తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలే తప్ప చేతల్లో చూపించని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు నిధులు ప్రకటించడంపై విమర్శలు గుప్పించారు. ఏ సభకు వెళ్లినా కోట్లు కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించడమే కానీ తరవాత ఇచ్చేది లేదన్నారు. హుజూర్ నగర్, సాగర్, దుబ్బాక, హుజూరాబాద్ సహా జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు అలాగే చెప్పారు కానీ పైసా ఇవ్వలేదన్నారు. కేంద్ర పథకాల నిధులను కూడా మళ్లించుకుంటూ సిగ్గు లేకుండా అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.గత 8 ఏళ్లుగా గ్రామ పంచాయతీలకు కేంద్రం నుండి వచ్చే నిధులు తప్ప కేసీఆర్ ఇచ్చిందేమీ లేదన్నారు. స్థానిక సంస్థలన్నింటినీ కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. 


దేశంలోనే నెంబర్ వన్ అవినీతి పరుడు కేసీఆర్ అని  కేసీఆర్ కుటుంబ ఆస్తులు చూస్తే ఎవరికైనా అర్థమవుతుందని బండి సంజయ్ విశ్లేషించారు.  ఇప్పుడు " కేసీఆర్ కు ఓ ఫాం  హౌజ్, బిడ్డకు ఓ ఫాంహౌజ్, అల్లుడుకు ఓ  ఫాంహౌజ్ లున్నయ్... ఇగ కొడుకుకైతే రెండు మూడు ఫాంహౌజ్ లు, ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లున్నయట.  దుబాయ్ లో, సింగపూర్ లో, అమెరికా, లండన్ కు పోయి దోచుకున్నదంతా దాచుకుంటున్నరట.." అని విమర్శించారు.  కేసీఆర్ కుటుంబం అక్రమాలపై త్వరలో దర్యాప్తు జరుగుతుందని అది తెలిసే ఏం మాట్లాడుతున్నారో తెలియక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎలాగూ అరెస్ట్ అవుతారని తెలిసి ముందే లొల్లి చేస్తే ఓ పనైపోతదని తెలిసి పర్యటనలకు వెళ్తున్నారని విమర్శించారు. 


గతంలో చంద్రబాబు ఇంతే చేశారని.. చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.  మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, బెంగాల్ ఫ్రజలందరికీ కేసీఆర్‌ను నమ్మవద్దని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో 1400 మంది చనిపోతే అందులో సగం మందిని కూడా గుర్తించి సాయం చేయలేదని విమర్శించారు. బంగారు తెలంగాణ సాధించేమని చెప్పుకుంటున్నారని ఆత్మహత్యల తెలంగాణ ... దోపిడీ దొంగల తెలంగాణ అయ్యింద్నారు.   కులాల మధ్య, ప్రాంతాల, మతాల మద్య చిచ్చు పెట్టడమే కేసీఆర్ పని. ఏదీ దొరకకపోతే ఉత్తర, దక్షిణ భారత దేశాలుగా విభజించి మాట్లాడతారని మండిపడ్డారు.  తుక్డే గ్యాంగ్ ప్రకాష్ రాజ్ తో కలిసిన కేసీఆర్‌లో హిందూ వ్యతిరేక భావ జాలం ఎంత ఉందో అర్థం చేసుకోవాలన్న ారు. బీజేపీ హిందువుల పార్టీ అని, మోదీ, యోగి లేకపోతే హిందువులను కాపాడేవాళ్ళెవరు లేరని జీహాదీలు అంటున్నారు.. హిందువులంతా ఒక్కసారి ఆలోచించాలన్నారు.మోదీ, యోగి లేని దేశం ఎట్లుంటది? మన పరిస్థితి ఎట్లుంటదో హిందువులంతా, తెలంగాణ సమాజమంతా ఆలోచించాలని కోరారు. 


తెలంగాణలో సాధించిందేమీ లేదు దేశ రాజకీయాల్లోకి వెళ్లి చేసేదేముందని బండి సంజయ్ ప్రశ్నించారు.  కేసీఆర్ కు మేడారం అభివృద్ధి కి చేసిందేమీ లేదు. మొఖం చెల్లాకే మేడారం వెళ్ళలేదు. చివరకు గవర్నర్ వెళ్తే కూడా అధికారులు, మంత్రులెవరూ ఆమెను కలవొద్దని అనధికార ఆదేశాలిచ్చిన సంస్కారం లేని వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు.  తెలంగాణాకు అన్యాయం జరిగితే 7 ఏండ్లుగా ఎందుకు అడగలేదు? ప్రధానిని కలిసినప్పుడు ఎందుకు అడగలేదుని బండి సంజయ్ ప్రశ్నించారు.    తెలంగాణలో బీజేపీ చేస్తున్న ఉద్యమాలకు భయపడి కేసీఆర్ ఇఫ్పుడు ఫాంహౌజ్ నుండి బయటకొస్తున్నారన్నారు.