప్రకటించిన జగన్ 

మరోసారి అధికారం కోసం  జగన్ తన పాదయాత్రను ఏడాదిన్నర ముందే ప్రకటించడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నట్లు కనిపిస్తోంది. షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పటి నుండి వైఎస్సార్ అభిమానులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల కూడా పాదయాత్రకు సన్నద్ధమవుతున్నారనే సమాచారంతోనే, జగన్ ముందస్తుగా తన యాత్రను ప్రకటించి హైప్ ను తన వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Continues below advertisement

ముందు ప్రకటించడం వెనుక మైండ్ గేమ్? 

సాధారణంగా ఏదైనా భారీ కార్యక్రమాన్ని ముందుగా ప్రకటిస్తే దానికి ఉండే క్రేజ్ తగ్గుతుంది. అయినప్పటికీ జగన్ ఈ సాహసం చేయడం వెనుక షర్మిల అడుగులను నియంత్రించే ఉద్దేశం ఉండవచ్చని చర్చ జరుగుతోంది. జగన్ యాత్రను ప్రకటించిన తర్వాత షర్మిల కూడా అదే బాట పడితే, ఆమె జగన్‌ను అనుసరిస్తున్నారనే ముద్ర పడే అవకాశం ఉంది. అయితే, షర్మిల ఈ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. జగన్ ప్రకటించారనే నెపంతో ఆగిపోకుండా, తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్లేందుకు ఆమె ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  ఒకే సమయంలో అన్నాచెల్లెళ్లు ఇద్దరూ రోడ్లపైకి వస్తే ఏపీ రాజకీయం రెండు గ్రూపులుగా విడిపోయే అవకాశం ఉంది.

జగన్ సెల్ఫ్ డిఫెన్స్.. షర్మిల అఫెన్స్! 

జగన్ పాదయాత్ర ప్రధానంగా గత ఎన్నికల్లో కోల్పోయిన ప్రజాధారణను తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే తన కేడర్‌లో ఉత్సాహం నింపడానికి ఉద్దేశించినది. కానీ షర్మిల వ్యూహం వేరుగా ఉంది. ఆమె జగన్ వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా,  నిజమైన వైఎస్సార్ వారసురాలు నేనే  అని నిరూపించుకోవాలని చూస్తున్నారు. తాజాగా ఆమె విజయవాడలో జగన్ నైజంపై చేసిన విమర్శలు దీనికి సంకేతం. జగన్ యాత్ర ప్రకటించడంపై ఆమె వేసిన సెటైర్లు చూస్తుంటే, పాదయాత్రలో ఆమె జగన్‌ను మరింత వ్యక్తిగతంగా, రాజకీయంగా ఇరకాటంలో పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ తన పాదయాత్ర ద్వారా తన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయాలని చూస్తుంటే, షర్మిల మాత్రం ఆ పథకాల అమలులో జరిగిన లోపాలను, జగన్ పాలనలోని లోపాలను ఎత్తిచూపే అవకాశాలు ఉన్నాయి. 

హాట్ టాపిక్‌గా  వైఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్ 

ఒకప్పుడు జగన్ కోసం షర్మిల పాదయాత్ర చేశారు. జగనన్న  వదిలిన బాణాన్ని  అని గర్వంగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు అదే బాణం జగన్‌ను గురి పెడుతోంది. ఒకే రాష్ట్రంలో, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు, ఒకే లక్ష్యం   కోసం వేర్వేరుగా పాదయాత్రలు చేయడం భారత రాజకీయ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం కాబోతోంది. వీరిద్దరి మధ్య పోరాటమే రాబోయే ఎన్నికల వరకు ఏపీ రాజకీయాల్లో హైలైట్ కానుంది.  ప్రజలు ఎవరికి వారసత్వం కట్టబెడతారో వేచి చూడాలి.