Amaravati Capital Construction Challenges: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఐదేళ్ల నిరీక్షణ తర్వాత, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతి పనులు మళ్లీ పట్టాలెక్కుతున్న తరుణంలో ఊహించని గ్లోబల్ సవాళ్లు ఎదురవుతున్నాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు , పశ్చిమాసియాలో చెలరేగుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు అమరావతి నిర్మాణాల కొనసాగింపును మరోసారి ప్రశ్నార్థకం చేస్తున్నాయి. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సప్లై చెయిన్ దెబ్బతినడం, చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో కేంద్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టులపై ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో అమరావతి వంటి మెగా ప్రాజెక్టుల పురోగతిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
నిర్మాణాలు రెండేళ్లు వాయిదా వేయాలన్న ప్రతిపాదనలు
ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని, భారీ నిర్మాణ పనులను కనీసం రెండేళ్ల పాటు వాయిదా వేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించవచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా ప్రధాని మోదీ ప్రకటించిన ఆస్టెరిటీ పాలసీలో భాగంగా ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తుండటం అమరావతికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఈ ప్రచారాన్ని నీతి ఆయోగ్ తోసిపుచ్చినప్పటికీ, ఏపీలోని ప్రతిపక్షాలు దీనిని రాజకీయ అస్త్రంగా మార్చుకుంటున్నాయి. అమరావతి ఆగిపోతుందని అంటున్నారు. దీంతో రాజధాని నిర్మాణం మళ్లీ అటకెక్కుతుందా అనే ఆందోళన సామాన్య ప్రజల్లో నెలకొంది.
వరల్డ్ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ రుణాల్లో జాప్యం జరుగుతుందా?
అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల్లో సింహభాగం ప్రపంచ బ్యాంక్ , ఆసియా అభివృద్ధి బ్యాంక్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రావాల్సి ఉంది. యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లు అస్థిరంగా మారితే, ఈ రుణాల మంజూరులో జాప్యం జరిగే ప్రమాదం ఉంది. గ్లోబల్ ఎకానమీ కుదేలైతే బ్యాంకులు తమ ప్రాధాన్యతలను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద తలనొప్పిగా మారింది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు
రాజకీయంగా చూస్తే, అమరావతిని తన ప్రతిష్టగా భావిస్తున్న చంద్రబాబుకు ఇది ఒక అగ్నిపరీక్ష. ఒకవైపు రాష్ట్రంలో ఆర్థిక వనరుల కొరత, మరోవైపు కేంద్రం నుంచి అందాల్సిన సహకారం .. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం ఇప్పుడు ఆయన ముందున్న సవాల్. గతంలో పారిశ్రామికీకరణను పరుగులు పెట్టించిన అనుభవం ఉన్నప్పటికీ, ఇప్పుడు యుద్ధం వంటి బాహ్య శక్తుల ప్రభావం వల్ల ప్రాజెక్టు మందగిస్తే లక్ష్యం చేరుకోవడం ఆలస్యం అవుతుంది. అమరావతి చుట్టూ జరుగుతున్న రాజకీయం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. రాజధాని పనులు వాయిదా పడతాయనే ప్రచారం ద్వారా ఇన్వెస్టర్లలో భయాందోళనలు సృష్టించేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. నిర్మాణ పనులు జోరుగా సాగుతున్ నసమయంలో ఇలాంటి ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదంటున్నారు.
అమరావతికి ఆటంకాలుండవు!
కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి వాయిదా నిర్ణయాన్ని ప్రకటించలేదని కూటమి నేతలు గట్టిగా చెబుతున్నారు. నీతి ఆయోగ్ వివరణ కూడా ప్రభుత్వానికి కొంత ఊరటనిస్తోంది. కానీ, ప్రపంచ యుద్ధ మేఘాలు తొలగిపోనంత కాలం అమరావతి వంటి భారీ ప్రాజెక్టులపై నీలినీడలు కమ్ముకుంటూనే ఉంటాయన్నది సత్యం. ఏపీ రాజధాని కల నెరవేరాలంటే కేవలం రాష్ట్ర సంకల్పం మాత్రమే కాదు, అంతర్జాతీయ పరిస్థితులు కూడా అనుకూలించాల్సిన అవసరం కనిపిస్తోంది.
