AP Tourism: ఏపీ పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని బాబా రామ్దేవ్ను కోరిన చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం విజయవాడలో టూరిజం కాన్క్లేవ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి కందుల దుర్గేశ్, యోగా గురువు బాబా రాందేవ్ లు పాల్గొని ప్రసంగించారు.
ఏపీ పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని ఆధ్యాత్మిక వేత్త, యోగా గురువు బాబా రామ్దేవ్ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఆయన సమాజానికి చేస్తున్న సేవల్ని కొనియాడారు.
భవిష్యత్తు అంతా పర్యాటక రంగానిదే అని కొన్నేళ్ల కిందటే చెప్పానన్నారు చంద్రబాబు. అసలే ఏపీకి అద్భుతమైన సముద్ర తీరం ఉందని గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం అభివృద్ధి చెందేందుకు అన్ని చర్యలు చేపట్టాం, ఈ ఆగస్టు 15 లోగా అన్ని సేవలను ఆన్లైన్లో అందిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఏపీలో టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. కోనసీమ, హార్సిలీ హిల్స్, పాపికొండలను మరింత అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఏపీలో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని బాబా రాందేవ్ను కోరారు.
పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిన ప్రభుత్వం కూటమి సర్కార్ అన్నారు చంద్రబాబు. విదేశాల్లో ఉన్న భారతీయుల్లో 35 శాతం తెలుగువాళ్లే ఉన్నారని, విదేశాల్లో తెలుగువాళ్లే ఎక్కువ ఆదాయం సంపాదించడంపై హర్షం వ్యక్తం చేశారు.
నడిచే హోటల్ రూములుగా తీర్చిదిద్దిన కారవ్యాన్ లను ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆయన వెంట యోగా గురువు బాబా రాందేవ్, ఏపీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేశ్ ఉన్నారు.
క్యారవాన్ వాహనం లోపల బెడ్లు, చిన్న కిచెన్ (స్టవ్, ఫ్రిడ్జ్), వాష్రూమ్, కుర్చీలు, టేబుల్, వై-ఫై, ఎసీ, టీవీ లాంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ క్యారవాన్ ఒక చిన్న మొబైల్ హోటల్లా పనిచేస్తుందన్నారు చంద్రబాబు.
గతంలో ఐటీ అభివృద్ధి చెందినట్లు ఇప్పుడు టూరిజం డెవలప్ కావాలని ఆకాంక్షించారు. ఉద్యోగాలు పోతావని ఆందోళన చెందవద్దని.. స్కిల్స్ పెంచుకుని స్మార్ట్ వర్క్ చేయాలని యువతకు చంద్రబాబు సూచించారు.