Iran conditions for ceasefire agreement:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్  వేదికగా ఇరాన్‌కు అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. బుధవారం తెల్లవారుజామున  ఇరాన్ కాలమానం ప్రకారం  లోపు హర్మూజ్ జలసంధిని చమురు రవాణా కోసం పూర్తిగా తెరవకపోతే, ఇరాన్‌లోని అన్ని ప్రధాన వంతెనలు , విద్యుత్ కేంద్రాలను పేల్చివేస్తానని బెదిరించారు. మంగళవారాన్ని ఆయన  పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే గా అభివర్ణిస్తూ, ఇరాన్ ఎన్నడూ చూడని రీతిలో దాడులు ఉంటాయని హెచ్చరించారు.

Continues below advertisement

 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన 

ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న తరుణంలో, పాకిస్థాన్, ఈజిప్ట్ , తుర్కియే దేశాలు మధ్యవర్తులుగా రంగంలోకి దిగాయి. యుద్ధాన్ని నివారించేందుకు వీరు 45 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని ఒక ముసాయిదా ప్రణాళికను ఇరు దేశాల ముందు ఉంచారు. ఈ 45 రోజుల సమయంలో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు నేరుగా లేదా మధ్యవర్తుల ద్వారా చర్చలు జరిపి, యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేలా ఒక సమగ్ర ఒప్పందానికి రావాలనేది ఈ ప్లాన్ ఉద్దేశ్యం.

Continues below advertisement

హర్మూజ్ జలసంధిపై పట్టు 

ప్రస్తుతానికి ఇరాన్ ఈ జలసంధి గుండా కేవలం కొన్ని ఎంపిక చేసిన దేశాల నౌకలను మాత్రమే అనుమతిస్తోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం కలుగుతోంది. అయితే, మధ్యవర్తుల ప్రతిపాదన ప్రకారం, యుద్ధం ముగిసేలోపు ఇరాన్ ఈ జలసంధిని పూర్తిగా తెరవాల్సి ఉంటుంది. దీనికి ప్రతిగా అమెరికా తన దాడులను నిలిపివేసి, శాంతి చర్చలకు మొగ్గు చూపాలని సూచించారు.

మధ్యవర్తులుగా పాకిస్థాన్ కీలక పాత్ర 

ఈ చర్చల్లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఆదివారం రాత్రంతా అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, చర్చల ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలతో ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అమెరికా పంపిన 15 అంశాల శాంతి ప్రణాళికను కూడా పాకిస్థాన్ ఇరాన్‌కు చేరవేసింది. అయితే, అమెరికా డిమాండ్లు చాలా కఠినంగా ఉన్నాయని ఇరాన్ ప్రాథమికంగా పెదవి విరిచింది.

ఇరాన్ ఆందోళనలు 

ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ శాఖ స్పందిస్తూ.. అల్టిమేటంలు, యుద్ధ నేరాలకు పాల్పడతామనే బెదిరింపుల మధ్య చర్చలు జరపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్‌లోని యూనివర్సిటీలు, ఆసుపత్రులు, చమురు కేంద్రాలు దెబ్బతిన్నాయని, దీనికి పరిహారం చెల్లిస్తేనే జలసంధిని తెరుస్తామని కొందరు ఇరాన్ అధికారులు వాదిస్తున్నారు. అలాగే, గాజా లేదా లెబనాన్ తరహాలో పేరుకు కాల్పుల విరమణ ఉండి, అమెరికా ఎప్పుడు పడితే అప్పుడు దాడులు చేస్తుందనే భయం కూడా ఇరాన్‌లో నెలకొంది.

 యుద్ధం వల్ల భారీ ప్రాణనష్టం 

ఇప్పటివరకు జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ , ఇరాన్ యుద్ధంలో ఇరాన్‌లో 2,000 మందికి పైగా మరణించారు. లెబనాన్‌లో 1,500 మంది, ఇరాక్ , గల్ఫ్ దేశాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కూడా 13 మంది సైనికులను కోల్పోయింది. ట్రంప్ విధించిన గడువు లోపు మధ్యవర్తుల ప్రయత్నాలు సఫలమైతేనే ప్రపంచం మరో పెను విపత్తు నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది.