Microsoft shuts down Pakistan office after 25 years : పాకిస్తాన్లో సాఫ్ట్ వేర్ పరిశ్రమ ఉందా.. అంటే చాలా మందికి ఉందని తెలియదు. పాతికేళ్ల క్రితమే మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ను పాకిస్తాన్ లో ఏర్పాటు చేశారు. మైక్రోసాఫ్ట్ 2000లో పాకిస్తాన్లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. జూలై 3, 2025 నాటికి, 25 సంవత్సరాల తర్వాత, తన కార్యాలయాన్ని అధికారికంగా మూసివేసింది. గ్లోబల్ రీస్ట్రక్చరింగ్, క్లౌడ్-ఆధారిత, పార్టనర్-లెడ్ మోడల్కు మార్పులో భాగంగా పాకిస్తాన్ క్యాంపస్ అక్కరలేదని నిర్ణయించుకుంది. ఈ మూసివేత ప్రక్రియలో, పాకిస్తాన్లోని మైక్రోసాఫ్ట్ చివరి కొద్ది మంది ఉద్యోగులకు అధికారికంగా సమాచారం అందించింది.
పాకిస్తాన్లో ఆర్థిక అస్థిరత, అధిక పన్నులు, టెక్ దిగుమతులలో సమస్యలు, రాజకీయ అనిశ్చితి వంటి కారణాలు మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అయ్యాయి. జూన్ 2025 నాటికి, పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు కేవలం 11.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి, ఇది టెక్ దిగుమతులు, విదేశీ పెట్టుబడులపై ప్రభావం చూపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ వాణిజ్య లోటు 24.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మైక్రోసాఫ్ట్ యొక్క పాకిస్తాన్ కార్యాలయ మూసివేత గ్లోబల్ వర్క్ఫోర్స్ తగ్గింపులో భాగంగా జరిగిందని అనుకోవచ్చు. ఇటీవల మైక్రోసాఫ్ట్ మొత్తం 2,28,000 మంది ఉద్యోగులలో 4 శాతం మందిని తొలగించింది.
నిజానికి మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో ఒక సంపూర్ణ ఇంజనీరింగ్ బేస్ను ఎప్పుడూ స్థాపించలేదు. Azure , Office వంటి ఉత్పత్తుల విక్రయాలపై దృష్టి సారించి లైజన్ కార్యాలయాలను నిర్వహించింది. గతంలో, మైక్రోసాఫ్ట్ గ్రామీణ ప్రాంతాలలో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయడం, వ్యాపారాలను డిజిటైజ్ చేయడం, విద్యా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వంటి కార్యక్రమాలను నిర్వహించింది. స్థానిక ప్రతిభను పెంపొందించడం, ఎంటర్ప్రైజ్ భాగస్వామ్యాలను నిర్మించడం, ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులలో ప్రభుత్వ విభాగాలతో భాగస్వామ్యం చేయడం ద్వారా పాకిస్తాన్లో డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించింది.
మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ నుంచి వెళ్లిపోవాలని అనుకోవడం ఆ దేశ టెక్ రంగానికి గణనీయమైన దెబ్బగా భావిస్తున్నారు. ఇది దేశ ఆర్థిక భవిష్యత్తుకు "ఆందోళనకర సంకేతం"గా ఆందోళన వ్యక్తమవుతోంది. గత కొన్ని సంవత్సరాలలో, మైక్రోసాఫ్ట్ లైసెన్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ను ఐర్లాండ్లోని యూరోపియన్ హబ్కు బదిలీ చేసింది. 2022లో, మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో తన క్యాంపస్ ను విస్తరించాలని అనుకుంది. కానీ రాజకీయ అస్థిరత కారణంగా వియత్నాంలో ఆ ప్రణాళికలు అమలు చేసింది. ఇతర బహుళజాతి సంస్థలు కూడా పాకిస్తాన్లో కార్యకలాపాలను తగ్గించాయి లేదా పూర్తిగా మూసివేస్తున్నాయి.