Saif al Islam Gaddafi assassinated at his home:  లిబియా మాజీ నియంత   గడ్డాఫీ కుమారుడు మరియు ఆ దేశ రాజకీయాల్లో కీలక వ్యక్తి అయిన  సైఫ్ అల్-ఇస్లాం గడ్డాఫీ దారుణ హత్యకు గురయ్యారు.  పశ్చిమ లిబియాలోని జింతాన్ నగరంలో ఉన్న ఆయన నివాసంలో ఈ అటాక్ జరిగింది. గడ్డాఫీ మరణాన్ని ఆయన తరపు న్యాయవాది ఖలీద్ అల్-జైదీ ,  ఆయన రాజకీయ బృందం అధికారికంగా ధృవీకరించాయి. 2011లో తన తండ్రి పతనం తర్వాత లిబియా రాజకీయాల్లో మళ్లీ పుంజుకోవాలని చూస్తున్న తరుణంలో ఈ హత్య జరగడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది.

ఈ హత్య అత్యంత పక్కా వ్యూహంతో జరిగినట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం సుమారు నలుగురు ముసుగు ధరించిన దుండగులు సైఫ్ అల్-ఇస్లాం నివాసంలోకి చొరబడ్డారు. లోపలికి ప్రవేశించే ముందే వారు అక్కడి నిఘా కెమెరాలను  నిలిపివేశారు. ఆ తర్వాత జరిగిన ప్రత్యక్ష ఘర్షణలో దుండగులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన సైఫ్ అల్-ఇస్లాం అక్కడికక్కడే మరణించగా, నిందితులు వేగంగా పరారయ్యారు. ఈ ఘటనను ఆయన కార్యాలయం ఒక  పిరికిపంద చర్య గా అభివర్ణించింది.

సైఫ్ అల్-ఇస్లాం గడ్డాఫీ జీవితం అనేక మలుపులతో సాగింది. ఒకప్పుడు తన తండ్రికి వారసుడిగా, లిబియాలో సంస్కరణవాదిగా గుర్తింపు పొందిన ఆయన, 2011 విప్లవం తర్వాత తిరుగుబాటుదారులకు చిక్కారు. ఆ తర్వాత ఆరేళ్ల పాటు జింతాన్ జైలులోనే గడిపారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆయనపై యుద్ధ నేరాల కింద అరెస్ట్ వారెంట్ జారీ చేసినప్పటికీ, 2017లో అమ్నెస్టీ కింద విడుదలైనప్పటి నుంచి ఆయన జింతాన్‌లోనే అజ్ఞాతంగా ఉంటూ రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారు. 2021లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి మళ్లీ వార్తల్లో నిలిచారు.               

లిబియా అటార్నీ జనరల్ కార్యాలయం ఈ హత్యపై అధికారిక దర్యాప్తు ప్రారంభించింది. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆయన మరణం తుపాకీ కాల్పుల వల్లే జరిగిందని నిర్ధారించారు. అయితే, ఈ హత్య వెనుక ఎవరున్నారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ హత్య వల్ల లిబియాలో ఇప్పటికే ఉన్న రాజకీయ అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గడ్డాఫీ మద్దతుదారులు మరియు ప్రత్యర్థి వర్గాల మధ్య మళ్లీ హింస చెలరేగవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.