Raa Raja Movie: స్క్రీన్ మీద ఎవ్వరూ కనిపించరు... 'రా రాజా' డిఫరెంట్ ఎక్స్పీరిమెంట్ - దర్శక నిర్మాత శివప్రసాద్ ఇంటర్వ్యూ
''ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. హీరో హీరోయిన్ల పేర్లు, మొహాలు చూసి థియేటర్లకు రావడం లేదు. కథ నచ్చితే, కంటెంట్ బాగుంటే సినిమా ఏదైనా చూస్తున్నారు. కంటెంట్ బేస్డ్ సినిమా తీయాలని 'రా రాజా' చేశా'' అని దర్శక నిర్మాత బి శివ ప్రసాద్ అన్నారు. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ పతాకంపై స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కించారు. మార్చి 7 (శుక్రవారం) థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో శివప్రసాద్ మాట్లాడుతూ... ''మా సినిమాలో ఆర్టిస్టులు ఎవరూ కనిపించకపోయినా అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. లవ్, కామెడీ, హారర్... ప్రతిదీ ఆడియన్స్ ఫీల్ అవుతారు. అందరినీ ఎంగేజ్ చేసేలా సినిమా ఉంటుంది'' అని చెప్పారు.
'మాతృ' సినిమాతో నిర్మాతగా ప్రయాణం ప్రారంభించిన తనకు, ఆ సినిమా చేసే సమయంలో 'రా రాజా' ఆలోచన వచ్చిందని, కథ రెడీ చేశాక సెట్స్ మీదకు తీసుకు వెళ్లానని, దర్శక నిర్మాతగా ప్రాజెక్ట్ చేశానని బి శివ ప్రసాద్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఈ సినిమాకు టెక్నికల్ టీం ప్లస్ పాయింట్. కెమెరామెన్ రాహుల్ శ్రీ వాత్సవ్ బాగా చేశారు. దర్శకుడికి ఏం కావాలో తెలుసుకుని ఆయన పని చేస్తారు'' అని చెప్పారు.
'రా రాజా' సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు. ఆయన గురించి బి శివ ప్రసాద్ మాట్లాడుతూ... ''శేఖర్ చంద్ర గారి సంగీతం మా చిత్రానికి ప్రధాన బలం. నేపథ్య సంగీతం అద్భుతంగా చేశారు. అది సినిమాకు ప్లస్ అవుతుంది. ప్రేక్షకులు అందరూ ఆయన గురించి కచ్చితంగా మాట్లాడుకుంటారు. మా సినిమాతో కొత్త శేఖర్ చంద్రను చూస్తారు'' అని చెప్పారు.
థియేట్రికల్ ఎక్స్పీరియెన్స్ కోసమే 'రా రాజా' సినిమా తీశామని, తమ టీం అంతా చాలా కష్టపడి చేశామని బి శివ ప్రసాద్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా 'రా రాజా' ఉంటుంది. ఏ ఒక్కరినీ డిజప్పాయింట్ చేయదు. స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంగేజ్ చేస్తుంది. ఆర్టిస్ట్స్ స్క్రీన్ మీద లేరనే ఫీలింగ్ రాదు'' అని చెప్పారు.