Andhra Pradesh And Telangana : తెలుగు రాష్ట్రాలు విభజన జరిగి పదేళ్లు దాటినా ఇప్పటికీ ఉమ్మడి సమస్యలు పరిష్కారం కాలేదు. గతంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడం... ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా చొరవ  చూపకపోవడం వల్ల దశాబ్దకాలంగా సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే వీటికి ఎక్కడో ఒకచోట ముగింపు పలకాలన్న ఉద్దేశంతో ఏపీ(Andhra Pradesh సీఎం చంద్రబాబు(Chandra Babu) ఒక అడుగు ముందుకేసీ తెలంగాణ(Telangana) సీఎం రేవంత్‌రె‌డ్డి(Revanth Reddy)కి లేఖ రాయడం...ఆయన వెంటనే అంగీకరించడంతో ఈ సమస్యలకు ఇప్పటికైనా పరిష్కారం లభిస్తుందేమో చూద్దాం...

 

రేవంత్‌తో చంద్రబాబు భేటీ

ఈనెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకు ముందు చాలాసార్లు ఇరువురు సీఎంలు భేటీ అయినా...ఇప్పుడు మాత్రం గురుశిష్యులు ప్రచారంలో ఉండి వీళ్లిద్దరు తొలిసారి సీఎంల హోదాలో కలవనుండటంతో తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విభజన సమస్యలు పరిష్కారం కోసం చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు(Chandra Babu) చొరవ చూపి ముందుగా లేఖ రాయగా....తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సానుకూలంగా స్పందించారు. ఈ భేటీలో చర్చించాల్సిన అంశాలపై నివేదిక సిద్ధం చేయాల్సిందిగా ఇప్పటికే అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించారు. విభజన జరిగిన వెంటనే ఏర్పడిన అప్పటి టీఆర్ఎస్‌(TRS), టీడీపీ(TDP) ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల తొలి ఐదేళ్లు విభజన సమస్యలపై దృష్టిసారించలేదు. రెండు పిల్లుల కొట్టాట కోతికి ఉపయోగపడినట్లు...తెలుగురాష్ట్రాలు కొట్టుకోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సైతం ఆగిపోయాయి. మళ్లీ ఇప్పుడు ఇరువురు సీఎంలు దీనిపై చర్చిస్తుండటంతో శుభపరిణామం.

 

ఉమ్మడి రాజధాని చిక్కుముడి కూడా వీడిపోవడంతో షెడ్యూల్ 9, 10లోని సంస్థల పంపకంపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కేంద్రం కూడా సానుకూలంగా ఉంది. ఉమ్మడి సంస్ఠలకు చెందిన ఆస్తుల పంపకం, ఉద్యోగుల విభజన తదితర సమస్యలకు ఈ భేటీలోనే పరిష్కారం లభించే అవకాశం ఉంది. రేవంత్‌రెడ్డి సీఎం అయిన వెంటనే ఢిల్లీ(Delhi)లోని ఏపీభవన్‌(Ap Bhavan) సమస్యను ఇట్టే పరిష్కరించారు. దీంతో మిగిలిన సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. ఉమ్మడి హెచ్‌ఆర్సీ(HRC)లో ఉద్యోగుల విభజనకు సంబంధించి గడవు పూర్తయినందున త్వరితగతిని ఈ విషయం తేల్చాల్స ఉంది. తెలంగాణ కమిషన్‌లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు తమ స్వలాభం కోసం ఈ ప్రక్రియ ముందుకు సాగకుండా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పని వెంటనే చేపట్టాలని ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు కోరుతున్నారు.

గతంలోనూ చర్చలు
విభజన సమస్యలపై గతంలోనూ ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య పలు దఫాలుగా చర్చలు సాగినా...పీటముడి వీడలేదు. అప్పట్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌(KCR)తోనూ చంద్రబాబు(Chandra Babu) చర్చించారు. ఆ తర్వాత జగన్(Jagan) సైతం కేసీఆర్‌తో పలుమార్లు భేటీ అయ్యారు. అయినప్పటికీ కీలకమైన 9, 10 షెడ్యూల్‌లోని సమస్యలకు పరిష్కారం లభించలేదు. జగన్, కేసీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ...వాటిని రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. జగన్ ఎప్పుడు కేసీఆర్‌తో భేటీ అయినా...విభజన సమస్యలపై పరిష్కారం కోసమేనంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేవారు. కానీ ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. ఇప్పుడు గురుశిష్యులే ఇరు రాష్ట్రాలకు సీఎంలుగా ఉండటంతో తప్పకుండా పరిష్కారం లభిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.