Ambati Rambabu: చంద్రబాబు నాయుడు రిమాండ్‌పై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఒక సీనియర్ పొలిటీషియన్ జైలుకు వెళ్లడం బాధాకరమైన విషయం అన్నారు. తెలుగదేశం పార్టీ మద్దతు ఎల్లో మీడియా చంద్రబాబు అరెస్ట్‌ను అక్రమం అని చూపించేందుకు యత్నిస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అన్యాయంగా ఆధారాలు లేకుండా కోర్టులు ఏ నిర్ణయాలు తీసుకోవని అన్నారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించిందన్నారు. జగన్ ప్రభుత్వం కక్ష పూరితంగా చంద్రబాబును అరెస్ట్ చేయించారని ప్రచారం జరుగుతోందని, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతుందన్నారు. 


చంద్రబాబును జైలుకు పంపాలని ఎవరికి లేదని అంబటి అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయటం ద్వారా చంద్రబాబు తప్పించుకుంటారనే ప్రచారం ఉందని. అయితే అలాంటి రోజులకు కాలం చెల్లిందన్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత హెలికాప్టర్‌లో తీసుకువెళ్తామని అధికారులు చెబితే అందుకు చంద్రబాబు వద్దన్నారని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌ను అడ్డుకోవాలని టీడీపీ నేతలు పిలుపు ఇచ్చిన ఎవరు పట్టించుకోలేదని అన్నారు. కోట్ల రూపాయలు ఫీజులు తీసుకునే న్యాయవాదులు చంద్రబాబు కన్నా ముందే వచ్చారని ఆరోపించారు. పెద్దపెద్ద న్యాయవాదులు వచ్చి ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇన్ పర్సన్‌గా వాదించిన కూడా బలమైన ఆధారాలు, సాక్షాధారాలు ఉన్నాయి కాబట్టే జైలుకు పంపాలని న్యాయస్థానం భావించిందన్నారు.


ఆయన మాట్లాడుతూ.. ‘టీడీపీ నేతలు చౌకబారు ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబుకు స్కామ్‌లు చేయటం కొత్త కాదు. డబ్బు, వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా చంద్రబాబు అధికారంలోకి వచ్చే అలవాటు ఉంది. రేవంత్ రెడ్డి ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల డబ్బులు ఇచ్చారు. అక్కడ చంద్రబాబు తప్పుకున్నారు. కానీ ఇప్పుడు కుదరదు. ప్రజలకు మేలు చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. ఆయన స్కాములు చాలా ఉన్నాయి. అమరావతి పెద్ద స్కాం. అందులో కూడా వాస్తవాలు బయటకు రావాలి. చంద్రబాబు అధికారంలో ఉండగా చేసిన పనులపై విచారణ చేయాలి. ఎన్నికల ముందు ఒకరిని అరెస్ట్ చేయాలని మేము ఎందుకు అనుకుంటాం. చట్టం ప్రకారం శిక్ష పడితే బంద్‌కు పిలుపునిస్తారా? దానికి ఎలా మద్దతు ఇస్తారు? న్యాయస్థానం తీర్పుపై బంద్ చేస్తారా?’ అంటూ ప్రశ్నించారు.


ఇంగితజ్ఞానం లేని వ్యక్తి పవన్
పవన్ కల్యాణ్‌పై అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబును అరెస్ట్ చేస్తే రోడ్డు మీద పడుకున్న పవన్, ముద్రగడ కుటుంబంపై చంద్రబాబు హాయంలో దాడి చేసినప్పుడు ఏం చేశారంటూ ప్రశ్నించారు. దుర్మార్గపు రాజకీయాలు చేసే చంద్రబాబుకు పవన్ మద్దతు ఇవ్వటం ఏంటని నిలదీశారు. సొంతపార్టీని నాశనం చేసుకుని చంద్రబాబు పల్లకి మోసేందుకు పవన్ సిద్ధమవుతున్నారని, జనసేన కార్యకర్తలు ఆలోచించాలన్నారు. అవినీతిపరుడైన చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్న పవన్ కూడా అవినీతి పరుడే అన్నారు. 


కోనసీమ జిల్లా అల్లర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి మండిపడ్డారు. రాయలసీమ ప్రజలను అవమానించడం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అలవాటైందన్నారు. రాజకీయాల్లో పవన్ సీరియస్ జోకులు వేస్తు్న్నారని అన్నారు. చంద్రబాబు చెబితే పవన్ మాట్లాడుతున్నారని, ఆలోచనారహిత ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో విప్లవ మాటలకు అవకాశం లేదన్నారు. చంద్రబాబును చట్టబద్దంగా అరెస్ట్ చేశారని అన్నారు. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడిని జైలుకు పంపడం అంటే ఆషామాషి కాదని, ఎన్నో ఆధారాలు కావాలన్నారు. అవన్నీ అధికారుల దగ్గర ఉండడం వల్లే చంద్రబాబు అరెస్ట్ అయ్యారని అన్నారు.