KCR In Halia: హాలియాలో కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ, హెలికాప్టర్లో అలా.. డప్పుదరువులు.. రోడ్లన్నీ గులాబీమయం
సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలోని హాలియా పర్యటన ముగిసింది. హాలియాలో ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించి మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు.
వ్యవసాయ మార్కెట్లో నాగార్జున సాగర్ నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఈ సమావేశంలో సాగర్ నియోజకవర్గ సమస్యలు, సాగర్ ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించారు.
మంత్రి జగదీశ్రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. నెల్లికల్ ఎత్తిపోతలు సహా, ఇతర ప్రాజెక్టులు, సమస్యల పరిష్కారానికి సీఎం దిశానిర్దేశం చేశారు.
సమీక్ష అనంతరం ఎమ్మెల్యే నోముల భగత్ ఇంటికి వెళ్లి.. అక్కడ చాలా సేపు ఉన్నారు. అక్కడే భోజనం కూడా చేశారు.
ముఖ్యమంత్రి పర్యటన ఉన్న వేళ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హాలియా పట్టణంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరింపజేశారు.
చెక్ పోస్ట్ ప్రాంతం నుంచి సభా వేదిక స్థలం ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు రోడ్లన్నీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులకు మాత్రమే ఎంట్రీ పాసులు అందజేసినట్లు తెలుస్తోంది. మొత్తం రెండున్నర వేల మంది కూర్చునేలా సభా వేదిక ఎదుట స్థలం ఏర్పాట్లు చేశారు.
ప్రతి మండలానికి ఒక గ్యాలరీలాగా ఏర్పాటు చేశారు. ఆ మండలాలకి చెందిన వ్యక్తుల్ని మాత్రమే అందులోకి అనుమతించారు.
అంతేకాక, సీఎం పర్యటన నేపథ్యంలో పాటలు, డప్పులు, దరువులతో రోడ్లన్నీ కళకళలాడాయి. గులాబీ జెండాలతో రోడ్లన్నీ నిండిపోయాయి.