Covid-19 vaccine Side Effects: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌పై మరోసారి వివాదం ముసురుకుంది. ఇన్నాళ్లు దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నప్పటికి అధికారికంగా ఎవరూ సైడ్‌ఎఫెక్ట్స్‌ను ఎత్తి చూపలేదు. ఈ  కొవిడ వ్యాక్సిన్‌తో దుష్ప్రభావాలు ఉన్నాయని తొలిసారిగా ఆస్ట్రాజెనెకా ఫార్మాస్యూటికల్‌ దిగ్గజం నోరు విప్పింది.  


యునైటెడ్‌ కింగ్‌డమ్‌ హైకోర్టు సమర్పించిన డాక్యుమెంట్స్‌లో కీలక అంశాలను వెల్లడించింది ఆస్ట్రాజెనెకా సంస్థ. చాలా అరుదైన సందర్భాల్లో వచ్చే టీటీఎస్‌కి కొవిడ్ -19 వ్యాక్సిన్ కారణం కావచ్చని పేర్కొంది. టీటీఎస్ అంటే థ్రొంబోసిస్‌ విత్‌ థ్రొంబోసైటోపెనియా సిండ్రోమ్. ఈ వ్యాధి కారణంగా రక్తం గడ్డకట్టడం జరుగుతుందని అదే టైంలో రక్తంలోని ప్లేట్‌లెట్‌ కౌంట్‌ను కూడా తగ్గిస్తుందని తెలిపిందని టెలిగ్రాఫ్‌ పేర్కొంది. 


కోవిషీల్డ్‌తోపాటు వాక్స్జెవ్రియా వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ కలిసి రూపొందించాయి. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక ఆరోపణలు వచ్చాయి. దీని వల్ల రోగులు వేరే వ్యాధుల బారిన పడుతున్నారని చాలా మంది వైద్యులు మొత్తుకున్నారు. కానీ ఆస్ట్రాజెనెకా మాత్రం వాటిని ఖండిస్తూ వచ్చింది. కోర్టుల్లో కూడా చాలా కేసులు ఈ వ్యాక్సిన్‌పై వేశారు. 


ఇన్నాళ్లకు వాటన్నింటికీ పుల్‌స్టాప్ పెడుతూ తాము తయారు చేసిన వ్యాక్సిన్ వల్ల సైడ్‌ఎఫెక్ట్ ఉన్నట్టు కోర్టుకు తెలిపిందీ ఆస్ట్రాజెనెకా. ఈ వ్యాక్సిన్ వల్ల చాలా మంది తీవ్రమైన అస్వస్థతకు గురవుతున్నారని వేర్వేరు వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని కేసులు రిజిస్టర్ అయ్యాయి. కొందరు కోర్టులను కూడా ఆశ్రయించారు. ఈ కంపెనీకి వ్యతిరేకంగా మొదటి కేసును జామీ స్కాట్ అనే వ్యక్తి దాఖలు చేశాడు. 44 ఏళ్ల స్కాట్‌ వ్యాక్సిన్ తీసుకున్న పది రోజులకే అస్వస్థతకు గురయ్యారు. అప్పుడే అతన్ని ఆసుపత్రిలో చేర్పిస్తే వ్యాక్సిన్ వల్ల వచ్చే ఇమ్యూన్‌ థ్రోంబోసైటోపెనియాగా వైద్యులు అనుమానించారు. 


స్కాట్‌ తాత్కాలికంగా కోలుకున్నా పూర్తిగా ఆరోగ్యవంతుడు కాలేకపోయాడు. ఆయన మెదడు దెబ్బతింది. ఆ వ్యక్తి బతకడం కష్టమని పదే పదే వైద్యులు కుటుంబాని చెపుతూ వచ్చారు. దీనంతటికీ వ్యాక్సినే కారణమని గ్రహించిన స్కాట్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఆయనతోపాటు సుమారు 51 కేసులు నమోదు అయ్యాయి. వీళ్లంతా వంద మిలియన్ డాలర్లు నష్టపరిహారం సంస్థ నుంచి కోరుతున్నారు.


ఇన్నాళ్లూ ఈ ఆరోపణలు ఖండిస్తూ వచ్చింది ఆస్ట్రాజెనెకా. టీటీఎస్‌ కు కారణం వ్యాక్సిన్‌ అనే వాదనతో తాము ఏకీభవించబోమంటూ వాదిస్తూ వచ్చారు. ఇన్నాళ్లు తప్పు అన్నది ఇప్పుడు ఒప్పుకుందా సంస్థ. ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సంస్థ ఇలా చెప్పుకొచ్చింది. " ఏజెడ్‌ టీకా వల్ల చాలా అరుదైన సందర్భాల్లో టీటీఎస్‌కి కారమమవుతుందని గ్రహించాం. దీనికి కారణాలు మాత్రం తెలియడం లేదు. 


బాధితుల తరఫున వాదించిన లాయర్లు... వ్యాక్సిన్‌ లోపభూయిష్టంగా ఉందని వాదించారు. ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడంలో కూడా సంస్థ ప్రయత్నించలేదని మార్కెట్‌లోకి వదిలారంటూ వాదించారు. దీన్ని ఆస్ట్రాజెనెకా సంస్థ లాయర్లు ఖండించారు. 


 ఈ కరోనా వ్యాక్సిన్‌పై తొలి కేసు వేసిన జామీస్కాట్‌ భార్య ది టెలిగ్రాఫ్ పత్రికతో మాట్లాడుతూ జామీ పరిస్థితికి ఆస్ట్రాజెనెకా, ఆ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ మాత్రమే కారమణని వాపోయారు. ఈ లోపాన్ని ప్రపంచమంతా గుర్తించిందని తెలిపారు. ఇప్పుడు వాళ్లు అంగీకరించడానికి మూడేళ్ల సమయం పట్టిందని నిజంగా ఇదో పెద్ద పురోగతిగా అభిప్రాయపడ్డారు. 


ఇకపై ఈ కేసును త్వరగా విచారణ చేయాలని స్కాట్ భార్య అభ్యర్థించారు. మరిన్ని వివరాలు ప్రజల ముందు ఉంచాల్సిన టైం వచ్చిందన్నారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం కావాలని కోరారు. తమతోపాటు తమలాంటి చాలా మంది ఫ్యామిలీస్‌కు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అప్పటి వరకు ఈ కేసును వదిలే పరిస్థితి లేదని అన్నారు.