VIjay CID :  తెలుగుదేశం పార్టీ యువత నేత, ఐటీడీపీ సోషల్ మీడియా విభాగానికి ఇంచార్జ్ గా ఉన్న అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఇంటికి ఏపీసీఐడీ  పోలీసులు రావడం రాజకీయ దుమారానికి కారణంగా అయింది. హైదరాబాద్‌లోని ఓ అపార్టుమెంట్‌లో విజయ్ కుటుంబం నివసిస్తోంది. ఏపీసీఐడీ అధికారుల బృందం ఉదయం వారింటికి వెళ్లింది. ఆ సమయంలో చింతకాయల విజయ్ ఇంట్లో లేరు. పనిమనిషులతో పాటు చిన్న పిల్లలు ఉన్నారు. అయితే వారినే సీఐడీ అధికారులు ప్రశ్నించారని.. ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారని ఆరోపణలు వస్తున్నాయి. చింతకాయల విజయ్ పిల్లలను ప్రశ్నించి వారి ఫోటోలు తీసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చుట్టుపక్కల ఫ్లాట్ల వారు కూడా వచ్చి సీఐడీ అధికారులను ప్రశ్నించడంతో వారు వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.


బెదిరింపులకు  లొంగేది లేదన్న అయ్యన్నపాత్రుడు 


ఈ అంశంపై అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఎందుకు వచ్చారో.. ఏ కేసు విషయంలో వచ్చారో కూడా స్పష్టత లేకపోవడంతో టీడీపీ నేతలు మండిపడ్డారు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు దొంగల్లా వ్యవహరిస్తున్నారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా వస్తారని ప్రశ్నించారు. బెదిరిస్తే వెనక్కి తగ్గే వాళ్లం కాదని పార్టీ కోసం ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు. సీఐడీ పోలీసులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని.. పిల్లలను ప్రశ్నించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దోపిడీని ప్రశ్నిస్తే సీఐడీ పేరుతో బెదిరిస్తారా అని అయ్యన్న ప్రశ్నించారు. సీఎం ఇంట్లో మహిళలు, చిన్నపిల్లలు ఉండరా అన్నారు. 


సీఐడీ తీరును ఖండించిన చంద్రబాబు


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఈ అంశంపై స్పందించారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి తనయుడు, టిడిపి యువనేత చింతకాయల విజయ్ ఇంట్లోకి దోపీడీ దొంగల్లా పోలీసులు చొరబడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. విజయ్ ఇంట్లో చిన్న పిల్లలను, పని వాళ్లను భయభ్రాంతులను చేసేలా సిఐడి పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు.



ఆరో తేదీన హాజరు కావాలని నోటీసులు ఇచ్చేందుకు వెళ్లామన్న సీఐడీ 


అయితే సీఐడీ పోలీసులు ఎలాంటి అలజడి సృష్టించలేదని..  ఓ కేసులో నోటీసులు ఇవ్వడానికి వెళ్లారని సీఐడీ పోలీసులు చెబుతున్నారు.  విజయ్‌ ఇంట్లో లేకపోవడంతో నోటీసులు ఇచామని.. ఈనెల 6న హాజరుకావాలంటూ 41 సీఆర్పీసీ కింద నోటీసుల్లో పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. అయితే చింతకాయల విజయ్‌పై నమోదైన కేసు ఏమిటో స్పష్టత లేదు.గతంలో ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో హైకోర్టు స్టే ఇచ్చింది. మరో కేసు నమోదయిందో లేదో సీఐడీ స్పష్టత ఇవ్వలేదు.