Telangana Congress Internal Politics:   తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన, వ్యూహాత్మక మార్పు కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం భారత్ రాష్ట్ర సమితి  విమర్శల బాణాలు ఎటువైపు వెళ్తున్నాయో గమనిస్తే ఒక స్పష్టమైన సంకేతం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో గానీ, రాష్ట్ర స్థాయిలో గానీ కాంగ్రెస్ పార్టీని ఒక వ్యవస్థగా పెద్దగా టార్గెట్ చేయడం లేదు. వారి ఏకైక లక్ష్యం, నిరంతర దాడి కేవలం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపైనే కేంద్రీకృతమై ఉంది. తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన వివాదంలో కూడా బీఆర్ఎస్ నేతలు, రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గాలు దీనిని  రేవంత్ కుట్రే  అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తుండటం ఈ వ్యూహానికి బలమైన నిదర్శనంగా నిలుస్తోంది.

Continues below advertisement

 వ్యవస్థతో కాదు.. రేవంత్‌తోనే వైరం 

బీఆర్ఎస్ అధినాయకత్వానికి కాంగ్రెస్ భావజాలంపై కంటే రేవంత్ రెడ్డి శైలిపైనే ఎక్కువ అభ్యంతరాలు, భయాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి, ముఖ్యమంత్రి అయ్యాక కూడా బీఆర్ఎస్‌ను రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తీయాలనే ఏకైక అజెండాతో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు, కేసీఆర్ కుటుంబంపై విచారణలు, ఫోన్ ట్యాపింగ్ కేసు వంటి అంశాలతో గులాబీ దళాన్ని రేవంత్ రక్షణలో పడేశారు. అందుకే బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే కేడర్‌లో పెద్దగా మైలేజ్ రాదని, రేవంత్ రెడ్డిని పర్సనల్‌గా బలహీనపరిస్తేనే తమకు మళ్లీ పూర్వవైభవం వస్తుందని బలంగా నమ్ముతోంది. తమకు రాజకీయంగా అడ్డుగా నిలిచిన ఏకైక  పిల్లర్‌ను కూల్చడమే వారి ప్రధాన లక్ష్యం.

Continues below advertisement

 మీనాక్షి నటరాజన్ వివాదం: రేవంత్‌కు ముడిపెట్టే వ్యూహం 

రాహుల్ గాంధీ కోటరీలో అత్యంత కీలకమైన, నిజాయితీ గల నాయకురాలిగా పేరున్న తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ సాంకేతిక కారణాల  వల్ల తిరస్కరణకు గురవడం కాంగ్రెస్‌లో పెద్ద కలకలం రేపింది. సీఎం రేవంత్ దీనిని 'బీజేపీ కుట్ర, సీట్ల చోరీ' అని ఢిల్లీ వేదికగా కొట్లాడుతుంటే, ప్రతిపక్షాలు , రేవంత్ అంతర్గత శత్రువులు మాత్రం దీని వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉందనే కోణాన్ని తెరపైకి తెస్తున్నారు. రాష్ట్రంలో తన పట్టుకు అడ్డుగా మారే అవకాశం ఉన్న ఢిల్లీ పెద్దలను, హైకమాండ్ ప్రతినిధులను రేవంత్ రెడ్డి కావాలనే ఇబ్బందుల్లో నెడుతున్నారనే ప్రచారాన్ని బీఆర్ఎస్ గట్టిగా సమాజంలోకి పంపుతోంది. ఈ స్నాగ్ ఇష్యూ ద్వారా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద నమ్మకద్రోహిగా నిలబెట్టాలనేది బీఆర్ఎస్ అసలు ప్లాన్.

 హైకమాండ్ వద్ద రేవంత్‌ను బలహీనపడిస్తే.. కాంగ్రెస్ కుప్పకూలుతుందా? 

బీఆర్ఎస్ ఆలోచనల వెనుక ఒక లోతైన రాజకీయ లెక్క ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ, ఆ పార్టీని నడిపించే 'ఇంజిన్' రేవంత్ రెడ్డే. ఆయన ఢిల్లీ హైకమాండ్ వద్ద బలహీనపడితే లేదా అధిష్ఠానం ఆయనపై నమ్మకం కోల్పోతే, తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న పాత అసమ్మతి నేతలు మళ్లీ తలలేపుతారు. తద్వారా కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో దానంతట అదే బలహీనపడుతుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.  రేవంత్ రెడ్డిని దెబ్బతీస్తే.. తెలంగాణలో కాంగ్రెస్ కోట కూలిపోతుంది అనే థియరీతోనే బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. అందుకే వారు జాతీయ కాంగ్రెస్‌ను కాకుండా, కేవలం రేవంత్ చుట్టూనే రాజకీయ చక్రవ్యూహాన్ని రచిస్తున్నారు.

 ఢిల్లీ-గల్లీ కనెక్షన్ కట్ చేసే ప్లాన్ 

రేవంత్ రెడ్డికి ఉన్న అతిపెద్ద బలం రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల వద్ద ఉన్న నమ్మకం. ఈ నమ్మకాన్ని చెడగొట్టడానికి బీఆర్ఎస్ నిరంతరం ప్రయత్నిస్తోంది. 'రేవంత్ రెడ్డి ఎప్పటికైనా కాంగ్రెస్‌కు ముప్పు', 'ఆయన తన సొంత ఎజెండాను అమలు చేస్తున్నారు', 'ఢిల్లీ పెద్దల నామినేషన్లు రద్దు కావడానికి ఆయనే కారణం' అనే నరేటివ్‌ను ఢిల్లీ స్థాయికి చేర్చడం ద్వారా రేవంత్ రెడ్డి పీఠాన్ని కదిలించవచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది. సీఎంను ఒంటరిని చేయడం ద్వారా, రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు వేయవచ్చని విపక్షం గట్టి వ్యూహాత్మక దాడి చేస్తోంది. ఎంత సక్సెస్ అవుతుందన్నది వేచి చూడాల్సిందే.