Israel Strike On Iran | టెహ్రాన్: ఇజ్రాయెల్ చేస్తున్న డ్రోన్ దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.  వైమానిక దాడులు ఉధృతం కావడంతో, అక్కడ ఉన్న ఒక భారత విద్యార్థిని వెంటనే తమను స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఒక వీడియోలో ఆమె అక్కడి పరిస్థితి గందరగోళంగా, దారుణంగా ఉందని వివరించారు. భారతీయుల భద్రత కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

"నేను ఒక భారత విద్యార్థిని, ప్రస్తుతం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఉన్నాను. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా, భయంకరంగా ఉంది. తరువాత ఏం జరుగుతుందో మాకు అస్సలు తెలియడం లేదు" అని విద్యార్థి ఆ వీడియోలో పేర్కొన్నారు.

వేగవంతమైన చర్యల కోసం విద్యార్థిని విన్నపం

ఇరాన్‌లో నెలకొన్న పరిస్థితులను వివరించించిన ఆ విద్యార్థిని భారత అధికారులు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలుపుతూనే, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా తరలింపు ప్రక్రియలో వేగం పెంచాలని కోరారు. "మా భద్రత గురించి భారత ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్చిస్తున్నందుకు వారికి కృతజ్ఞుత చెబుతున్నాను. కానీ ఇటువంటి సమయాల్లో వేగం చాలా ముఖ్యం" అని ఆమె అన్నారు. వైమానిక దాడుల తీవ్రత కారణంగా తాను సరిగ్గా మాట్లాడలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైమానిక దాడులు జరుగుతున్నాయి, మా పరిస్థితి మరింత దిగజారుతోంది. అందుకే నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను అని పేర్కొన్నారు.

‘దయచేసి వేచి చూడకండి’: రక్షణ కోసం భావోద్వేగ విన్నపం

ఇరాన్ లో చిక్కుకున్న విద్యార్థుల తరలింపు ప్రయత్నాలలో జాప్యం చేయవద్దని, టెహ్రాన్‌లోని భారతీయుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అధికారులను కోరారు. ‘వీలైనంత త్వరగా తరలింపు ప్రక్రియను చేపట్టాలని కోరుతున్నాము. దయచేసి పరిస్థితి ఇంకా దారుణంగా మారే వరకు వేచి చూడకండి. సాధ్యమైనంత వెంటనే మాకు సహాయం చేయండి. దయచేసి మమ్మల్ని వీలైనంత త్వరగా ఇక్కడి నుండి బయటపడేయండి’ అని ఆ విద్యార్థిని రిక్వెస్ట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.