Bhogapuram Airport Inauguration News : ఉత్తరాంధ్ర అభివృద్ధి మణిహారంగా భావించే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.  నేనే చేశాను.. ఇది నా విజయం  అని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించగా,  ప్రాజెక్టును ఆలస్యం చేసి నిలిపివేసింది జగనే.. చంద్రబాబు దూరదృష్టితోనే ఇది సాకారమైంది అని తెలుగుదేశం, కూటమి నేతలు ఎదురుదాడికి దిగారు. అయితే, ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయం ప్రతిపాదన నుంచి నేటి ప్రారంభం వరకు ఏ ప్రభుత్వ హయాంలో ఎలాంటి పరిణామాలు జరిగాయో పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తాయి.

Continues below advertisement

భోగాపురం ఎయిర్ పోర్టు ఆలోచన చేసిన చంద్రబాబు ప్రభుత్వం

విభజన అనంతరం 2014లో కొత్త ఆంధ్రప్రదేశ్‌కు విశాఖ కేంద్రంగా అంతర్జాతీయ కనెక్టివిటీ సాధించడమే లక్ష్యంగా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని నిర్ణయించింది. మొదట 5,300 ఎకరాలకు పైగా భూసేకరణ చేయాలని తలపెట్టినప్పటికీ, స్థానిక రైతుల నిరసనలు, అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ వ్యతిరేకత కారణంగా భూసేకరణ విస్తీర్ణాన్ని సుమారు 2,700 ఎకరాలకు తగ్గించారు. 2015లో ఏఏఐ  నుంచి సాంకేతిక అనుమతులు పొందడం, జీఎంఆర్ గ్రూప్‌ను బిడ్డింగ్ ద్వారా ఎంపిక చేయడం పూర్తి చేసిన టీడీపీ ప్రభుత్వం, 2019 ఎన్నికలకు సరిగ్గా ముందు ఫిబ్రవరి 14న శంకుస్థాపన చేసింది.

Continues below advertisement

ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేసిన చంద్రబాబు

2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. అంతకుముందు టీడీపీ ఖరారు చేసిన బిడ్డింగ్‌ను రద్దు చేసి, 2,200 ఎకరాల భూమిని మాత్రమే ఎయిర్‌పోర్టుకు పరిమితం చేస్తూ, మిగిలిన భూములను భవిష్యత్ అవసరాల కోసం కేటాయించారు. భూసేకరణ, పరిహారం, పునరావాసం   ప్రక్రియల కోసం సుమారు రూ.1,200 కోట్లు వెచ్చించినట్లు వైఎస్సార్‌సీపీ చెబుతోంది. 2020 జూన్‌లో జీఎంఆర్ గ్రూప్‌తో సవరించిన ఒప్పందం కుదుర్చుకోవడం, పర్యావరణ-రక్షణ అనుమతులు, ఫైనాన్షియల్ క్లోజర్ సాధించి 2023 మే నెలలో జగన్ మోహన్ రెడ్డి స్వయంగా మళ్లీ శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ముమ్మరం చేశారు.

2024 ఎన్నికలకు ఆరు నెలల ముందు పనులు ప్రారంభం 

అయితే, 2024 మే నెలలో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టు వేగం పుంజుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడులు భోగాపురం పనులపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ డెడ్‌లైన్లను ఖరారు చేశారు. విమానాశ్రయానికి అనుసంధానంగా విశాఖ నుంచి 6-లేన్ యాక్సెస్ రోడ్డు, విద్యుత్, నీటి సరఫరా అవరోధాలను వేగంగా తొలగించారు. నావిగేషనల్ ట్రయల్స్, డీజీసీఏ  నుంచి ఏరోడ్రోమ్ లైసెన్స్, సెక్యూరిటీ క్లియరెన్సెస్ సాధించి ప్రాజెక్టును రికార్డు స్థాయిలో పూర్తి చేశారు.

ఎక్కువ క్రెడిట్ టీడీపీకే ! 

భోగాపురం విమానాశ్రయ నిర్మాణంలో 'విజన్' చంద్రబాబుది అయితే, 'ఫౌండేషన్-ఎగ్జిక్యూషన్' జగన్‌ది అని, అంతిమంగా  వేగవంతమైన పూర్తి  కూటమి ప్రభుత్వానిదని  భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి, ఆ తర్వాత భూసేకరణ పూర్తి చేసి నిధులు ఇచ్చిన జగన్ క్రెడిట్ తనదేనని అంటుంటే; ప్రతిపాదన తెచ్చి, ఒప్పందాలు కుదిర్చి, ఇప్పుడు ప్రారంభం వరకు తీసుకొచ్చిన ఘనత తమదేనని టీడీపీ స్పష్టం చేస్తోంది. ఎవరి రాజకీయం ఎలా ఉన్నా, దశాబ్దాల కల నెరవేరుతూ ఉత్తరాంధ్రకు పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో సరికొత్త రవాణా విప్లవం రాబోతుండటం ఇక్కడి ప్రజలకు నిజమైన శుభవార్త.