మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ఇప్పుడు అనేకానేక సంచనాలు నమోదవుతున్నాయి. ఆ సంస్థను చేజిక్కించుకోవడానికి రూ. మూడు లక్షల కోట్లకుపైగా ఖర్చు పెట్టారు టెస్లా అధినేత ఎలన్ మస్క్. త్వరలో ఆయన చేతికి ట్విట్టర్ వెళ్లనుంది. ఆయన తన అధీనంలోకి ట్విట్టర్ను తీసుకున్న తర్వాత సీఈవో పరాగ్ అగర్వాల్ను తప్పిస్తారని.. మేనేజ్మెంట్లో కీలక మార్పులు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే సీఈవో పరాగ్ అగర్వాల్... మస్క్ చేతికి కంపెనీ వెళ్లి ఆయనను తనను తొలగించడానికి ముందే కంపెనీలో కీలక మార్పులు చేస్తున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
ట్విట్టర్లో ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్లను రాజీనామా చేయాలని సీఈవో పరాగ్ అగర్వాల్ ఆదేశించారు. ట్విటర్ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్గా పని చేస్తున్న టాప్ ఎగ్జిక్యూటివ్ బెక్పూర్ని సంస్థను వీడి వెళ్లాల్సిందిగా సిఇఒ పరాగ్ అగర్వాల్ ఆదేశించారు. అలాగే రెవెన్యూ హెడ్ బ్రూస్ ఫలాక్ను తొలగించారు. ట్విటర్ సిఇఒ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారంటూ బెక్పూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత కాలం ట్విటర్లో సాధించిన లక్ష్యాల పట్ల తాను గర్వంగా ఉన్నానని, ట్విటర్ను వెళ్లి వీడాల్సిన రోజు వస్తుందని తాను ఊహించలేదంటూ బెక్పూర్ ట్వీట్ చేశారు.
రెవెన్యూ హెడ్గా బ్రూస్ ఫలాక్ను కూడా ఆ స్థానం నుండి తొలగిస్తున్నట్లు మొదట ట్విటర్లో ప్రకటించారు. అనంతరం ఆ ట్వీట్ను తొలగించినా ఫలాక్ను మాత్రం కీలక బాధ్యతల నుంచి పక్కన పెట్టారు.
కీలకమైన ఈ రెండు బాధ్యతలను మరో టాప్ ఎగ్జిక్యూటివ్ అయిన జే సల్లివాన్కి అప్పగించారు. మస్క్ చేతికి వెళ్లక ముందే ట్విట్టర్ను సంస్కరించాలని పరాగ్ అగర్వాల్ ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. కొత్త నియామకాలు కూడా నిలిపివేశారు.