Ceasefire between Iran and US:  అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, యుద్ధాన్ని నిలిపివేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.  గత ఫిబ్రవరి 28 నుండి కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగా ముగింపు పలికేందుకు ఒక ముసాయిదా ప్లాన్ సిద్ధమైంది. దీని ప్రకారం  45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని మధ్యవర్తులు ప్రతిపాదించారు. ఈ గడువులోగా రెండు దేశాలు చర్చలు జరిపి, యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేలా ఒక సమగ్ర ఒప్పందానికి రావాలనేది ఈ ప్లాన్   ముఖ్య ఉద్దేశ్యం.

Continues below advertisement

హర్మూజ్ జలసంధి పునరుద్ధరణ

ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన  హర్మూజ్ జలసంధిని  తక్షణమే తెరవాలని ఈ ప్రతిపాదనలో సూచించారు. ఇరాన్ ఈ జలసంధిని మూసివేయడంతో గ్లోబల్ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే, దీనిని తెరవాలంటే అమెరికా తన ఆంక్షలను సడలించాలని, కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ కోసం జలసంధిని తెరవలేమని ఇరాన్ స్పష్టం చేస్తోంది.   

Continues below advertisement

ముగ్గురు మధ్యవర్తుల పాత్ర

ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు  పాకిస్థాన్, ఈజిప్టు , తుర్కియే దేశాలు చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ నేతృత్వంలో ఈ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ , ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మధ్య ఈ మూడు దేశాలు రాయబారం నడుపుతున్నాయి.  ఇస్లామాబాద్ అకార్డ్  పేరుతో ఈ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ట్రంప్ డెడ్ లైన్ - ఉత్కంఠ 

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 7 మంగళవారం రాత్రి  లోపు హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై భారీ దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే, చర్చలు సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయని, సోమవారం నాటికి ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందం గనుక కుదిరితే, గత ఆరు వారాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధం ఆగిపోయి, చమురు సరఫరా యథాతథ స్థితికి చేరే అవకాశం ఉంది.