Jagan Cadre Fear In Local Elections:  ఆంధ్రప్రదేశ్ లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు  అత్యంత ఆసక్తికరంగా మారాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశాల్లో పార్టీ కేడర్‌కు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు అత్యంత స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.  ఎక్కడా ఏకగ్రీవాలకు   తావివ్వకూడదు, ప్రతి స్థానంలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విధిగా బరిలో నిలబడి గట్టి పోటీ ఇవ్వాలి  అని ఆదేశించారు. అయితే, 2021 స్థానిక ఎన్నికల్లో   వేలాది పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకుని రికార్డు సృష్టించిన  వైఎస్సార్‌సీపీ.. ఇవాళ ఏకగ్రీవాలు వద్దే వద్దు, పోటీ పడాల్సిందే అని పట్టుబట్టడం వెనుక కీలక రాజకీయ వ్యూహం ఉంది. 

Continues below advertisement

ఇప్పుడు వైసీపీకి ఏకగ్రీవాలు అవ్వవా? 

గతంలో తమకు కలిసివచ్చిన  ఏకగ్రీవ  సూత్రాన్ని జగన్ ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకించడం వెనుక ప్రధానంగా కేడర్ నైతిక స్థైర్యం  దెబ్బతిందనే ఆందోళన కనిపిస్తోంది. 2024 శాసనసభ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమై దారుణ ఓటమిని చవిచూసిన తర్వాత, క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి హవా నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో పంచాయతీ లేదా మండల స్థాయిల్లో ఎన్నికలు వస్తే, అధికార పక్షం బెదిరింపులకో లేక ప్రలోభాలకో లొంగిపోయి వైఎస్సార్‌సీపీ నాయకులు నామినేషన్లు కూడా వేయకుండా వెనక్కి తగ్గుతారని  జగన్ బలంగా సందేహిస్తున్నారు. బరిలోనే నిలబడకుండా ఏకగ్రీవాలకు సహకరిస్తే, అది పార్టీ క్షేత్రస్థాయి వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుందనేది ఆయన భయం.

Continues below advertisement

ద్వితీయ శ్రేణి నాయకత్వం పోరాడేలా చేసే ప్లాన్

పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున కూటమి వైపు లేదా అధికార టీడీపీ వైపు వలస వెళ్తారనే ఆందోళన. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకపోతే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులు తమ వ్యాపారాలు, కాంట్రాక్టులు, లేదా స్థానిక ఉనికిని కాపాడుకోవడానికి అధికార పార్టీతో లోపాయికారీ ఒప్పందాలు  కుదుర్చుకునే ప్రమాదం ఉంది. ఒకసారి స్థానిక నేతలు టీడీపీతో కరచాలనం చేస్తే, వారితో పాటు కింద ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంకు కూడా చేజారిపోతుంది. ఈ రకమైన గ్రౌండ్ లెవెల్ మెల్ట్‌డౌన్  నిరోధించాలంటే.. వారిని బలవంతంగానైనా పోలింగ్ బరిలో నిలబెట్టి, పార్టీ రంగు పులుముకునేలా చేయడం తప్ప జగన్‌కు వేరే మార్గం కనిపించడం లేదు.

క్యాడర్‌ను యాక్టివ్ చేసే అవకాశం 

అంతేకాకుండా, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గనుక వైఎస్సార్‌సీపీ పోటీకి దూరంగా ఉండి లేదా నామమాత్రపు ప్రదర్శన ఇస్తే, దాని ప్రభావం రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి కోలుకోలేని దెబ్బగా మారుతుందని జగన్  మోహన్ రెడ్డి భావిస్తున్నారు. సాధారణంగా లోకల్ బాడీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు, అక్కడ నిలబడే అభ్యర్థుల పోరాట పటిమపైనే తదుపరి అసెంబ్లీ ఎన్నికల పునాది ఆధారపడి ఉంటుంది. పోటీ లేకుండా స్థానాలను కూటమికి అప్పగిస్తే,  వైఎస్సార్‌సీపీ పని అయిపోయింది అనే నరేటివ్ ప్రజల్లోకి బలంగా వెళుతుంది. దీన్ని తిప్పికొట్టడానికే, ఏకగ్రీవాలను పూర్తిగా నిషేధించి, ప్రతి వార్డు, ప్రతి పంచాయతీలోనూ పోటీ వాతావరణాన్ని రగిల్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.

ఖర్చులు, ఒత్తిళ్లను వైసీపీ కార్యకర్తలు భరిస్తారా? 

 సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని, అధికార పార్టీ దాడిని, పోలీసు కేసులను తట్టుకుని పోటీ చేయడానికి చాలామంది వైఎస్సార్‌సీపీ నాయకులు సిద్ధంగా లేరన్న ప్రచారం జరుగుతోంది.  గతంలో మాకు అధికారం ఉన్నప్పుడు ఏకగ్రీవాల పేరుతో ఇతరులను పోటీ చేయనివ్వలేదు.. ఇప్పుడు మేము పోటీ చేస్తామంటే కూటమి నేతలు ఊరుకుంటారా.. పైగా పార్టీ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందనప్పుడు మేము ఎందుకు జైలు పాలవ్వాలి  అని కొందరు స్థానిక నాయకులు అంతర్గత సంభాషణల్లో ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.   ఈ స్థానిక సమరంలో వైఎస్సార్‌సీపీ ఏమేరకు నిలబడి పోరాడుతుందో, లేక జగన్ భయపడినట్లే కూటమి ఏకపక్ష విజయ సాధన వైపు దూసుకుపోతుందో వేచి చూడాల్సిందే!