చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ బీజేపీ స్టాండ్‌ ఏంటి..? అన్నది ఇప్పటి వరకు స్పష్టంగా బయటకు రాలేదు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు అరెస్టును ఖండించానా... ఆతర్వాత  పెద్దగా రియాక్ట్‌ అవ్వలేదు. దీంతో చంద్రబాబు అరెస్టుపై బీజేపీ స్టాండ్‌ ఏంటి..? అరెస్టును ఖండిస్తున్నారా..? లేదా సమర్థిస్తున్నారా? అన్నది ప్రజల్లోకి వెళ్లలేదు. మరోవైపు..  జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఇప్పటికే పొత్తులపై తన అభిప్రాయం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీచేస్తామని... బీజేపీ కూడా కలిసిరావాలని కోరారు.  దీనిపై కూడా ఏపీ బీజేపీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. దీంతో ప్రజల్లో బీజేపీ వైఖరి పట్ల గందరగోళం నెలకొంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏదో ఒక నిర్ణయం  తీసుకోవాలని... ఒక స్టాండ్‌తో ప్రజల్లో గట్టిగా వాయిస్‌ వినిపించాలని భావిస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. ఈ క్రమంలో... నిన్న (మంగళవారం) జరిగిన రాష్ట్ర బీజేపీ కోర్‌ కమిటీ  సమావేశంలో కీలక అంశాలపై చర్చించి... ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు.


చంద్రబాబు అరెస్టులో బీజేపీ హస్తం ఉందన్న వార్తలు కూడా వచ్చాయి. టీడీపీ నేతలు బహిరంగానే.. ఇందులో కేంద్రం హస్తం ఉందా అని ప్రశ్నించారు. దీనికి ఏపీ బీజేపీ  నేతలు గట్టి కౌంటర్‌ ఇవ్వలేకపోతున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు బీజేపీ కోర్‌ కమిటీ సమావేశంలో విస్తృతంగా చర్చలు జరిపారు. చంద్రబాబు అరెస్ట్‌, ఆ  తర్వాత జరిగిన పరిణాలపై చర్చించారు. చంద్రబాబు అరెస్ట్‌ వెనుక బీజేపీ హస్తం ఉందన్న ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని నిర్ణయించారు. అయితే.. వైఎస్‌ఆర్‌టీపీ  అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ అరెస్ట్‌ అయినప్పుడు స్వయంగా ప్రధాని మోడీ ఖండించారని... చంద్రబాబు అరెస్ట్‌ సమయంలోనూ అలాగే స్పందించి ఉంటే బాగుండేదని  సమావేశంలో పాల్గొన్న కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. అయితే షర్మిలది ప్రజాఉద్యమం కనుక ప్రధాని స్పందించారని, చంద్రబాబు విషయంలో అది సరిగాదని సీనియర్‌  తెలిపారు. చంద్రబాబు అవినీతి కేసులో అరెస్ట్‌ కావడంతో... కేసు కోర్టు పరిధిలో ఉండటంతో ప్రధాని స్పందించడం సరికాదన్నారు. అయితే... చంద్రబాబు అరెస్ట్‌లో బీజేపీ హస్తం  ఉందన్న వాదనను మాత్రం తీవ్రంగా తిట్టికొట్టాలని ఏపీ బీజేపీ నేతలు ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు.


జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ పొత్తుల ప్రకటనపై కూడా బీజేపీ కోర్‌ కమిటీలో చర్చించారు. బీజేపీ పొత్తులో ఉన్న పవన్‌ కల్యాణ్ ఏకపక్ష నిర్ణయాలు ఎలా చేస్తారని  కొందరు బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమతో సంప్రదింపులు జరపకుండా... టీడీపీతో కలిసి వెళ్తామని, బీజేపీ కూడా కలిసి రావాలని పవన్‌ చంద్రబాబు అరెస్ట్‌, పవన్‌ పొత్తు ప్రకటనపై ఏపీ బీజేపీ స్టాండ్‌ ఏంటి- కోర్‌ కమిటీలో కీలక నిర్ణయం ప్రకటించడం సరికాదని అభిప్రాయపడ్డారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనతో పొత్తు కొనసాగించాలా? లేదా? అన్న అంశం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు కొందరు బీజేపీ  నేతలు. ఈ విషయంలో సంయమనం పాటించాలని సీనియర్‌ నేతలు సూచించారు. ఎన్డీయేతో కలిసే ఉంటామని పవన్‌ కల్యాణ్ ప్రకటించడంతో... జనసేనతో పొత్తు విషయాన్ని  జాతీయ నాయకత్వానికి వదిలేయని ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ అని.. జాతీయ నాయకత్వం సూచనల మేరకే నడుచుకోవాలని ఏపీ బీజేపీ  కోర్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. 


ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఈ విషయాన్నే స్పష్టం చేశారు. పొత్తులపై పవన్‌ కల్యాణ్ మాట్లాడే ప్రతి కామెంట్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరంలేదన్నారామె. పొత్తులపై పవన్‌ అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని... జాతీయ నేతలతో చర్చించిన తర్వాత నిర్ణయం చెప్తామన్నారు. జాతీయ పార్టీ సూచనల మేరకు వ్యవహరిస్తామని  తెలిపారు. ఇక, ఈనెల 9న జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్య నేతల సమక్షంలో జరుగుతుందని చెప్పారు పురంధేశ్వరం. ఆ సమావేశంలో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చిస్తామన్నారు. ఏపీలో పంచాయతీ నిధులు దారిమళ్లింపు, నాసిరకం మద్యం అమ్మకాలు వంటి అంశాలపై పోరాడేందుకు భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు.