Telangana municipal elections considered a referendum:  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వెంటనే రాష్ట్ర రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాల్‌లతో వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌ గా అభివర్ణించగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏకంగా కాంగ్రెస్ పాలనపై రెఫరెండం గా స్వీకరిద్దామని సవాల్ విసిరారు. మరోవైపు, పట్టణ ఓటర్లపై గట్టి నమ్మకంతో ఉన్న బీజేపీ.. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది.  

Continues below advertisement

కాంగ్రెస్ పార్టీ: అధికార బలమే ప్లస్.. వ్యతిరేకతే మైనస్ 

ప్రస్తుతం అధికారంలో ఉండటం కాంగ్రెస్‌కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, పెంచిన పెన్షన్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు పట్టణ ప్రాంత పేదలను ఆకట్టుకుంటాయని పార్టీ భావిస్తోంది. మంత్రి పొంగులేటి రెఫరెండం సవాల్ విసిరారంటే, ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని వారు గట్టిగా నమ్ముతున్నారు. అయితే, రైతు భరోసా పంపిణీలో జాప్యం, పట్టణాల్లో అభివృద్ధి పనులపై వస్తున్న విమర్శలు  పట్టణ మధ్యతరగతి ఓటర్లలో కొంత వ్యతిరేకతను పెంచే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ ఓడిపోతే, అది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనంగా మారుతుంది.

Continues below advertisement

బీఆర్ఎస్ పార్టీ: ఉనికి కోసమే పోరాటం 

కేటీఆర్ ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా పేర్కొనడం వెనుక వ్యూహం ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓటములతో డీలా పడ్డ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలంటే ఈ విజయం వారికి అనివార్యం. కేసీఆర్ హయాంలో జరిగిన పట్టణాభివృద్ధి, ఐటీ పురోగతి తమకు ప్లస్ అవుతాయని గులాబీ దళం ఆశిస్తోంది. అయితే, పార్టీ నుంచి కీలక నేతలు వలస వెళ్లడం, హైకమాండ్ లోపల కుటుంబ విబేధాలు బహిర్గతం కావడం  ఈ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్లు. ఈ ఎన్నికల్లో కూడా వెనుకబడితే, పార్టీ భవిష్యత్తు మరింత ఇరకాటంలో పడుతుంది.

బీజేపీ: పట్టణ ఓటు బ్యాంకే కొండంత అండ

తెలంగాణలో బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో సహజంగానే బలమైన ఓటు బ్యాంకు ఉంది. ప్రధాన నగరాల్లో హిందూత్వ కార్డు , కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆ పార్టీకి ప్లస్ పాయింట్లు. మున్సిపాలిటీల్లో తమదే మెజార్టీ అని బండి సంజయ్, కిషన్ రెడ్డి ధీమాగా ఉండటానికి కారణం ఇదే. అయితే, రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకత్వం లేకపోవడం,  జనసేన వంటి మిత్రపక్షం ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోవడం బీజేపీకి మైనస్ కావచ్చు.

ఎవరికి ఉత్సాహం.. ఎవరికి నీరసం?

ఈ ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తే రేవంత్ రెడ్డి నాయకత్వానికి తిరుగులేదని తేలిపోతుంది. ఒకవేళ బీఆర్ఎస్ పుంజుకుంటే, కేసీఆర్ మార్క్ రాజకీయం ఇంకా ఉనికిలో ఉందని అర్థమవుతుంది. బీజేపీ గెలిస్తే, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తామే ప్రత్యామ్నాయమని ఢిల్లీకి సంకేతం పంపినట్లవుతుంది. ఫలితాలు తారుమారైతే, ఓడిన పార్టీల నుంచి వలసలు మరింత పెరిగి, ఆయా పార్టీల్లో తీవ్ర నీరసం ఆవరించే ప్రమాదం ఉంది. మున్సిపల్ ఎన్నికలు కేవలం కౌన్సిలర్లను ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు.. తెలంగాణలో రాబోయే రాజకీయ దిశను నిర్దేశించే అతిపెద్ద  పోలింగ్ రెఫరెండం గా మారబోతున్నాయి.