Tirumala Brahmotsavam Photos: ఘనంగా శ్రీవారి స్నపన తిరుమంజనం.. తమిళనాడు నుంచి గోదాదేవిమాలలు
చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీవారి ఆలయంలో లవంగాలు, పచ్చకర్పూరం,జొన్నకంకుల మాలలతో వేడుకగా శ్రీవారికి స్నపన తిరుమంజనం చేశారు.
లవంగాలు, పచ్చకర్పూరం, జొన్నకంకులు, యాలకులు, ముత్యాలు, తులసి విత్తనాలు, పసుపు పవిత్రాలు, తామరపూల మాలలతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలు, కిరీటాలతో స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది.
రంగనాయకుల మండపంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆశీనులు కాగా.. వేద మంత్రాల నడుమ కంకణభట్టార్ శ్రీ వాసుదేవ భట్టాచార్యులు ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు.
స్నపన తిరుమంజనంలో పలు రకాల మాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు భక్తులను అనుగ్రహించారు.
వేద పండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠించారు. అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం లాంటి ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో శ్రీవారిని తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి తీసుకొచ్చిన గోదాదేవిమాలలతో అలంకరించారు. తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీ పెద్దజీయర్ మఠానికి మాలలను తీసుకురాగా శ్రీశ్రీవ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుపూర్కు చెందిన రాజేందర్ సహకారంతో శ్రీవారికి, అమ్మవార్లకు ప్రత్యేక మాలలు, కిరీటాలు ఏర్పాటు చేశామని టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు.
ఈ వేడుకలో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, టీటీడీ ఈఓ కెఎస్ జవహర్రెడ్డి దంపతులు, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి దంపతులు, తదితరులు పాల్గొన్నారు.