North Andhra Ysrcp Politics :   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో మార్పు చేర్పులపై సీరియస్‌గా దృష్టి పెట్టి కసరత్తు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ పరాజయం తర్వాత అక్కడ పరిస్థితుల్ని మార్చాలని జగన్ అనుకుంటున్నారు. ముఖ్యంగా మంత్రులందర్నీ మార్చేయాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సీఎం క్యాంప్ ఆఫీసుకు అత్యవసరంగా మంత్రి సీదిరి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని సీతారాంను పిలిపించి చర్చలు జరిపారు. అలాగే ధర్మాన ప్రసాదరావుతోనూ తాజా పరిణామాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కొత్త సమీకరణాలను సీఎం జగన్ వర్కవుట్ చేసినట్లుగా చెబుతున్నారు. 


తమ్మినేని సీతారాం మంత్రి కాబోతున్నారా?


స్పీకర్ గా ఉంటూ తమ్మినేని సీతారాం చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సహజంగా స్పీకర్ గా ఉండేవారు సొంత పార్టీతో సంబంధాలు లేనట్లుగా ఉంటారు.కానీ తమ్మినేని సీతారాం అలాంటి మొహమాటాలేం పెట్టుకోలేదు. నేరుగా తాను వైసీపీ సభ్యుడినేనని చెబుతున్నారు. విపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. స్పీకర్‌గా విధులు నిర్వహించేటప్పుడు కూడా అధికార పార్టీని మా పార్టీ.. ఇతరుల్ని విపక్షాలు అనే అంటున్నారు. దీనిపై టీడీపీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదు. మంత్రిగా అయితే ఇలాంటి దూకుడు మరింతగా చూపిస్తారని.. ప్రస్తుతం ఇదే కావాలని సీఎం జగన్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తమ్మినేని సీతారాంకు మరోసారి మంత్రిగా బాధ్యతలు  చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలోనే చాన్స్ వస్తుందని అనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు జగన్ పిలిచి అవకాశం ఇస్తానంటే ఆయన కాదనే అవకాశాలే లేవంటున్నారు. 


తమ్మినేని మంత్రి అయితే  మరి స్పీకర్ ఎవరు ?


ఉమ్మడి సిక్కోలు నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు. వారిలో ఒకరు సీదిరి అప్పలరాజు. మరొకరు ధర్మాన ప్రసాదరావు. అంతకు ముందు ధర్మాన కృష్ణదాసు మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు స్పీకర్ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారన్నది కూడా వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ పదవిని ఒకటి, రెండు సార్లు గెలిచిన వారికి ఇవ్వలేరు. సీనియర్ కావాలి.  అందులోనూ మంచి విషయ పరిజ్ఞానం, సభా వ్యవహారాలపై పట్టు ఉన్న వారికి ఇవ్వాలి. అలాంటి నేతలు కొంత మంది ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి పార్థసారధి వంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సమీకరణాల రీత్యా ఈ సారి కూడా శ్రీకాకుళం జిల్లాకే స్పీకర్ పదవి వస్తుందంటున్నారు. ధర్మాన ప్రసాదరావును మంత్రి పదవి నుంచి తప్పించి స్పీకర్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ధర్మానకు ఏడాది కిందటే మంత్రి పదవి ఇచ్చారు.  మరి ఆయన అంగీకరిస్తారా లేదా అన్నది కూడా కీలకమే. జగన్ ఆదేశిస్తే తప్పనిసరిగా అంగీకరించాల్సిందే. 


మంత్రి బొత్స కూ ఉద్వాసన తప్పదా ?


మంత్రి బొత్స సత్యనారాయణ తీరుపైనా సీఎం  జగన్ అసంతృప్తిగా ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స అనుకున్నట్లుగా కష్టపడలేదని సీఎం జగన్ భావిస్తున్నారంటున్నారు.  అయితే బొత్స లాంటి సీనియర్ మంత్రిని తప్పించే అవకాశం ఉండదని మరికొందరు భావిస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి సీఎం జగన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటారని ద్వితీయ శ్రేణి నేతలు అంచనా వేస్తున్నారు. 


కేబినెట్‌లో సమూల మార్పులు ఉంటాయా ?


కారణం ఏదైనా కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించిన తర్వాత మంత్రుల్లో దూకుడు తగ్గిపోయింది. దూకుడుగా ఉన్న నేతలకు ఉద్వాసన చెప్పడం.. కొత్తగా మంత్రి అయిన  పార్టీ ఆదేశాలు వస్తే తప్ప నోరు తెరిచే పరిస్థితి లేకపోవడమే దీనికి కారణం. అందుకే మళ్లీ సీఎం జగన్ పాత కేబినెట్‌లో దూకుడుగా ఉన్న మంత్రులను మళ్లీ తీసుకోవాలనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా మూడో తేదీన ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.