Harish Rao Counter To CM ReavnthReddy on Irrigation Porjects: లోక్ సభ ఎన్నికల ముందు అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌(Brs) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తొలి అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ప్రాజెక్ట్‌లు, జలాశయాలపైనే వాటర్ వార్ నడుస్తోంది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం జరిగిన నాటి నుంచి ప్రాజెక్ట్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి దారాదత్తం చేస్తోందని బీఆర్ఎస్‌ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారుకాగా, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కేసీఆర్, హరీష్ రావు అబద్దపు ప్రచారం చేస్తున్నారన్న సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ(Assembly) వేదికగానే ఈ అంశంపై తేల్చుకుందామంటూ  సీఎం సవాల్ విసిరగా అందుకు అంగీకరించారు.


అసెంబ్లీలోనే తేల్చుకందాం..


సాగునీటి ప్రాజెక్ట్‌లపై ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు (Harishrao)ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టడానికి అసెంబ్లీనే కరెక్ట్ ప్లేస్ అన్న హరీశ్‌.. అక్కడే తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. ప్రాజెక్ట్‌లకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలోనే అనుమతులు వచ్చాయన్నారు. కానీ రేవంత్ సర్కార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు. 2021లో కేంద్రం గెజిట్ ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చినా తాము ప్రాజెక్ట్‌లు అప్పగించలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే ప్రాజెక్ట్‌లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అమలు కానీ హామీలు ఇచ్చిందని, అవన్నీ నెరవేర్చిన తర్వాతే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడగాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ వేస్తమని చెప్పిన రేవంత్‌రెడ్డి ఎందుకు దీని గురించి మాట్లాడటం లేదని.. రుణమాఫీ సంగతేంటని ప్రశ్నించారు.


'సీఎంకు ఆ హక్కు లేదు'


'పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి అడిగే హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదు. టీడీపీలో ఉన్నప్పుడు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణకు అన్యాయం చేస్తూ రాయలసీమకు నీళ్లు తీసుకెళ్తుంటే అసెంబ్లీని స్తంభింపచేసి పోరాడింది మా పార్టీ. మంత్రులుగా నేను, నాయిని నర్సింహారెడ్డి పదవులకు రాజీనామా చేసి నిరసన తెలియజేశాం. కేఆర్ఎంబీ ప్రాజెక్టులు అప్పగించేందుకు మేం అంగీకరించలేదు. రేవంత్ సర్కార్ పై కేంద్రం ఒత్తిడి తెచ్చింది. దీంతో వాళ్లే అంగీకరించారు. దీనిపై ఎలాంటి చర్చకైనా సిద్ధం.' అంటూ హరీష్ రావు స్పష్టం చేశారు.


'బీఆర్‌ఎస్సే ప్రాజెక్ట్‌లు అప్పగించింది'


అయితే, అంతకు ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి( Revanth Reddy).... కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయాలని విభజన చట్టంలోనే ఉందన్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం తనను అడిగే ప్రతి విషయం విభజన చట్టంలో పొందుపరిచిందని కేసీఆర్(Kcr) పదేపదే చెప్పేవారని రేవంత్ గుర్తు చేశారు. అప్పుడు ప్రాజెక్ట్‌ల అప్పగింతపై ఎందుకు అడ్డు చెప్పలేదన్నారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి ఇస్తున్నట్లు 2022లోనే సంతకాలు చేశారన్నారు. అప్పుడు హరీశ్‌రావే నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పుడేమో కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగిస్తోందని అబద్ధాలు చెబుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ క్రమంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానుండగా.. మరింత హీట్ ఎక్కించే అవకాశం ఉంది. కాంగ్రెస్ వందరోజుల హామీలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటుండగా.. ప్రాజెక్ట్‌ల్లో అవినీతి, అక్రమాలపై బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు అధికార పక్షం సిద్ధంగా ఉంది.