CM KCR: తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. అధికారమే లక్ష్యంగా అధికార బీఆర్ఎస్, ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారం సైతం మొదలు పెట్టేశాయి. బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉనికి చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భారీ గిఫ్ట్ పంపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించునేందుకు బీఆర్ఎస్ అధినేత ప్రచారం కోసం అఖిలేష్ యాదవ్  ప్రచార రథాన్ని (బస్సు) పంపించారు. 






ప్రచార రథాన్ని గులాబీ రంగుతో సిద్ధం చేశారు. ముందు వైపు తెలంగాణ ప్రగతి రథం, భారత రాష్ట్ర సమితి అని రాశారు. ఇరు పక్కల కేసీఆర్ చిత్రాలు, కారు గుర్తు, భారతదేశం మ్యాప్, ప్రతి ఇంటికీ సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం, ఓట్ ఫర్ కార్, ఓట్ బీఆర్ఎస్ అని రాసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వెనుక వైపు కేసీఆర్ చిత్రం, కారు చిహ్నం, కారు గుర్తుకే మన ఓటు అంటూ రాశారు. కొద్ది రోజుల క్రితమే ఈ బస్సు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణకు చేరింది. యూపీ రిజిస్ట్రేషన్‌తో ప్రచార రథం ఉంది. ఈ ప్రచార రథాన్ని సీఎం కేసీఆర్ తన ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకోనున్నారు. నేటి నుంచి మొదలయ్యే కేసీఆర్ ప్రచారంలో తెలంగాణ రోడ్లపై ప్రచార రథం పరుగులు పెట్టనుంది. ఇందులో భాగంగా ఆదివారం హుస్నాబాద్‌కు వెళ్లనుంది. 


రేపు జనగామలో సీఎం కేసీఆర్ సభ


అక్టోబర్ 16న జనగామలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఏర్పాటు చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. జనగామలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. జిల్లాకు సాగునీరు, తాగు నీరు వచ్చిందన్నారు. జనగామ పట్టణంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు. 


గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో


తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ 6 గ్యారెంటీలు ప్రకటించింది. అయితే కాంగ్రెస్‌ గ్యారెంటీల కంటే గొప్పగా అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ కూడా మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో రాబోతోందని ఇటీవల మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. మ్యానిఫెస్టోలో మహిళ ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. కొత్త మేనిఫెస్టోలో మహిళల ఆర్థిక బలోపేతం కోసం హామీలు ఉంటాయన్నారు. ఆ హామీలు ప్రకటించాక కేసీఆర్ అంటే ఏంటో తెలుస్తుందని చెప్పారు. ఆ శుభవార్తను త్వరలోనే అందరూ వింటారని కూడా చెప్పారు మంత్రి హరీష్‌రావు.