"పన్నెండేళ్ల బాలికపై లైంగిక దాడికి దిగితే  శరీరంతో నేరుగా శరీరాన్ని తాకకపోతే పోక్సో చట్టం కింద నేరం కాదు" అని ముంబై హైకోర్టు నాగపూర్ బెంచ్‌కు చెందిన జస్టిస్ పుష్పతీర్పు చెప్పారు. నిందితుడిపై కేసు కొట్టి వేశారు. బాధితురాలి చేతులు గట్టిగా పట్టుకొని, ప్యాంటు జిప్‌ తీయడం లైంగిక దాడికాదని మరో కేసు కొట్టేశారు. మరో కేసుల్లో  బాధితురాలు ప్రతిఘటిస్తే ఆమెను వివస్త్రని చేయడం సాధ్యం కాదని తేల్చారు. అత్యాచారం కేసుల్లో ఓ మహిళా న్యాయమూర్తి .. చట్టాలకు ఇలా సొంత భాష్యం చెప్పుకుని బాధితులకు అన్యాయం చేస్తారా అని దేశం మొత్తం అప్పట్లో గగ్గోలు పెట్టింది. ఫలితంగా జస్టిస్ పుష్పను తాత్కాలిక న్యాయమూర్తిగానే ఉంచేశారు. అయితే ఇలాంటి న్యాయమూర్తులు ఇండియాలోనే కాదు.. అన్ని చోట్లా ఉంటారని స్విట్జర్లాండ్‌లో ఓ మహిళా న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు చూస్తే మనకు సులువుగా అర్థమైపోతుంది. 



స్విట్జర్లాండ్  ఓ నగరానికి చెందిన బాధితురాలిపై గతేడాది ఫిబ్రవరిలో పోర్చుగల్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ఆమె ప్లాట్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణంలో మరో 17 ఏళ్ల మైనర్‌ అతడికి సహకరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ జరిపి గత ఏడాది ఆగస్టులో శిక్, విధించారు.  31 ఏళ్ల వ్యక్తికి 4 సంవత్సరాల 3నెలల శిక్ష విధించింది. మైనర్‌ని జువైనల్‌ హోంకి తరలించారు.తాజాగా కోర్టు గతంలో నిందితుడికి తాను విధించిన శిక్షను తగ్గించింది. 51 నెలల జైలు శిక్షను 36 నెలలకు తగ్గించింది. బాసెల్ కోర్టు  న్యాయమూర్తి లిసెలెట్ హెంజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  నిర్ణయం చెబుతూ...  అత్యాచారం జరిగిన రోజున ఆమె మరో వ్యక్తితో కలిసి నైట్‌క్లబ్‌క్‌ వెళ్లి ఎంజాయ్‌ చేసిందని .. ఆమె నిందితుడ్ని రెచ్చగొట్టిందని.. పైగా  అత్యాచారం కూడా 11 నిమిషాలపాటే సాగిందని..అందుకే అతడికి శిక్షను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఈ తీర్పు సంగతేమో కానీ.. తీర్పులోని మహిళా న్యాయమూర్తి వ్యాఖ్యలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా హైలెట్ అయ్యాయి.   


ఈ తీర్పుకు వ్యతిరేకంగా బాసెల్‌ నగరవ్యాప్తంగా ఆందోళనలు  జరుగుతున్నాయి. మహిళా న్యాయమూర్తిపై విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆ మహిళా న్యాయమూర్తిపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు అంశం.. ఈ కేసులోఆమె చేసిన వ్యాఖ్యలు తీర్పు చెప్పడానికి ఎంచుకున్న ప్రామాణిక అంశాలు అన్నీ హైలెట్ అవుతున్నాయి. మూడు రోజుల నుంచి స్విట్జర్లాండ్‌లో ఈ తీర్పు అంశం హైలెట్ అవుతోంది కానీ ...అక్కడి న్యాయ వర్గాలు మాత్రం స్పందించడం లేదు.