China COVID-19 News: చైనా(China )లో పెరుగుతున్న కరోనా(COVID-19) కేసులు యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. వివిధ మీడియా నివేదికల ప్రకారం, చైనాలో ఇప్పటివరకు అత్యంత ప్రమాదకరమైన కరోనా వేవ్ వచ్చింది. చైనాలో రోజూ లక్షకుపైగా కోవిడ్ కేసులు, 5,000 మరణాలు నమోదవుతాయని ఒక నివేదిక తెలిపింది. వచ్చే నెల నాటికి రోజుకు కొత్త కేసుల సంఖ్య 37 లక్షలు, మార్చి నాటికి 42 లక్షలకు పెరుగుతుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. 


ఈ నివేదికను లండన్‌కు చెందిన ఓ సంస్థ విడుదల చేసింది. బీజింగ్, సిచువాన్, అన్హుయి, హుబే, షాంఘై, హునాన్‌లలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ శనివారం (డిసెంబర్ 24) లేదా ఆదివారం (డిసెంబర్ 25) తన మొదటి కోవిడ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.


క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలను ఎలా కంట్రోల్ చేయాలని... కరోనా మరింతగా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా జిన్ పింగ్ ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేయవచ్చు. ఈ సమావేశం తరువాత చైనాలో పూర్తి లాక్డౌన్ ప్రకటించవచ్చని భావిస్తున్నారు. బీజింగ్‌లో ఇన్ఫెక్షన్ రేటు 50 నుంచి  70శాతం ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. షాంఘైలో వచ్చే వారం నాటికి 25 మిలియన్ల మందికి కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది.


ప్రభుత్వం డేటాను దాచిపెడుతోంది. 


కరోనా గణాంకాలను దాచిపెట్టే పనిని జిన్ పింగ్ ప్రభుత్వం మరోసారి ప్రారంభించింది. గత వారం రోజుల్లో కేవలం 8 మంది మాత్రమే కరోనాతో చనిపోయారని ప్రభుత్వం తెలిపింది. మీడియా నివేదికల ప్రకారం డిసెంబర్ 20న చైనాలో 36 మిలియన్ల కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు చైనాలో 11 లక్షల మంది మరణ ధృవీకరణ పత్రాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. బీజింగ్, షాంఘైలలో ఒక్కోచోట 60 కొత్త శ్మశాన వాటికలు, చెంగ్డూలో 40 కొత్త శ్మశాన వాటికలు నిర్మించారు. 


చైనాలో మందుల కొరత


చైనాలో మందులకు భారీ కొరత ఉంది. డిమాండ్ తీర్చడానికి ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో సిబ్బంది ఓవర్ టైమ్ పని చేస్తున్నారు. చైనా ప్రభుత్వం కూడా కొన్ని ఏర్పాట్లు చేసింది. జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పికి మందులు ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ స్టోర్లలో ఎన్-95 మాస్కులు, యాంటిజెన్ టెస్టింగ్ కిట్లు పూర్తిగా నిండుకున్నాయి. ఈ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని జిన్ పింగ్ ప్రభుత్వం 100కు పైగా కొత్త కంపెనీలకు లైసెన్సులు ఇచ్చింది.


అధ్యక్షుడు జిన్ పింగ్ పై ఆగ్రహం


ఈ పరిస్థితుల్లో అధ్యక్షుడు జిన్ పింగ్ పై ఆగ్రహం పెరుగుతోందని తెలుస్తోంది. చైనా సోషల్ మీడియాలో ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీని, జిన్ పింగ్ ను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. దేశంలో మందుల కొరత, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.