Budi Muthyalanaidu will contest as YCP MP candidate of Anakapalli  :  అనకాపల్లి లోక్‌సభ స్థానానికి అభ్యర్థి పేరును వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలో నిలుతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే  175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్‌సీపీ.. అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్‌లో ఉంచింది. బీసీ అభ్యర్థికే ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. అభ్యర్థిని  తాజాగా ప్రకటించారు.  బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గం. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు సిట్టింగ్ స్థానంలోనే ఎమ్మెల్యే టిక్కెట్ ఖరారు చేశారు. అయితే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో  మాడుగుల స్థానానికి  ఎమ్మెల్యే అభ్యర్థిగా  ముత్యాలనాయుడు కుమార్తె ఈర్లి అనురాధను ఎంపిక చేశారు.  


సిట్టింగ్ ఎంపీకి  సీటు నిరాకరణ                                


అనకాపల్లి ఎంపీ స్థానికి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా గత ఎన్నికల్లో డాక్టర్‌ బీవీ సత్యవతి విజయం సాధించారు. ఇటు సామాజికంగా, అటు ఆర్థికంగా బలమైన ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పి.రమాకుమారి పేరును మొదట హైకమాండ్ పరిశీలించింది.  అయితే పొత్తులో భాగంగా అనకాపల్లి నుంచి బీజేపీ పోటీ చేస్తుందని కూటమి పార్టీలు ప్రకటించడంతో వైసీపీ అధి ష్ఠానం ఇక్కడ ఒక్కచోట మాత్రమే అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ అభ్యర్థిని బట్టి తమ అభ్యర్థిని నిర్ణయంచాలని అనుకున్నారు. తాజాగా బీజేపీ విడుదల చేసిన జాబితాలో సీఎం రమేశ్‌ పేరును ఖరారు చేశారు. 


సీఎం రమేష్ ను అభ్యర్థిగా  బీజేపీ ఖరారు చేయడంతో బూడి ముత్యాలనాయుడు వైపు వైసీపీ మొగ్గు        


దీంతో అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ఎంపీగా బరిలోకి దింపే ఆలో చనలో వైసీపీ పెద్దలు వున్నట్టు సమాచారం. వైసీపీ సీనియర్‌ నేత, ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుని ఎంపీగా పోటీ చేయించాలని చివరికి నిర్ణయించారు  మంత్రి కుమార్తె, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధను మాడుగుల ఎమ్మె ల్యే అభ్యర్థిగా పోటీకి అవకాసం ఇవ్వడంతో ఆయన అంగీకరించారు. అనకాపల్లి ఎంపీ స్థానంలో వెలమ వర్గానికి మంచి ఓటు బ్యాంక్ ఉంది. ఈ కారణంగా సీఎం రమేష్ కడపకు చెందిన నేత అయినా అనకాపల్లిలో  పోటీకి ఆసక్తి చూపించారు. కొప్పుల వెలమ వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడును రంగంలోకి దింపడంతో.. ఆసక్తికర పోరు సాగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


వేరే  వర్గానికి ఇస్తే గట్టి పోటీ ఉంటుందన్న అభిప్రాయం                                       


నిజానికి గవర లేదా కాపు వర్గానికి సీటు ఇస్తే.. .వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుందని భావించారు. అయితే అనూహ్యంగా కొప్పుల వెలమ అభ్యర్థినే నిలబెట్టాలని డిసైడ్ అయి.. ఉపముఖ్యమంత్రిని రంగంలోకి దించారు.