Nuclear attack Fear on Tehran:   పశ్చిమ ఆసియాలో యుద్ధం పెను ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇరాన్‌లోని అణు కేంద్రాలు , సైనిక స్థావరాలపై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు తీవ్రతరం కావడంతో, పరిస్థితి అణు యుద్ధానికి దారితీసే అవకాశం ఉందనే హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దాదాపు కోటి జనాభా కలిగిన టెహ్రాన్ నగరంపై అణు ఆయుధాల ప్రయోగం జరిగితే సంభవించే భారీ ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది జరిగితే  కేవలం సైనిక చర్య మాత్రమే కాదని అంతకు మించి అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

Continues below advertisement

న్యూక్లియర్ వింటర్  ముప్పు? 

ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షణ సంస్థ  ఇరాన్‌లోని అణు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. యుద్ధం గనుక అణు స్థాయికి చేరితే, అది కేవలం ఇరాన్‌కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్త వాతావరణాన్ని ప్రభావితం చేసే  న్యూక్లియర్ వింటర్ కు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెహ్రాన్ వంటి జనసాంద్రత కలిగిన నగరాలపై బాంబులు వేయడం అంటే లక్షలాది కుటుంబాలను, చిన్నారులను బలితీసుకోవడమేనని, యుద్ధ కాంక్షతో ఉన్న నాయకులు వాస్తవ పరిస్థితులను గ్రహించడం లేదని  అంతర్జాతీయ నిపుణులు  అంచనా వేస్తున్నారు.   

Continues below advertisement

అమెరికాలో వెల్లువెత్తిన నో కింగ్స్ నిరసనలు 

అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న యుద్ధ వ్యూహాలకు వ్యతిరేకంగా ప్రజా ఆగ్రహం పెల్లుబుకుతోంది. గత శనివారం  అమెరికా వ్యాప్తంగా జరిగిన  నో కింగ్స్  భారీ ప్రదర్శనల్లో సుమారు కోటి మంది పాల్గొన్నట్లు సమాచారం. నియంతృత్వ పోకడలు వదలాలని, ఇరాన్‌పై అనవసర యుద్ధాన్ని ఆపాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. వాషింగ్టన్ డి.సి మొదలుకొని అనేక ప్రధాన నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి మానవత్వం కోసం గొంతు వినిపిస్తున్నారు. అయితే ఈ నిరసనల్నిచూసి ట్రంప్ మరింతగా రెచ్చిపోతున్నారు.  

 విధ్వంసక బాటలో అగ్రరాజ్యాలు 

ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధంలో ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా పలువురు కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ కూడా ప్రతీకారంగా క్షిపణి దాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై నేరుగా దాడులు చేయడంతో అణు ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ సమాజం భయపడుతోంది. యుద్ధం వల్ల సామాన్య ప్రజలే భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు  అని ఐక్యరాజ్యసమితి  ఆవేదన వ్యక్తం చేస్తోంది.  ప్రస్తుతానికి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రపంచ దేశాలు కోరుతున్నప్పటికీ, యుద్ధ జ్వాలలు ఏ క్షణమైనా అదుపు తప్పేలా కనిపిస్తున్నాయని.. అత్యంత భయంకరమైన పరిస్థితులు ఎదురు వస్తున్నయని భయపడుతున్నారు. అయితే ఎంత యుద్ధం జరిగినా అణుయుద్ధం మాత్రం జరగకూడదని ప్రపంచం కోరుకుంటోంది.