Andhra Pradesh Deputy CM Pawan Kalyan : మోకాళ్ల లోతు బురద నీటిలో దిగిన పంట పొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కృష్ణాపురంలోని పంట పొలాలను పరిశీలించారు.
ఈ ఉదయం 11 గంటలకు కృష్ణాపురం చేరుకున్న పవన్ కల్యాణ్, మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. రైతులు, స్థానిక ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
మొంథా తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.38 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని, ఇందులో ఒక్క కృష్ణా జిల్లాలోనే 46వేల హెక్టార్లలో నష్టం కలిగిందనీ చెప్పారు. ఈ జిల్లాలో దాదాపు 56 వేల మంది రైతులు నష్టపోయారని ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని, అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు.
మొంథా తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకున్నారు. అనంతరం కృష్ణా జిల్లా అధికారులు అవనిగడ్డలో తుపాను నష్టంపై ఏర్పాటు చేసిన పొటో ప్రదర్శన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
“ప్రభుత్వం ముందస్తు సన్నద్దత మూలంగా మొంథా తుపానును సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. పక్కా ప్రణాళికతో నష్టం తీవ్రత తగ్గించాం. సుదీర్ఘ పాలనానుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ముందు చూపు కారణంగానే తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వీడియో కాన్ఫరెన్సులు, ఆర్టీజీఎస్ ద్వారా 24 గంటలు పరిస్థితులను పర్యవేక్షిస్తూ.. అటు యంత్రాంగాన్ని, ఇటు గ్రామ స్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేశాం.- పవన్ కల్యాణ్
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లక్ష 16 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం. ఈ విపత్తులో కౌలు రైతులు కూడా నష్టపోయిన విషయం నా దృష్టికి వచ్చింది. వారిని ఆదుకొనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాను.- పవన్ కల్యాణ్
తుపాను అనంతర ఉపశమన చర్యలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాం. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సుమారు 274 కిలోమీటర్ల మేర రహదారులు తుపాను దాటికి దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. దెబ్బతిన్న అన్ని రోడ్లను శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించాం.
పల్లపు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడంతోపాటు అంటు వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో సూపర్ శానిటేషన్.. సూపర్ క్లోరినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. జిల్లాల వారీగా పారిశుద్ధ్య సిబ్బందిని బృందాలుగా విభజించి పారిశుద్ధ్య మెరుగు పర్చే చర్యలు మొదలు పెట్టాం. - పవన్ కల్యాణ్
1,583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితం కాగా, మొత్తం 21,055 మంది సిబ్బందిని పారిశుధ్య నిర్వహణకు వినియోగిస్తున్నాం. తాగునీటి సరఫరా వ్యవస్థకు ఇబ్బంది ఏర్పడిన చోట్ల ప్రయత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం.- పవన్ కల్యాణ్
మొంథా ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి 25 కేజీల బియ్యాన్ని, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించాం. - పవన్ కల్యాణ్
కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్ ప్యాకెట్, కేజీ ఉల్లిపాయలు, 1 కిలో బంగాళాదుంపలు, కేజీ పంచదార కూడా కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్లకు వెళ్లే ముందే ఒక్కొక్కరికీ రూ.వెయ్యి చొప్పున ఇస్తున్నాం. - పవన్ కల్యాణ్
ఒక్కో కుటుంబానికీ గరిష్టంగా రూ.3 వేలు చెల్లించనున్నాం. తుపాను వల్ల సంభవించిన నష్టంపై ప్రాథమిక నివేదిక రాగానే కేంద్ర సహకారం కోరుతాం.- పవన్ కల్యాణ్
కోడూరు మండల పరిధిలో సముద్రం కట్టపై దెబ్బ తిన్న అవుట్ ఫాల్ స్లూయిజ్ కొత్తగా నిర్మించడానికి నాబార్డ్ సాయం తీసుకుంటాం. - పవన్ కల్యాణ్
ఎదురుమొండి దీవుల్లో సముద్ర కోతకు గురై దెబ్బ తిన్న ఎదురుమొండి – గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.08 కోట్ల కేటాయించామని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యిందని, దీని ద్వారా ఐదు గ్రామాల ప్రజలకు రహదారి కష్టాలు తీరనున్నాయని” - పవన్ కల్యాణ్
ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కృష్ణా జిల్లా స్పెషల్ ఆఫీసర్, టూరిజం శాఖ ఎండీ అమ్రపాలి, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యటనలో స్థానిక రైతులు కొందరు తమ ఆందోళన వ్యక్తం చేశారు. పర్యటన ద్వారా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో ఎదురుచూసిన రైతులు, పర్యటన అనంతరం నిరాశ వ్యక్తం చేశారు.
అధికారులు, స్థానిక నేతలు రోడ్డు పక్కనే ఉన్న కొద్దిపాటి వరి పొలాలు మాత్రమే చూపించారని స్థానికులు ఆరోపించారు. ఒకే ఒక్క రైతు కుటుంబంతో మాట్లాడే అవకాశం ఇచ్చారని తెలిపారు. ఇలా చేస్తే మండలమంతా ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా తెలుస్తాయని అనుమానం వ్యక్తం చేశారు.
ఉప ముఖ్యమంత్రి కోడూరు మండల కేంద్రానికే రాలేదని సముద్రతీరానికి ఆనుకుని వేల ఎకరాల భూములు ప్రతీ ఏటా వరదలతో మునుగుతున్నాయని రైతులు తెలిపారు. ఆ సమస్యపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.