దేశాల మధ్య యుద్ధాలు అంటే మొన్నటి వరకు కేవలం భూమి మీద, ఆకాశంలో లేదా నీటిలో మాత్రమే జరిగాయి. కానీ ఇప్పుడు అంతరిక్షంలో జరగబోతున్నాయి. అవును మీరు చదవడానికి కాస్త షాకింగ్‌గానే ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. అయితే మరీ ముఖ్యంగా కక్ష్యలో వార్‌ జరగడం అనదే.. ఇంతకు ముందు ఏ దేశాలకు తెలియదు. కానీ.. ఎప్పుడై ఉక్రెయిన్‌ రష్యాల మధ్య జరిగిన సమయంలో ఓ కొత్త పదం వెలుగులోకి వచ్చింది. అదే.. ASAT. దీనినే యాంటీ శాటిలైట్‌ టెస్ట్‌ అని అంటారు. ఉక్రెయిన్‌ వ్యవహారంలో ఏ దేశమైన తలదూర్చి.. ఉక్రెయిన్‌ హెల్ప్‌ చేద్దామని చూస్తే.. వారి దేశాల ఉపగ్రహాలను కూల్చేస్తామంటోన్న రష్యా వార్నింగ్‌ ఇచ్చింది. అయితే ఈ కామెంట్‌ రష్యా చేసింది కానీ ఏ దేశానికి సంబంధించిన ఉపగ్రహాన్ని అయితే కూల్చేయలేదు. కానీ.. వచ్చే రోజుల్లో వార్ వన్ సైడ్ అన్నట్టు.. వార్ స్పేస్ సైడేనా? అన్న అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ఇంతకీ ASAT అంటే ఏంటి.? దీని ద్వారా రష్యా యుద్ధం ఏవిధంగా చేస్తుందనే ఆసక్తికర విశేషాలు ఇక్కడ అందిస్తున్నాం.


ASAT ఏం చేస్తుంది.. 
నిజానికి ASATను ఉపగ్రహాలను నియంత్రించడం లేదా ధ్వంసం చేయడానికిగానూ ఈ ఎశాట్‌ను వినియోగిస్తారు. వీటిని కేవలం మిలటరీ సహా వివిధ అవసరాలకోసం అంతరిక్షంలో పని చేస్తోన్న ఉపగ్రహాలను ఈ ఆయుధాల ద్వారా నిర్వీర్యం చేస్తుంటారు. ఎవరి దేశానికి చెందిన ఉపగ్రహాన్ని వారే ధ్వంసం చేయడం ఇప్పటి వరకూ ఉన్న ఆనవాయితీ. అయితే ఈ టెక్నాలజీతో.. ఇతర దేశాల శాటిలైట్లను సైతం ధ్వంసం చేయవచ్చు. అదే జరిగితే.. అంతరిక్ష యుద్ధం మొదలై పోయినట్టే.. రష్యా ప్రస్తుతం చేస్తోన్న హెచ్చరికల సారాంశం ఇదేనంటున్నారు నిపుణులు. 
ఎశాట్‌ల రూపకల్పన ఇప్పటిదనుకుంటే పొరపాటే.. ఇది 1957లోనే మొగ్గ తొడిగింది. అప్పటి సోవియట్ యూనియన్ తొలి ఉపగ్రహం స్పుత్నిక్ ను విజయవంతంగా ప్రయోగించగానే.. అమెరికా ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయింది. అంతరిక్షంలో ఉపగ్రహాల ద్వారా సోవియట్ యూనియన్ అణ్వస్త్రాలను మొహరిస్తుందనే అనుమానం అమెరికాది. దంతో తొలి యాంటీ శాటిలైట్ మిస్సైల్ ను తయారు చేసింది యూఎస్. నాడు యూఎస్ తయారు చేసిన ఎశాట్ పేరు బోల్డ్ ఒరాయన్. ఇదో బాలిస్టిక్ క్షిపణి. దీనికి పోటీగా సోవియట్ మరోటి తయారు చేసింది. దీనిపేరు కో ఆర్బిటల్స్. దీనిని ప్రత్యేకించి ప్రయోగించాల్సిన అవసరం లేకుండా.. ఉపగ్రహంతో పాటే కక్షలో తిరుగుతుంది. అవసరం లేదనుకున్నపుడు ఉపగ్రహంతో పాటు పేలిపోతుంది. దీనికి పోటీగా పేలుడు లేకుండా కక్ష్యలో వేగాన్నే ఆయుధంగా మలుచుకుని.. ఉపగ్రహాన్ని పేల్చే సరికొత్త ఎశాట్స్ తెచ్చింది యూఎస్. ఇలా ఉపగ్రహాలను కూల్చే ఆయుధాల్లో సరికొత్త ఆవిష్కరణలు సాగుతున్నాయి. 


చైనా, భారత్‌లకు ఆ సత్తా ఉంది..
2007లో చైనా, 2019లో భారత్ సొంతంగా ఎశాట్స్‌ను ప్రయోగించే సత్తాను సొంతం చేసుకున్నాయి. అసలు వీటి ఉపయోగం.. కాలం చెల్లిన ఉపగ్రహాలను ధ్వంసం చేయడమే. అయితే వీటి వల్ల కూడా అంతరిక్షంలో చెత్త పేరుకుపోయింది. ఈ చెత్త మొత్తం.. భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతోంది. కానీ ప్రస్తుతానికి వస్తే.. ఏశాట్స్‌ను ప్రయోగించగలిగే సత్తా గల దేశాలు నాలుగంటే నాలుగింటికే ఉన్నాయి. వాటిలో ముందుగా అవి అమెరికా- రష్యా- చైనా- భారత్. అయితే ఇజ్రాయెల్‌కు కూడా ఈ కెపాసిటీ ఉందని అంటారు. కానీ అధికారికంగా ఆ దేశమైతే ఎశాట్స్ ఇప్పటి వరకూ ప్రయోగించలేదు. ఏశాట్స్‌ను రెండు రకాలుగా ఉపయోగిస్తారు. మొదటిది కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలను డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, ఇతర పేలుడు పదార్ధాలతో భౌతికంగా ఢీకొట్టించి పేల్చడం. రెండోది.. భౌతిక దాడి కాకుండా సైబర్ దాడి ద్వారా ఉపగ్రహాన్ని పనిచేయనివ్వక పోవడం. దాని ఫ్రీక్వెన్సీలు ఆపేయటం. ఈ దాడి భూమిపై నుంచి కూడా చేయవచ్చు. అది సరే. ఇలాంటి దాడి చేస్తే పరిస్థితి ఏంటని చూస్తే.. ఇప్పటికే రష్యా అనేక దేశాల ఉపగ్రహాల సిగ్నళ్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలున్నాయి. 
రష్యాతో యుద్ధం జరుగుతున్న క్రమంలో ఉక్రెయిన్‌కి సాయం చేస్తోన్న దేశాల ఉపగ్రహాలను కూల్చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఉక్రెయిన్ సైన్యం ఎలాన్ మాస్స్ స్పేస్ ఎక్స్ పంపిన శాటిలైట్లతో పాటు అమెరికా ఉపగ్రహ వ్యవస్థ ఇరిడియంపై ఎక్కువగా ఆధార పడుతోంది. దాదాపు 3 వేలకు పైగా ఉపగ్రహాలు రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై కన్నేసి ఉంచాయని తెలుస్తోంది. కాబట్టి వీటన్నిటినీ రష్యా పేల్చేస్తుందా? పేల్చేస్తే పరిస్థితేంటి?. అన్న భయం ప్రపంచమంతా పాకింది. అంతరిక్షంలో దాడులకు చట్టపరంగా ఏం చేయాలన్న స్పష్టత లేదు. రష్యా ఒక వేళ ఎశాట్స్ ను ప్రయోగిస్తే.. అది ఏకంగా అమెరికాపై దాడికి దిగినట్టే అవుతుందని భావిస్తున్నారు నిపుణులు. అదే జరిగితే యుద్ధం సరికొత్త రూపం దాల్చడం ఖాయం.