YSRCP Internal Politics : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  లో మాజీ మంత్రి, సీనియర్ నేత అంబటి రాంబాబు తలపెట్టిన వినతి పాదయాత్ర ఆకస్మికంగా నిలిచిపోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గుంటూరులోని తన నివాసం నుండి మంగళగిరి డీజీపీ కార్యాలయం వరకు ఈ రెండు రోజుల పాదయాత్రకు ఆయన అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో అధిష్టానం జోక్యంతో అది రద్దయింది.   ఒక సీనియర్ నేత ఆందోళన కార్యక్రమానికి బ్రేకులు పడటం వెనుక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్క్ పొలిటికల్ కమాండ్ ఉందన్నప్రచారం జరుగుతోంది. 

Continues below advertisement

పార్టీ కార్యక్రమాలను కాదని సొంత కార్యాచరణ

ఈ పరిణామం వెనుక ముఖ్యంగా రెండు రకాల అభిప్రాయాలు బలంగా వినబడుతున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలకు నిరసనగా, పోలీసుల వైఖరిని ఎండగట్టేందుకు అంబటి సొంతంగా కార్యాచరణ ప్రకటించడం ద్వారా వ్యక్తిగత మైలేజ్ పొందే ప్రయత్నం చేశారని పార్టీలోని కొందరు నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారికంగా సమగ్ర నిరసన షెడ్యూల్ , డీఎస్సీ పోరాటాన్ని  చేయకుండానే.. నాయకులు తమ సొంత ఇమేజ్ లేదా నియోజకవర్గ స్థాయి అజెండాలతో రోడ్డెక్కితే అది పార్టీ ఐక్యతను దెబ్బతీస్తుందనేది అధిష్టానం ఆలోచన. జగన్ అనుమతి లేకుండా లేదా పార్టీ అప్రూవల్ లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల పార్టీ హైకమాండ్ సీరియస్ అయిందని, అందుకే ఈ కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోమని స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్లు సమాచారం.

Continues below advertisement

నేతల సొంత మైలేజీ ప్రయత్నాలు వైసీపీలో నడవవు!

వైసీపీ కార్యశైలిని మొదటి నుంచి గమనిస్తే, అక్కడ సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ నడుస్తుందనేది బహిరంగ సత్యం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విధానాల ప్రకారం పార్టీలో నేతలు ఎవరైనా సరే.. అది మాజీ మంత్రులైనా, రీజినల్ కోఆర్డినేటర్లైనా పార్టీ అధిష్టానం నిర్ణయించిన గీత దాటకూడదు. సొంతంగా రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం లేదా సొంత వేదికలపై నుంచి ప్రత్యేక మైలేజ్ పొందే వ్యూహాలను వైసీపీ సంస్కృతి ప్రోత్సహించదు. గతంలో కూడా పలువురు నాయకులు తమ నియోజకవర్గాల్లో పార్టీ అనుమతి లేకుండా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు అధిష్టానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయి.

పార్టీ కార్యక్రమాలే ముఖ్యమని సంకేతం!

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నిరసనలు, పోరాటాలు అన్నీ  సమిష్టిగా జరగాలని, ఎవరికి వారే ఇండివిజువల్ షోలు చేస్తే అది ప్రధాన సమస్య దిశను మళ్లిస్తుందనే అభిప్రాయం ఉంది. అంబటి రాంబాబు పాదయాత్ర చేయడం ద్వారా పోలీసులు లేదా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అది ఒక వ్యక్తి చొరవగా వార్తల్లోకి వెళ్లి పార్టీ వ్యవస్థ కంటే నాయకుడే హైలైట్ అవుతారని జగన్ భావించి ఉండవచ్చని పొలిటికల్ సర్కిల్స్ గుసగుసలాడుతున్నాయి. పార్టీ ఆందోళనలైనా, వైఎస్సార్‌సీపీ జెండా కింద జరిగే పోరాటాలైనా జగన్ నిర్ణయించిన రూట్‌ మ్యాప్‌లోనే జరగాలి  అనే సంకేతాన్ని ఈ ఘటన ద్వారా మరోసారి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పట్ల పార్టీ శ్రేణుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఓటమి తర్వాత ప్రభుత్వంపై పోరాడేందుకు సీనియర్ నేతలు చొరవ తీసుకుంటున్న సమయంలో, ఇలాంటి ఆంక్షలు విధించడం వల్ల నాయకుల్లో ఉత్సాహం తగ్గుతుందనే అభిప్రాయం ఒక వర్గం నుంచి వస్తోంది. పార్టీ అధికారిక కార్యక్రమాల కోసమే వేచి చూస్తే క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశాలు చేజారిపోతాయని, నేతలకు కొంత స్వయం ప్రతిపత్తి ఇస్తేనే పార్టీ మళ్లీ పుంజుకుంటుందని వారు వాదిస్తున్నారు.

పార్టీ అనుమతితో చేస్తానంటున్న రాంబాబు

అంబటి రాంబాబు పాదయాత్ర రద్దు వ్యవహారం వైసీపీలోని అంతర్గత నియంత్రణను, నాయకత్వ శైలిని మరోసారి తెరపైకి తెచ్చింది. ప్రతిపక్ష హోదాలో ఉన్న సమయంలో నాయకులు వ్యక్తిగత మైలేజ్ కంటే పార్టీ సమష్టి ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని, 'జగన్ నిర్ణయమే తుది నిర్ణయం' అనే నియమాన్ని మరోసారి నిరూపించినట్లయింది. రాబోయే రోజుల్లో కేవలం అధిష్టానం ఖరారు చేసే కార్యాచరణతోనే వైసీపీ నేతలు రోడ్డెక్కుతారా లేదా క్షేత్రస్థాయి పోరాటాలకు కొంత వెసులుబాటు లభిస్తుందా అనేది వేచి చూడాలి. పార్టీ అనుమతితో మళ్లీ పాదయాత్ర చేయాలని రాంబాబు టార్గెట్ గా పెట్టుకున్నారు.